ప్రపంచం కరోనా కలవరంలో మునిగితేలుతున్న విషమ పరిస్థితులలో టోక్యో వేదికగా జరుగుతున్న విశ్వ క్రీడా సంబురాలు- ఒలింపిక్స్ శుక్రవారం ప్రారంభమవుతున్నాయి. యుద్ధ నీడలు, ప్రచ్ఛన్న యుద్ధ భయాల మధ్య క్రీడలు జరగడం పరిపాటి. కానీ ఈ సారి కరోనా నేపథ్యంలో కనిపించని శత్రువును తలుచుకుంటూ క్రీడోత్సవాలు భయంభయంగా సాగుతున్నాయి. ఈ ఆటలను తిలకించడానికి మైదానాల్లో క్రీడాభిమానులు ఉండరు. గతేడాది జరగవలసిన క్రీడలు వాయిదా పడి ఇప్పుడు జరుగుతున్నాయి. ఒలింపిక్స్ను చివరి క్షణంలోనూ రద్దుచేయవచ్చుననే మాట కూడా నిర్వాహకుల నోట వినిపించింది. అయినా అనేక జాగ్రత్తల మధ్య క్రీడలు జరపడానికే ప్రయత్నించడం అభినందనీయం.
ఒలింపిక్స్ క్రీడలు పుట్టిందీ, వాటిని అనేక అవాంతరాల మధ్య జరుపుతున్నదే ప్రజల మధ్య సౌహార్ద్రత నింపడానికి. శత్రుదేశాల వారు కూడా ఒకే వేదికపైకి చేరడానికి ఇదొక సందర్భం. ఇదే జపాన్లోని నగోయాలో 1971లో ప్రపంచ టేబుల్ టెన్నిస్ పోటీలు జరిగినప్పుడు అమెరికా, చైనా క్రీడాకారుల మధ్య స్నేహానికి బీజం పడింది. బద్ధశత్రువులైన రెండు దేశాలు దగ్గరయ్యాయి. సౌహార్ద్రతకు సంకేతమైన ఈ క్రీడలు ఇప్పుడు మానవాళిలో ఆశలు నింపడానికి సాగుతున్నాయి. పెళ్లిళ్లు పేరంటాలకు కూడా స్వయంగా హాజరు కాకుండా ఆన్లైన్లో వీక్షిస్తున్న కాలమిది. క్రీడా మైదానాలకు రాకున్నా, ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఈ క్రీడలు అలరిస్తాయి. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బోచ్ అన్నట్టు – సంక్షోభాన్ని అధిగమించే సంకేతమిది. ఈ ఆశావహ సందేశమే క్రీడలు ముగిసే నాటికి దృఢవిశ్వాస సందేశంగా వ్యాపిస్తుందని భావిద్దాం.
అంతర్జాతీయ క్రీడా సంబురాల్లో పాలుపంచుకోవడానికి ఈసారి మన దేశం నుంచి భారీ బృందమే బయలుదేరింది. 127 మంది అథ్లెట్లు విశ్వసంగ్రామంలో భాగస్వాములవుతారు. యూరప్ దేశాలలో కరోనా కాలంలోనూ అభ్యాసాలు సాగాయి. మన దేశంలో ఆ స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు జరగలేదని అంటున్నారు. అయినా విశ్వక్రీడలు ఏడాది ఆలస్యం కావడం మనకు కొంత వెసులుబాటును ఇచ్చిందనే అభిప్రాయమూ ఉన్నది. ఎవరికి ఎన్ని పతకాలు వస్తాయనే ప్రశ్నలు కూడా ఈ సందర్భంగా తలెత్తుతున్నాయి. కానీ
ఒలింపిక్స్ వచ్చినప్పుడు మాత్రమే పతకాల చర్చ సాగించడం మనకు అలవాటు. క్రీడాభిలాషను పల్లెల నుంచి పట్టణాల వరకు పెంచాలే గానీ ఒలింపిక్స్ను మాత్రమే లక్ష్యంగా పెట్టుకోవడం సరికాదు. కరోనా కాలమైనా, సాధారణ వేళ అయినా, క్రీడలు మానవ జీవితంలో చెలిమెల వంటివి. అవి మనకు ఆరోగ్యాన్ని, ఆహ్లాదాన్నిస్తాయి. మన క్రీడాకారులు కూడా ఆశావహ దృక్పథంతో పాల్గొని ఆత్మవిశ్వాసంతో తిరిగివస్తారని ఆశిద్దాం.