హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతున్నా ఆ ఫలాలు మాత్రం 111 జీవో పరిధిలోని 84 గ్రామాలకు ఇంతకాలం దక్కలేదు. చుట్టుపక్కల ప్రాంతాలు మహానగరంలో భాగమవుతున్నా, ఆ గ్రామాలు నగరానికి చెంతనే ఉన్నప్పటికీ అభివృద్ధికి దూరంగా ఉండిపోయాయి. పక్కనే పదుల అంతస్తుల్లో అపార్ట్మెంట్లు వెలుస్తున్నా, ఆ గ్రామాల్లో మాత్రం జీ+2కు మించి ఇండ్లు కట్టుకునే అవకాశం లేదు. అవసరానికి భూమి అమ్ముకుందామనుకున్నా సరైన ధర ఉండదు. వ్యవసాయేతర అవసరాలకు వినియోగించుకునేందుకు అనుమతులుండవు. జీవో 111 ఆ 84 గ్రామాల పాలిట శాపంలా మారింది. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఆ జీవోను పూర్తిగా ఎత్తేస్తూ నిర్ణయం తీసుకోవడంతో వారికి 27 ఏండ్ల గ్రహణం వీడినట్టయ్యింది. తమ కల నెరవేరిందని, తమ గ్రామాలకు కొత్త కళ రాబోతోందని ఆ గ్రామాల వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఒకప్పుడు హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ (గండిపేట).. హైదరాబాద్ నగరం తాగునీటి అవసరాలు తీర్చేవి. ఈ జంట జలాశయాలు కలుషితం కాకుండా, వాటిని పరిరక్షించాలనే ఉద్దేశంతో 1996 మార్చి 8న అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం జీవో 111 తీసుకువచ్చింది. ఈ రెండు జలాశయాల పరివాహక ప్రాంతాల్లో పది కిలోమీటర్ల వరకు గ్రామాలను ఈ జీవో పరిధిలోకి తీసుకువచ్చింది. ఆ గ్రామాల్లో భూములను వ్యవసాయ, వినోద (రిక్రియేషన్) అవసరాలకు మినహా వ్యవసాయేతర అవసరాలకు వినియోగించకూడదు. మొత్తం భూమిలో 10 శాతానికి మించి నిర్మాణాలు చేపట్టకూడదు. జీ+2కి మించి భవనాలు కట్టకూడదు. ఇలా అనేక నిబంధనలు ఈ జీవో ద్వారా అమల్లోకి వచ్చాయి. అయితే, ఈ నిబంధనలే కాలక్రమంలో ఈ గ్రామాల్లో అభివృద్ధిని అడ్డుకునే బంధనాలుగా మారాయి. హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతున్నా, తమ సమీపంలోనే ఐటీ హబ్ ఏర్పడినా ఈ గ్రామా ల్లో మాత్రం పాతికేండ్లుగా ఎలాంటి మార్పు రాలేదు. పైగా ఈ నిబంధనల వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇల్లు కట్టుకోవాలన్నా, బోరు వేసుకోవాలన్నా కూడా ఆంక్షలు అడ్డువచ్చేవి. వ్యవసాయ రుణాలు తప్పించి ఇతర రుణాలు వచ్చేవి కాదు.
ఇక్కడి ప్రజలంతా తమ అభివృద్ధికి అడ్డంకిగా, తమ నెత్తి మీద గుదిబండగా మారిన జీవో 111ను ఎత్తేయాలని 20 ఏండ్లుగా పోరాడుతున్నారు. ఇందుకోసం వారు ఒక పోరాట సమితిని కూడా ఏర్పాటు చేసుకున్నా రు. ఈ జీవో వల్ల తమకు జరుగుతున్న నష్టాన్ని ప్రతి ప్రభుత్వానికి, ప్రతి ముఖ్యమంత్రికి వివరించి రద్దు చేయాలని విన్నవించారు. కానీ, వారి కోరికను ఎవరూ నెరవేర్చలేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాకే జీవో 111 ఎత్తివేస్తారని ప్రజల్లో ఆశలు పెరిగాయి. కేసీఆర్ చెప్పారంటే కచ్చితంగా చేస్తారనే నమ్మకంతో ఎదురుచూస్తున్న ప్రజలకు, తెలంగాణ ప్రభు త్వం మే 18న జరిగిన క్యాబినెట్ భేటీలో శుభవార్త చెప్పింది. ఈ జీవోను పూర్తిగా ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది.
పాతికేండ్ల క్రితం వరకు హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చేందుకు జంట జలాశయాలే కీలకంగా ఉండేవి. తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చింది. హైదరాబాద్ నగరం వేగంగా విస్తరించింది. జనాభా భారీగా పెరిగిపోయింది. దీంతో తాగునీటి అవసరాలు కూడా పెరిగిపోయాయి. ఇందుకు తగ్గట్టుగానే తెలంగాణ ప్రభుత్వం కృష్ణా, గోదావరి, మంజీరా నీటిని నగరానికి సరిపడా సరఫరా చేస్తోంది.
రానున్న 50 ఏండ్ల పాటు నగరానికి తాగునీటికి ఢోకా ఉండకుండా, నగర జనాభా రెట్టిం పైనా సరిపడే విధంగాకాళేశ్వరం నీటిని నగరానికి తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నది. కొండపోచమ్మ సాగర్ నుంచి కూడా జంట జలాశయాలకు నీటిని తరలించాలని క్యాబినెట్లో ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే కృష్ణా నది నుంచి నిరంతర నీటి సరఫరా ఉండేలా సుంకిశాల ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తున్నది. ఈ చర్యలతో హైదరాబాద్ తాగునీటి అవసరాలకు భవిష్యత్తులో ఎలాంటి లోటు ఉండదు. ఈ చర్యలే జీవో 111ను ఎత్తివేసేందుకు దోహదపడ్డాయి. ఆ జీవోను ఎత్తివేసినా జీవో ఉద్దేశం మాత్రం దెబ్బతినకుండా, జంట జలాశయాలు కలుషితం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం గతేడాది ఒక కమిటీని వేసింది. ఈ కమిటీ సిఫార్సుల మేరకు రూ.960 కోట్లతో 22 మురుగునీటి శుద్ధి కేంద్రాలు(ఎస్టీపీ)లు, ట్రంక్ మెయిన్ నిర్మించనున్నది. ఇప్పటికే రూ.84 కోట్లతో నాలుగు ఎస్టీపీల నిర్మాణాన్ని జలమండలి చేపడుతోం ది. మరోవైపు, ఈ ప్రాంతానికి కాలుష్య కారక పరిశ్రమలు రాకుండా, ఐటీ రంగం విస్తరించే లా ప్రభుత్వం కృషి చేస్తున్నది. తద్వారా జీవో 111 లేకపోయినా జంట జలాశయాలు కలుషితం కావొద్దనే ఉద్దేశం కొనసాగనున్నది.
జీవో 111 పరిధిలో మొయినాబాద్, శం షాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి, షాబాద్, రాజేంద్రనగర్, కొత్తూరు మండలాల్లోని 84 గ్రామా లున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మొత్తం విస్తీ ర్ణం 625 చదరపు కిలోమీటర్లు కాగా ఈ 84 గ్రామలు దాదాపు 500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి. వీటి వల్ల కొత్తగా లక్షా 32 వేల 600 ఎకరాల భూమి అందుబాటులోకి రానుంది. ఫలితంగా గచ్చిబౌలి, పుప్పాలగూడ, నార్సింగి, కోకాపేట తదితర ప్రాంతా ల నుంచి ఈ గ్రామాలకు కూడా అభివృద్ధి విస్తరించనుంది.
రానున్న రోజుల్లో హైదరాబాద్ చెంతనే ఒక కొత్త మహానగరమే ఈ ప్రాంతంలో రూపుదిద్దుకునే అవకాశం ఉన్నది. జీవో 111ను ఎత్తివేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హైదరాబాద్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచి పోతుంది.
డా ఎన్. యాదగిరి రావు: 97044 05335
(వ్యాసకర్త : అదనపు కమీషనర్, జీహెచ్ఎంసీ)