పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల
నా తల్లీ బందీ అయిపోతుందో కనిపించని కుట్రల
కుమ్మరి వామిల తుమ్మలు మొలిసె
కమ్మరి కొలిమిల దుమ్ము పేరెను
పెద్ద బాడిషా మొద్దు వారినది
సాలెల మొగ్గం సడుగులిరిగినవి..
చేతి వృత్తులా చేతులిరిగిపాయే మా పల్లెల్లోనా
గ్రామ స్వరాజ్యం గంగలోన వాయే నా దేశంలోనా…
…మడుగులన్ని అడుగంటి పోయినవి
బావులు సావుకు దగ్గరైనవి
వాగులు వంకలు ఎండిపోయినవి
సాకలి పొయ్యిలు కూలిపోయినవి…
అంటూ పల్లెల్లో నెలకొన్న విషాదాన్ని తన కవనం ద్వారా, గాత్రం ద్వారా కళ్ళకు గట్టారు ప్రముఖ వాగ్గేయకారుడు గోరటి వెంకన్న. ‘షెన్నై లండను కంపెని నగలొచ్చీ.. చెన్నై దుబాయి కంపెని నగలొచ్చీ.. అరె స్వర్ణకారుల చెర్నకోలలై తరుముతున్నయిరా మా పల్లెల నుండి.. అంటూ సబ్బండ వర్ణాల హృదయవిదారక బాధలను వివరించారు. ‘మల్టీ నేషను గిల్టెను బ్లేడు.. మంగలి కత్తికి ఎసరు దెచ్చినది’ అంటూ ‘వృత్తులు కూలె ఉపాధి వాయె, ప్రత్యామ్నాయం లేకనెపాయె, కూలిన బతుకులు నిలుపుటకైనా కుటీర పరిశ్రమలైనా పెట్టరు’అంటూ పాలకుల మొద్దుబారిన తనాన్ని ఎండగట్టారు.
ఏ సమాజానికైనా పల్లెలే ప్రాణాధారాలు. ఉత్పత్తి పల్లెల్లో జరిగితే ఖర్చు పట్టణాలపై జరుగుతున్నదనే ఒక సిద్ధాంతం కూడా ఉన్నది. పల్లె ప్రాంతాన్ని భారత్ అని, పట్టణ ప్రాంతాన్ని ఇండియా అంటున్నారు. ధన ప్రవాహం భారత్ నుంచి ఇండియాలోకి పోతూ ఉంటుందంటారు. కానీ ఏ కష్టమొచ్చినా జనం తమ మూలాలను వెతుక్కుంటూ పల్లెలకే వెళతారని కొవిడ్ కాలం గట్టిగా నిరూపించింది. ఇప్పటికీ మన దేశంలో దాదాపు అరువై శాతం జనాభాకు ప్రాథమిక జీవనాధారం వ్యవసాయమే. కొవిడ్ కాలంలోనూ ఆర్థిక వ్యవస్థను స్థిరంగా నిలిపింది ఈ వ్యవసాయమే. కానీ ఎంత మంది పాలకులు పల్లెల గురించి పట్టించుకుంటున్నారు? గ్రామీణ భారతాన్ని పునరుజ్జీవింప చేయడంలో ఎంత మంది సఫలీకృతులవుతున్నారు?
పల్లెలు అగ్గి గుగ్గిలమై మండుతున్న కాలమంటూ ఒకటి ఉండేది. దేశవ్యాప్తంగా నెలకొన్న సంక్షోభానికి తోడు, తెలంగాణపై అదనంగా ఆంధ్ర వలస పాలన భారం. పల్లెల్లో ఇనుప బూట్ల చప్పుళ్ళు.. ఎన్కౌంటర్లు, రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావులు.. బతుకు దెరువు లేక లేదా ప్రాణ భయానికి బొంబాయి, దుబాయికి వలస పోవుడు. ఒక కవి చెప్పినట్టు మూతి మీద మీసం మొలిచిన మొగోడు ఊళ్లె ఉండటానికే భయపడే రోజులవి.
తెలంగాణ సంక్షోభానికి మూలాలు పరాయి పాలనలో ఉన్నాయనీ, స్వరాష్ట్ర సాధనే పరిష్కార మార్గమని గ్రహించిన కేసీఆర్ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఉద్యమ కాలంలోనే తెలంగాణ సమస్యలపై, వాటి పరిష్కారాలపై కేసీఆర్కు స్పష్టమైన అవగాహన ఉన్నది కనుకనే, రాష్ట్రం అవతరించగానే ముఖ్యమంత్రిగా తన అభివృద్ధి వ్యూహాలను ఆచరణలో పెట్టారు.
పల్లె సీమలను సౌభాగ్యవంతం చేయడానికి కేసీఆర్ తెలంగాణలో అనుసరించిన విధానం ఇతర రాష్ర్టాలకు కూడా మార్గదర్శకమైంది. తెలంగాణ కార్యరంగంగా కేసీఆర్ అనుసరించిన విధానం వినూత్నమైనది, ఆచరణాత్మకమైనది. దేశంలో కేసీఆర్ కన్నా ముందు ఎందరో గ్రామాభ్యుదయం గురించి ఆలోచించిన వారున్నారు. కానీ అవి ఆదర్శప్రాయమైన ఆలోచనలు, చిన్న చిన్న ప్రయోగాలు మాత్రమే.
ఉదాహరణకు 1908లో రవీంద్ర నాథ్ ఠాగోర్ గ్రామీణ పునర్నిర్మాణం కోసం ప్రయత్నించారు. యువజన సంఘాల స్థాపన ద్వారా, విద్య, వైద్యం, సంస్కృతి, ఆర్థికాది రంగాల్లో చైతన్యవంతమైన కార్యక్రమాలను చేపట్టడానికి కొంత కృషి జరిగింది. దీనిని శ్రీనికేతన్ ప్రయోగమంటారు. సమగ్రమైన రీతిలో నడపడానికి ప్రయత్నం జరిగినా, కొంత పరిధికే పరిమితం అయింది. విస్తృత స్థాయిలో ఆర్థిక పునాదులలో మార్పులు చోటు చేసుకోలేదు. పూర్వం (అవిభక్త పంజాబ్ రాష్ట్రంలోని) గురుగ్రాంలో ప్రభుత్వాధికారి ఎఫ్.ఎల్. బ్రేయన్ వ్యవసాయ రంగంలో మార్పులు తేవడానికి కొంత కృషి చేశారు. కానీ అది ఎక్కువ కాలం నిలువలేక పోయింది. 1932లో బరోడా మహారాజా స్వావలంబన విధానాల ద్వారా జీవన పరిస్థితులను మెరుగు పరచాలని భావించారు.1946 ప్రాంతంలో ఫిర్యా అభివృద్ధి పథకాన్ని ప్రభుత్వమే అమలు చేసింది. వ్యక్తిగతంగా, సామూహికంగా చైతన్య పరిచి గ్రామీణ ప్రాంతంలో జీవన నాణ్యతను పెంచే ప్రయత్నం జరిగింది. ఈ విధంగా అక్కడక్కడా అతి చిన్న ప్రయత్నాలు సాగాయి.
గ్రామీణ చైతన్యం విషయానికి వస్తే ఇటీవలి కాలంలో అన్నా హజారే గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఈయన మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలోని రాలెగావ్ సిద్ధి గ్రామంలో జరిపిన ప్రయోగం ఆదర్శప్రాయమైనది. నీళ్లులేక, ఉపాధి కరువైన గ్రామాన్ని ప్రజల భాగస్వామ్యం ద్వారా ఆయన పూర్తిగా మార్చివేశారు. చెట్లు నాటడం, భూసారం దెబ్బతినకుండా సాగుభూమిని పలుకలు పలుకలుగా మార్చడం, వాన నీటి నిల్వకు కాలువలు తవ్వించడం చెప్పుకోదగినవి. పర్యావరణ హిత ఇంధనం కోసం సౌరఫలకాలు, గాలిమరలు, బయోగ్యాస్ యూనిట్లను ఏర్పాటు చేశారు. ప్రజల జీవన నాణ్యత పెరుగడమే కాకుండా గ్రామం కళకళలాడింది. ఇతర గ్రామాలపై కొంత ఈ ప్రభావం ఉన్నది. కానీ ఇదొక చిన్న స్థాయి ప్రయోగం మాత్రమే. హజారే కూడా విధానపరమైన మార్పులు తీసుక వచ్చే పరిపాలకుడు కాదు.
