మానవాభివృద్ధికి చిహ్నాలు వ్యవసాయం, విద్య, ఆరోగ్య రంగాలు. ఈ మూడు రంగాలు సమపాళ్లలో అభివృద్ధిని సాధిస్తేనే ఆ సమాజంలో నివసిస్తున్న పౌరుల ప్రగతి మెరుగుపడుతుంది. వ్యవసాయం, వైద్యరంగం పరిఢవిల్లాలంటే విద్యా వ్యవస్థ బలంగా ఉండాలి. అది గమనించిన ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు.
1966లో కొఠారి కమిషన్ దేశానికి విద్యారంగంపై గొప్ప సందేశాన్నిచ్చింది. తరగతి గదుల్లో దేశ భవిష్యత్ రూపుదిద్దుకుంటుందన్న సారాన్ని ప్రపంచ దేశాలు శ్లాఘించాయి. ఇంత గొప్ప విలువైన, అమూల్యమైన సందేశాలు, సూచనలను కూడా భారత ప్రభుత్వాలు అమలు చేయడంలో విఫలమయ్యాయి. తత్వ, విద్యావేత్తలు, చరిత్ర పరిశోధకులు చెప్పినట్లు విద్యను వ్యాపారంగా కాకుండా మానవ మనుగడ వికాసానికి దోహదపడే ఒక కీలక అంశంగా భావించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ‘మనిషిలోని అత్యుత్తమమైన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులను బహిర్గతం చేసేదే విద్య’ అని మహాత్మా గాంధీజీ అన్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ సమాజానికి ఇవ్వాలనే సంకల్పంతో ముందుకుసాగుతున్నారు. ప్రతి పథకం రూపకల్పనలో ప్రజల ఆకాంక్షలు ఉండటం ఒక ఎత్తయితే, ఆ ప్రజల భవిష్యత్తరాల సామాజిక, రాజకీయ, ఆర్థికస్థితిగతులను మార్చేలా పాలన అందించడం తెలంగాణ రాష్ర్టానికే సాధ్యం. ప్రజా సంక్షేమం పట్ల సీఎం కేసీఆర్కు ఉన్న నిబద్ధత, అకుఠింత దీక్ష, చిత్తశుద్ధి తెలంగాణ సమాజాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందనేది వాస్తవం.
ప్రతి పేద విద్యార్థికి కార్పొరేట్ విద్య అందించాలన్నదే కేసీఆర్ స్వప్నం. ఉన్నత ఫలాలు సాధించాలంటే నాణ్యమైన విద్య అవసరమని, అందుకోసం తెలంగాణలో విద్యాలయాల స్థాపన అవసరమని భావించారు. గురుకులాల పేరుతో వందల సంఖ్యలో పాఠశాలలు ఏర్పాటు చేశారు. సంక్షేమ హాస్టళల్లో మౌలిక సదుపాయాలను కల్పించడంతో పాటు, వారికి పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో సన్నబియ్యాన్ని ప్రతి రోజు హాస్టళ్లలోని ఆహార మెనూలో అందిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. దేశ వసతి గృహాల చరిత్రలోనే సన్నబియ్యం అనేది ఒక సంచలన నిర్ణయం. ఆర్థికంగా భారమైనా ప్రజల కోసం ఎలాం టి సాహసోపేత నిర్ణయాలైనా తీసుకుకోవడమనేది కేసీఆర్ నైజం. అన్నివర్గాలకు స్కాలర్షిప్లతో పాటు విదేశా ల్లో విద్యనభ్యసించే విద్యార్థుల కోసం ఓవర్సీస్ స్కాలర్ షిప్లను తీసుకువచ్చిన ఘనత కేసీఆర్ది. ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకాలకు మహత్మా జ్యోతిరావు పూలే, అంబేద్కర్ల పేర్లు పెట్టడమంటే పేదల విద్యపై సీఎం కేసీఆర్కు ఎంత విశాల దృక్పథం ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.
ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావాలి. తెలంగాణ విద్యార్థుల ప్రతిభాపాటవాలు ప్రపంచ ఎల్లలు దాటాలనే మరో మహోన్నత నిర్ణయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారు. కార్పొరేట్ విద్యాసంస్థల్లో అందించే విద్యా ప్రమాణాలకు అనుగుణంగా రాష్ట్రంలోని ప్రభుత్వ బడులు విద్యను అందించాలని, అందుకోసం ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.7,289 కోట్లతో మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు సంకల్పించింది. ఈ మహోద్యమంలో భాగంగానే ఇంగ్లీషు విద్యనందించాలని నిర్ణయం తీసుకోవడం ముదావహం. ఈ నిర్ణయంతో బడుగు బలహీనవర్గాల విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నిండుతాయి. ప్రభుత్వ విద్యాలయాల్లో ఇంగ్లీషు విద్యతో సమూల మార్పులు తీసుకురావడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. తెలంగాణ ప్రజల వికాసానికి, అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ మరింత కృషి సాగించడంతో, విద్యారంగంతో పాటు అన్నిరంగాలు అభివృద్ధి దిశగా పరుగులు పెడుతాయి. ఈ అభివృద్ధి పరుగులో అబద్ధాలు చెప్పే విపక్షాలు కొట్టుకుపోవడం ఖాయం.
–కిషోర్ గౌడ్, 99125 06685
(వ్యాసకర్త: రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు)