మహువా మొయిత్రా ఫైర్బ్రాండ్ ఎంపీ. లోక్సభలో ఆమె మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడితే ఆరోజు టీవీ చానళ్లకు పండుగే. బాగా చదువుకున్న మహిళ. వాదనా పటిమ దండిగా ఉంది. ఎన్నో సందర్భాల్లో ఆమె నేరుగా ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకొని శరపరంపరగా విమర్శలు కురిపించారు. మోదీకి అత్యంత సన్నిహితుడిగా పేరుపొందిన వ్యాపారవేత్త గౌతం అదానీపై కూడా పలు సందర్భాల్లో ఆమె సభాముఖంగా విమర్శలు చేశారు. సామాజిక మాధ్యమాల్లోనూ ఆమె ప్రసంగాలు వైరల్ అవడం తెలిసిందే. కానీ, ప్రస్తుతం ఆమె ప్రశ్నలు సంధించడం కాకుండా సమాధానాలు చెప్పాల్సిన పరిస్థితిలో పడ్డారు. లోక్సభలో ప్రశ్నలు వేసేందుకు డబ్బులు తీసుకున్నారని ఆమెపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి.
అదానీకి సంబంధించిన ప్రశ్నలు వేసేందుకు దుబాయ్ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి మహువా డబ్బులు, కానుకలు స్వీకరించారన్నది ఆరోపణ. లోక్సభ ప్రశ్నలకు సంబంధించిన తన లాగిన్ను కూడా ఆమె బయటివారికి ఇచ్చారని అంటున్నారు. దీనిపై స్పీకర్ ఓం బిర్లాకు బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే ఫిర్యాదు చేశారు. ఆయన దానిని నైతిక విలువల కమిటీకి పంపించారు. జై అనంత్ దేహద్రాయ్ అనే సుప్రీంకోర్టు న్యాయవాది తన దగ్గర ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలున్నాయని అంటున్నారు. చైర్మన్ వినోద్కుమార్ సోంకర్ నేతృత్వంలోని సదరు కమిటీ దూబే, దేహద్రాయ్లను పిలిచి వాంగ్మూలాలను నమోదు చేసింది. అక్టోబర్ 31న తమ ముందు హాజరుకావాలని మొయిత్రాను కమిటీ ఆదేశించింది. ఇదంతా చూస్తుంటే తృణమూల్ ఎంపీ చుట్టూ ఉచ్చు బిగుస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. సాధారణంగా కేంద్రం తమవారిని లక్ష్యంగా చేసుకొని ఏ చర్య తీసుకున్నా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిప్పులు చెరుగుతారు. కానీ మహువా వ్యవహారం లో ఆమె పెద్దగా స్పందించకపోవడం గమనార్హం. ఇతర పార్టీ నాయకులు కూడా ముక్తసరిగా మాట్లాడుతున్నారు. ఎథిక్స్ కమిటీ తీర్పు వెలువడిన తర్వాత పార్టీ ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుందని తృణమూల్ రాజ్యసభ సభ్యుడు డెరెక్ ఓబ్రియన్ పొడిపొడి సమాధానం ఇవ్వడం గమనార్హం.
ఈ వ్యవహారంలో పలు అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఫిర్యాదుదారు దూబే విద్యార్హతలపై మొయిత్రా గతంలో ఆరోపణలు చేశారు. ఇక సాక్ష్యాలు సమకూరుస్తానంటున్న దేహద్రాయ్ తో మొయిత్రా కొన్నాళ్లు సహజీవనం చేశారు. తర్వాత విడిపోయారు. ఓ పెంపుడు కుక్క, మరికొన్ని వస్తువుల విషయంలో వారిద్దరి మధ్య ఏర్పడిన తగాదాలు బయటికి పొక్కాయి. తన మీద కక్షతో దేహద్రాయ్ ఇదంతా చేస్తున్నాడని మొయిత్రా అంటున్నారు. అయితే ఇప్పుడు విషయం వారిద్దరి వ్యక్తిగత తగాదాల పరిధి దాటి లోక్సభ కమిటీ ముందు విచారణ స్థాయికి చేరుకున్నది. మొయిత్రా వ్యవహారం 2005లో దుమారం రేపిన స్టింగ్ ఆపరేషన్ను గుర్తుకుతెస్తున్నది. ఈ వ్యవహారం ఎటు తిరుగుతుందో వేచిచూడాలి.