గ్రామ స్వరాజ్యం గురించి బోధించిన గాంధీజీ గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. గ్రామ స్వరాజ్యం గురించి మాట్లాడితే ఎవరికైనా గుర్తొచ్చేది గాంధీ బోధనలే. ఆయన గ్రామం స్వయం పోషకం కావాలన్నారు. బయటి శక్తుల ప్రమేయం లేకుండా, స్థానికులు, స్థానిక వనరుల ద్వారానే ఈ మార్పు రావాలని ఆయన అభిలషించారు. ఇదొక గొప్ప తాతిక భావన. గ్రామీణ పరిశ్రమలు మొదలుకొని విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, బడుగువర్గాల అభ్యున్నతి వంటి పలు అంశాలను ఆయన పరిగణనలోకి తీసుకున్నారు. కానీ ఆశ్చర్యకరమైన విషయమేమంటే- గాంధీ గ్రామీణ విధానంపై స్వాతంత్య్రానంతరం వచ్చిన పరిపాలకులకే స్పష్టత లేదు. నెహ్రూకు ఆధునిక భారత అభివృద్ధి పట్ల స్పష్టమైన విధానం ఉన్నప్పటికీ, పారిశ్రామిక యుగంలో గ్రామీణ పరిశ్రమల వంటి విధానాల పట్ల పెద్దగా దృష్టి పెట్టలేదు. నగరాలు, పరిశ్రమల అభివృద్ధి తరువాత అనుబంధమైనదిగానే గ్రామీణ ప్రాంతం వీరికి కనిపిస్తుంది. అంతేగానీ, గ్రామీణ ప్రాంతమే ప్రాథమికమైనదిగా వీరి ప్రణాళికలో ఉండదు. ఆ తరువాత కాలంలో కేంద్రంలో, రాష్ట్రంలో వచ్చిన నాయకులకు కనీసం నాటి నాయకులకు ఉన్న చిత్తశుద్ధి కూడా లేదు. నదీ జలాలు సముద్రంలో కలిసి పోతున్నా పట్టించుకునే దిక్కు లేదు.
గాంధీ తాత్వికుడు, ఆదర్శవాది. కానీ ఆయన బోధన వెలుగులో గ్రామీణాభివృద్ధి సాగించాలనే విధానపరమైన తీవ్రస్థాయి ప్రయత్నం జరగనే లేదు. గాంధీ ప్రబోధకుడే తప్ప పరిపాలకుడు కాదు. మన గణతంత్రం అవతరించే నాటికి ఆయన లేరు కూడా. నేటి గ్రామీణ-వ్యవసాయ సంక్షోభానికి, పట్టణాలకు వలసలు సాగడానికి, స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి నాయకులు వ్యవహరించిన నిర్లక్ష్య వైఖరే కారణం.
