ప్రైవేటు హాస్పిటల్స్లో చికిత్సకు లక్షలు ధారపోయాల్సిన నేటి రోజుల్లో ప్రభుత్వ దవాఖానలు ప్రజలకు కల్పతరువులా మారుతున్నాయి. కరోనాతో పాటు వచ్చిన బ్లాక్ఫంగస్కు హైదరాబాద్లోని కోఠి ఈఎన్టీ దవాఖాన, గాంధీ దవాఖానల్లో కేవలం రెండు నెలల్లో రూ.150 కోట్ల విలువైన వైద్యాన్ని ప్రజలకు ఉచితంగా అందించటం దీనికి నిదర్శనం.
రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలల కిందట బ్లాక్ ఫంగస్ను అరికట్టేందుకు కోఠిలోని ఈఎన్టీ దవాఖానను, సికింద్రాబాద్లోని గాంధీ దవాఖానను బ్లాక్ ఫంగస్కు నోడల్ హాస్పిటల్స్గా ప్రకటించింది. అప్పటినుంచి వందలాదిగా వస్తున్న రోగులకు సేవలందించడానికి వైద్యులు, వైద్యసిబ్బంది నిర్విరామంగా కృషి చేస్తున్నారు. ఒక్కోసారి రాత్రి 11 గంటల వరకు కూడా ఆపరేషన్లు చేస్తున్న రోజులున్నాయి. రోజుకు సగటున 30-40 ఆపరేషన్లు జరుగుతున్నాయి. ఈ విధంగా ఇప్పటివరకు ఈఎన్టీ దవాఖానలో సుమారు 800 ఆపరేషన్లు, గాంధీ దవాఖానలో దాదాపు 700 వరకు ఆపరేషన్లు జరిగాయి. ప్రైవేట్ దవాఖానల్లో బ్లాక్ఫంగస్కు వైద్యం చేయించుకున్న వారు 3, 4 లక్షల నుంచి 30, 40 లక్షల దాకా ఖర్చు పెట్టుకున్నారు. సగటున ఒకరికి 10 లక్షల ఖర్చు అని భావించవచ్చు. ఈ లెక్కన ఈఎన్టీ దవాఖానలో జరిగిన దాదాపు 800 ఆపరేషన్ల ఖర్చు రూ.80 కోట్లు, గాంధీ దవాఖానలో జరిగిన సుమారు 700 ఆపరేషన్ల ఖర్చు రూ.70 కోట్లు. రెండూ కలిపి రూ.150 కోట్ల విలువైన వైద్యం గత రెండు నెలల్లో బ్లాక్ఫంగస్ సోకిన బాధితులకు ప్రభుత్వ దవాఖానల్లో ఉచితంగా లభించింది. ఈ వైద్యం పేద ప్రజలకు పరమ ఔషధం అనడంలో సందేహం లేదు. భయానక పరిస్థితుల్లో ప్రాణాలను సైతం పణంగా పెట్టి వైద్యం అందించిన డాక్టర్ల సేవాగుణాన్ని, వారి అంకితభావాన్ని, త్యాగనిరతిని ఏ విధంగా వెల కట్టగలం.
కరోనా బారినపడి కోలుకున్న వాళ్లలో కొంతమందికి బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ సోకుతున్నది. సోకగానే అతివేగంగా విస్తరించడం ఈ ఫంగస్ లక్షణం. అయినా చాలామందిలో ఆపరేషన్ చేసి ఈ వ్యాధిని అరికడుతున్నాం. కొంతమందిలో ఈ వ్యాధి త్వరగా ముదిరి ప్రాణాంతకంగా మారుతున్నది. వారి ప్రాణాలను రక్షించాలంటే పళ్లు, దవడలు, మరికొందరికి కండ్లు తీయాల్సి వస్తున్నది. బ్లాక్ ఫంగస్పై చేసే పోరాటం ప్రధానంగా ఈఎన్టీ వైద్యుల పర్యవేక్షణలో జరుగుతునప్పటికీ ఇతర స్పెషలిస్టులు అందించిన సేవలు కూడా తక్కువ కాదు. ఫంగస్ ఇన్ఫెక్షన్ ముక్కు, సైనస్ల వరకు మాత్రమే పరిమితమైనప్పుడు పూర్తిగా ఈఎన్టీ స్పెషలిస్టుల పర్యవేక్షణలోనే చికిత్స జరుగుతుంది. ఒకవేళ ఇన్ఫెక్షన్ దవడకు సోకితే ప్లాస్టిక్ సర్జన్ సేవలు, పళ్లకు సోకితే దంతవైద్యుల సేవలు, కన్నుకు సోకితే కంటివైద్యుల సేవలు, మెదడుకు సోకితే న్యూరోసర్జన్ సేవలు అవసరం అవుతాయి. ఇక ఏ ఆపరేషన్ చేయాలన్నా అనెస్థీషియా వైద్యులు ఉండాల్సిందే. రోగిని మత్తులోకి తీసుకెళ్లి నొప్పి తెలువకుండా చేసే అనెస్థీషియా వైద్యులు లేకపోతే ఏ ఆపరేషన్ సాధ్యం కాదు. ఈ రకంగా పైన ఉదహరించిన స్పెషలిస్ట్ డాక్టర్లందరూ రెండు నెలల పాటు ఒక యజ్ఞంలా పనిచేసి బ్లాక్ ఫంగస్ రోగులకు చికిత్స చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలు సెక్రెటరీలు, డైరెక్టర్లు, ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు బ్లాక్ఫంగస్ గురించి సమాచారం తెలుసుకున్నారు. ఉన్నతస్థాయి సమీక్షలు నిర్వహిస్తూ, దవాఖానల్లో పడకల సంఖ్య పెంచారు. తగిన వైద్య పరికరాలను, మందులను సరఫరా చేశారు. అవసరం ఉన్నచోట తాత్కాలిక సిబ్బందిని నియమించారు. రాష్ట్ర ప్రభు త్వం బ్లాక్ఫంగస్ కట్టడికి అన్ని చర్య లు తీసుకున్నది. ఈ సమిష్టికృషి కారణంగానే రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ తగ్గుముఖం పట్టింది. కరోనా కష్టకాలంలో వైద్యులు, వైద్య సిబ్బంది అందించిన సేవలు అమూల్యమైనవి. దేశవ్యాప్తంగా కొవిడ్ కారణంగా చనిపోయిన వైద్యులు, వైద్య సిబ్బంది వేలల్లో ఉన్నారు. అయినా ప్రజల ప్రాణాలను కాపాడటమే లక్ష్యం గా సాగుతున్నారు.
(వ్యాసకర్త: చెవి, ముక్కు, గొంతు వైద్య నిపుణులు)
–డాక్టర్ రవిశంకర్ ప్రజాపతి