తరతరాలుగా దేశంలో బడుగు బలహీనవర్గాలు విద్యకు దూరం చేయబడ్డారు. బ్రిటిష్ కాలంలో లార్డ్ కర్జన్ ఆధునిక ఆంగ్లవిద్య ప్రవేశ పెట్టే నాటికి (1890) దేశ అక్షరాస్యత 2.3 శాతం. ఆంగ్లేయులు ఆధునిక, లౌకిక విద్య ప్రవేశపెట్టి అందరికీ విద్య అందించడం మొదలైన తర్వాతనే శూద్ర, అతిశూద్ర కులాలవారు కొంతవరకైనా చదువుకొని జీవితాలను గెలుచుకొన్నారు.
మెకాలే ప్రవేశపెట్టిన పాఠశాల విద్యవరకు తెలుగు (మాతృభాష) మాధ్యమం, ఉన్నత విద్య ఇంగ్లీష్ మాధ్యమం మంచి ఫలితాలనిచ్చింది. 1951 వరకు దేశ అక్షరాస్యత 16 శాతం వరకు పెరిగింది. రాజ్యాంగంలో Right to Education హక్కును పొందుపరిచారు. దీంతో గత యాభై ఏండ్లలో అక్షరాస్యత 70 శాతం వరకు పెరిగింది. అయినా మిగిలి ఉన్న 30 శాతం నిరక్షరాస్యుల్లో మెజారిటీ దళిత, బహుజన, గిరిజన జాతులకు చెందినవారే ఉండటం గమనార్హం.
ఆధునిక ప్రపంచంలో ప్రైవేట్రంగంలో ఉద్యోగాలు పెరిగాయి. ఐటీ, సేవారంగాల్లో ఉద్యోగాల జోరుతో ఇంగ్లీషు విద్య అనివార్యమైంది. దీంతో బహుజనుల్లో తమకూ ఇంగ్లీషు మాధ్యమం కావాలన్న కోరిక పెరిగింది. శాస్త్ర సాంకేతికత చాలావరకు ఇంగ్లీష్లోనే ఉండటంతో ఇంగ్లీషు చదవాల్సిన అవసరాన్ని తప్పనిసరి చేశాయి. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇంగ్లీషు మాధ్యమం కావాలన్న డిమాండ్ మెజారిటీ ప్రజల నుంచి ఉన్నది.
ప్రజాభీష్టం మేరకు సీఎం కేసీఆర్ విద్యా సంస్కరణలను ప్రవేశపెట్టారు. మెజారిటీ ప్రజలైన దళిత బహుజనులు కోరుకుంటున్న ఇంగ్లీష్ మాధ్యమ విద్యపై దృష్టిపెట్టారు. అందరికీ నాణ్యమైన విద్యనందించడానికి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పేదలకు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేట్ కళాశాలలను ఏర్పాటు చేశారు.
పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడుతూ రాష్ట్రం, దేశంలో ఎక్కడైనా, విదేశాల్లోనూ ఉద్యోగాలు సంపాదించుకోవాలని పేద ప్రజలు కోరుకుంటున్నారు. ప్రభుత్వ రంగంలో ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రవేశపెడితేనే బడుగు ప్రజల చదువు స్వప్నం సాకారమవుతుంది. ప్రజల అభ్యున్నతి గురించి ఆలోచించే కేసీఆర్ తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలన్నింట్లో ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నామని ప్రకటించారు. ఇది దేశానికే ఆదర్శప్రాయమైన నేటి సామాజికావసరమైన అద్భుత చర్య.
ఇంగ్లీష్ మాధ్యమంతో తెలుగు విస్మరణకు గురై మాతృభాష మృతభాష అవుతుందనే వాళ్ళున్నారు. కానీ అది సత్యదూరం. ఇప్పుడున్న విధానంలో ప్రైవేట్లో ఇంగ్లీష్ మాధ్యమంతో, తెలుగును ఒక సబ్జెక్టుగా కూడా చదువకుండా కేజీ టు పీజీ చదువులు కొనసాగుతున్నాయి. ఈ స్థితిని చూసే UNESCO, NCERT తెలుగు మృత భాషవుతుందని చెప్పింది. చదువుల్లో లేని భాష మృతభాష కావడం ఖాయం. అన్ని పాఠశాలల్లోనూ, కేజీ నుంచి పీజీ దాకా అన్ని కోర్సుల్లోనూ ఒక సబ్జెక్టుగా తెలుగు (మాతృభాష)ను తప్పనిసరి చేసే చదువుల వల్ల తెలుగు భాషకు ప్రమాదమేమీ ఉండదు. పాలనా భాషగా, అధికారభాషగా తెలుగు, ఇంగ్లీష్ ఉంటాయి. మాతృభాష రావడం వల్ల ఇంగ్లీష్ సులభమవుతుంది. ఒక సబ్జెక్టుగా తెలుగూ మాతృభాషగా పరిపూర్ణత సాధిస్తుంది. అట్లని మాతృభాషా మాధ్యమాలు అసలే ఉండొద్దని కాదు. మాతృభాషలో విద్యతోనే అనేక దేశాల్లో అద్భుత ఫలితాలు సాధించిన అనుభవాలూ ఉన్నాయి. ఇలాంటి చదువులతోనే ‘Think Globally, Act Locally’ అన్నది సార్థకమవుతుంది.
– డాక్టర్ కాలువ మల్లయ్య, 91829 18567