పుస్తకం ఒక మస్తిష్కం. పుస్తకం ఒక జ్ఞాన నిధి. ప్రపంచ గతిని మార్చగల శక్తి సామర్థ్యాలు, మానవాళిని సన్మార్గం వైపు నడిపించే మహత్యం పుస్తకానికే ఉన్నది. ప్రపంచ ప్రఖ్యాతులంతా పుస్తకాలు చదివి మహాత్ములుగా, మహాయోధులుగా అవతరించారు. సమాజ అభివృద్ధి వికాసాలకు పుస్తకమే కారణం. పుస్తక పఠనం ఏ తీరున ఉన్నదన్న దానిపైనే మనుషుల నైతికత ఆధారపడి ఉంటుందని సామాజిక వేత్తలు చెప్తున్నారు.
చైతన్యం, ఆలోచనను కలిగించి ఆత్మవిశ్వాసంతో జీవన ప్రయాణానికి పుస్తకం బాట చూపుతుంది. అలాంటి పుస్తకాలను ఒకచోట చూస్తే కనులకు, చదివే మనసు ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో మాటల్లో చెప్పలేం. మన దగ్గర నిర్వహించే 34వ జాతీయ పుస్తక ప్రదర్శనలో వివిధ జీవనరంగాలకు సంబంధించిన పుస్తకాలే కాకుండా, జాతీయ, అంతర్జాతీయ నాయకుల జీవిత చరిత్రలు, బాలసాహిత్యం, బాలల రచనలు, నవలలు, కథలు పోటీ పరీక్షల పుస్తకాలుంటాయి. సాహిత్య సమావేశాలు, పుస్తక పరిచయ కార్యక్రమాలు, కవి సమ్మేళనాలు నిర్వహించి విద్యార్థులను, యువకులను పుస్తకపఠనం వైపు, సాహిత్యం వైపు, రచనల వైపు మళ్లించటానికి కృషిచేస్తారు.
విజ్ఞానాన్ని ప్రజల చెంతకు, ముఖ్యంగా యువతకు, విద్యార్థి లోకానికి పుస్తక పఠనం అలవాటు చేసేందుకు అంతర్జాతీయ సంస్థ యునెస్కో కృషిచేస్తున్నది. ఏటా ఒక ప్రధాన నగరాన్ని ప్రపంచ పుస్తక రాజధానిగా ప్రకటిస్తున్నది. అలా 2019 షార్జా, 2020 కౌలాలంపూర్, 2021 జార్జియా, 2022 మెక్సికో నగరాలను ప్రకటించింది.
ఈ నగరాల్లో ఏడాది పొడవునా పుస్తక ప్రదర్శనలు నిర్వహించి పుస్తక ప్రియులను, రచయితలను, సాహిత్యకారులను ప్రోత్సహి స్తున్నది. దేశంలో నేషనల్ బుక్ ట్రస్ట్ ఏర్పడి యాభై ఏండ్లయిన సందర్భంగా 2022, జనవరి 8 నుంచి 16 వరకు ప్రగతి మైదానంలో ప్రపంచ పుస్తక ప్రదర్శనను ఏర్పాటుచేస్తున్నారు. ఈ పుస్తక ప్రదర్శనకు ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన పుస్తక ప్రచురణ సంస్థలను ఆహ్వానించారు. యువ సాహిత్యకారులను, యువ పాఠకులను ఆకర్షించి పుస్తక పఠనం అభిరుచిని పెంపొందించే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగా మన హైదరాబాద్లో కూడా పుస్తక ప్రదర్శన ఏటా నిర్వహిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. 34వ జాతీయ పుస్తక ప్రదర్శన డిసెంబర్ 18 నుంచి 27 వరకు తెలంగాణ కళాభారతిలో ఏర్పాటుచేస్తున్నారు. 250 బుక్స్టాల్స్ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ప్రచురణ సంస్థలతో పుస్తక ప్రదర్శన నిర్వహిస్తున్నారు. విజ్ఞానవంతమైన, పరిపుష్టమైన తెలంగాణ సమాజాన్ని రూపొందించే క్రమంలో ఈ జాతీయ పుస్తక ప్రదర్శన ఒక ఆయుధంగా, కార్యాచరణగా పనిచేస్తుందనడంలో సందే హం లేదు. మహా విప్లవాలను సైతం పుస్తకాలు సృష్టిస్తాయి. కవులు, కళాకారులు, రచయితలు రాసిన సాహిత్య రచనలు అనేక ఉద్యమాలకు ఊపిరిలూదిన సందర్భాలున్నాయి. అలానే తెలంగాణ మలిదశ ఉద్యమంలో పుస్తకాలు ప్రధాన పాత్ర పోషించాయి.
సరాసరిగా భారతీయులు వారంలో 10:42 గంటల సమయం చదివేందుకు కేటాయించగా, థాయిలాండ్ ప్రజలు 9.24 గంటల సమయం కేటాయిస్తున్నారు. చైనా ప్రజలు పుస్తకాల కోసం 8 గంటల సమయాన్ని ఇస్తున్నారు. ఈ క్రమంలోనే చైనా ఏటా 4 లక్షల 40 వేలు, అమెరికా 3 లక్షలకు పైగా, ఇంగ్లండ్ లక్షా 84 వేలు, జపాన్ లక్షా 39 వేల పుస్తకాలు, భారత్ 90 వేల పుస్తకాలను ప్రచురిస్తున్నది.
‘హైదరాబాద్ బుక్ ఫెయిర్’ను జిల్లా కేంద్రాల్లోనే కాకుండా, మండల కేంద్రాల్లో ఏర్పాటుచేయటానికి ప్రయత్నించటం ఆహ్వానించదగినది. పుస్తక పఠనం అనే ప్రక్రియను దైనందిన జీవితంలో ఒక భాగంగా భావించాలి. ముఖ్యంగా చిన్నపిల్లల్లో, విద్యార్థుల్లో ఈ భావనను కలిగించాలి. పిల్లల్లో సృజనాత్మకత కోసం, భావవ్యక్తీకరణకు, కళాత్మక ఆలోచనకు, గుణాత్మకమైన విద్యను ఆర్జించేందుకు పుస్తక పఠనం ప్రధానాంశం. పుస్తక పఠనాన్ని ప్రాథమిక, మాధ్యమిక స్థాయి విద్యలో ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉన్నది. వారానికి ఒకసారి తరగతి గదిలో పుస్తక పఠనం నిర్వహించి, నూతన పుస్తకాలపై సమీక్షలు, అభిప్రాయాలు విద్యార్థులచే వ్యక్తీకరించే కార్యక్రమాలు చేపట్టాలి.
విద్యార్థులు, యువకులు పాఠ్య పుస్తకాలే కాకుండా సమాజంపై సరైన అవగాహన ఉండాలంటే అన్ని విషయాలపై, అన్ని శాస్ర్తాలపై కనీస జ్ఞానం ఉండాలి. సాంకేతిక యుగంలో పుస్తకం ప్రాధాన్యం తగ్గిందని పలు సంస్థలు చెప్తున్నాయి. పుస్తక రూపాలు మారవచ్చు కానీ పుస్తకం ఎప్పటికీ సజీవమే, పుస్తకమే నిత్యం జ్ఞానాన్ని పంచే జీవనది. పుస్తకమే ఒక మస్తిష్కం.(వ్యాసకర్త: రాష్ట్ర గ్రంథాలయ సంఘ ప్రధాన కార్యదర్శి)(నేటి నుంచి హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రారంభం)
–డాక్టర్ రవికుమార్ చేగోని
98669 28327