Toxic Gas : గుజరాత్ (Gujarat) లోని ప్రముఖ ఇండస్ట్రియల్ సిటీ సూరత్ (Surat) లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఓ జ్యుయెలరీ పరిశ్రమలో విషవాయువులు లీక్ అయ్యి ఒక సూపర్వైజర్ సహా నలుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. అశ్విని కుమార్ రోడ్డులోని జ్యుయెలరీ పరిశ్రమలో జ్యుయెలరీ తయారీ ప్రక్రియలో వెలువడే రసాయన వ్యర్థాలను సేకరించేందుకు ఓ ఈటీపీ (Effluent Treatment Plant) సెప్టిక్ ట్యాంక్ను ఏర్పాటు చేశారు. ప్రతి 2 నెలలకు ఒకసారి ఈ ట్యాంక్ను శుభ్రం చేయాల్సి ఉంటుంది.
ఎప్పటిలాగే ఇవాళ ఉదయం ఓ సూపర్వైజర్, ముగ్గురు కార్మికులతో కూడిన నలుగురు సభ్యుల బృందం ఆ ట్యాంక్ను క్లీన్ చేయడానికి వెళ్లింది. ట్యాంక్ క్లీన్ చేస్తున్న సమయంలో ఓ కార్మికుడు అకస్మాత్తుగా లోపలికి జారిపడిపోయాడు. అతనిని కాపాడే క్రమంలో మిగిలిన ముగ్గురు కూడా ఒకరి వెనుక ఒకరు ట్యాంక్ లోపలికి దిగారు. అయితే ట్యాంక్లో అప్పటికే పేరుకుపోయిన రసాయనాల వల్ల తీవ్రమైన విషవాయువులు వెలువడటంతో.. ఊపిరాడక నలుగురు అక్కడికక్కడే స్పృహతప్పి పడిపోయి ప్రాణాలు విడిచారు.
సీసీటీవీ ఫుటేజీల పరిశీలించిన అనంతరం.. కార్మికులు సేఫ్టీ మాస్క్లు ధరించలేదని స్పష్టమైందని పోలీసులు తెలిపారు. రసాయన వ్యర్థాల వల్ల ఏర్పడిన పాయిజనస్ గ్యాస్ కారణంగానే వారు మరణించినట్లుగా భావిస్తున్నామని అన్నారు. పూర్తి వివరాలు పోస్ట్మార్టం నివేదిక వచ్చాకే తెలుస్తాయని పేర్కొన్నారు. ట్యాంక్ లోపలికి దిగే ముందు సూపర్వైజర్ అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేసినప్పటికీ వారు వచ్చేలోపే వీరు లోపలికి దిగడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ట్యాంక్ నుంచి నలుగురి మృతదేహాలను వెలికితీసి ఆసుపత్రికి తరలించారు.