ఒక ప్రధాని లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి తన పరిపాలనా విధానాల ద్వారా గ్రామీణ పరివర్తన సాధించిన ఉదాహరణలు స్వతంత్ర భారతంలో లేవు. స్వాతంత్య్ర అమృతోత్సవాలు జరుపుకొంటున్న వేళ దేశమంతా పరికిస్తే, ఒక్కటంటే ఒక్క రాష్ట్రం కూడా గ్రామీణ భారతంలో మార్పు తెచ్చినట్టు కనబడదు, ఒక తెలంగాణ తప్ప! వ్యవసాయాన్ని పండుగగా, పల్లెలను సంపద్వంతంగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుంది. కేసీఆర్ గ్రామీణాభివృద్ధి విధానం సమగ్రమైనది. ఇందులో సూక్ష్మస్థాయిలో ఒక్కో వ్యక్తి అభివృద్ధిపై కూడా దృష్టిసారిస్తారు. దీంతో పాటు సామాజికాభివృద్ధి విధానాలు ఉంటాయి. పర్యావరణ హిత విధానాలు కూడా ఉంటాయి. మానవుడు, సమా జం, ప్రకృతితో కూడిన తాతిక భూమిక మీదే కేసీఆర్ విధానాలు అల్లుకుపోయి ఉంటాయి. గ్రామీణ-వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను మూలాల నుంచి పరిష్కరించడం కేసీఆర్ గొప్పతనం. గత విధానకర్తలు, ప్రణాళికావేత్తల మాదిరిగా నగరాభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చి, గ్రామీణరంగాన్ని అనుబంధమైనదిగా కేసీఆర్ భావించలేదు. గ్రామీణాభివృద్ధిని ప్రాథమికమైనదిగా గుర్తించారు. ప్రపంచం అంతా పట్టణాల అభివృద్ధిపైనే దృష్టి పెడుతున్నది. అభివృద్ధి అంటే పట్టణాల్లో చేపట్టే సంస్కరణలని భావిస్తున్నది. ఇందుకు భిన్నంగా కేసీఆర్ పల్లెలపై దృష్టి సారించి అభివృద్ధి అంటే ఇదేనని ప్రపంచానికి చాటారు. అందుకే ఇవ్వాళ ‘తెలంగాణ నమూనా’ ఆదర్శంగా నిలిచింది.
కేసీఆర్ ప్రణాళికలో గ్రామీణ రంగంలోకి భారీగా నిధుల ప్రవాహం జరిగింది. దీంతో గత ఏడేండ్లలో గ్రామాల స్వరూపం మారిపోయింది. నీటిపారుదల ప్రాజెక్టులతోపాటు, చెరువుల పునరుద్ధరణపై దృష్టిసారించారు. 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చారు. రైతులకు పెట్టుబడి సహాయం అందించడంతోపాటు విత్తనాలు, ఎరువులు అందుబాటులోకి తెచ్చారు. ఆహార పదార్థాల ఉత్పత్తి, మార్కెటింగ్ రెండు కోణాలను పరిగణనలోకి తీసుకున్నారు. భారీ వ్యవసాయోత్పత్తి సాగింది. రైతు సమితుల ఏర్పాటు ద్వారా పంట వేయడం మొదలుకొని మార్కెటింగ్ వరకు రైతుకు అండగా నిలిచే వ్యవస్థను నిర్మించడం విశేషం. దీంతో గ్రామాలే ఉత్పత్తి కేంద్రాలుగా మారిపోయాయి. కులవృత్తుల వారికి ప్రోత్సాహమివ్వడం మరో విప్లవాత్మక చర్య. కులవృత్తులు కూడా నైపుణ్యాలే, వారు కూడా మానవ వనరులే అనే స్పృహ కేసీఆర్ కలిగించారు. శిక్షణ కేంద్రాలలో నేర్చుకున్న విద్యార్థులకు మించిన నైపుణ్యం కులవృత్తిలో నిష్ణాతులైన వారికి ఉంటుంది. వీరిని మానవ వనరులుగా గుర్తించి ప్రోత్సాహమిస్తే, వారి శక్తియుక్తులు ఉత్పత్తిదాయకంగా మారుతాయి. మానవ వనరులను ఉపయోగంలోకి తెచ్చినట్టవుతుంది. ఈ కోణంలో ఆలోచించి గొర్రెలు పంచడం, చేపలు పట్టేవారికి సదుపాయాలు కల్పించడం వంటి చర్యలను తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నది.
కేసీఆర్ గ్రామీణాభివృద్ధి విధానాల మూలంగా పల్లెలు భాగ్యసీమలుగా మారాయి. గ్రామీణ ప్రాంతాలలో పారిశుద్ధ్యం, విద్యుత్తు, రహదారుల వంటి సౌకర్యాలు ఏర్పడ్డాయి. వ్యవసాయాధార పరిశ్రమలను నెలకొల్పే మరో అభివృద్ధి యజ్ఞం గ్రామీణ ప్రాంతంలో మరో విప్లవాన్ని ఆవిష్కరించబోతున్నది.
భాగస్వామ్య ప్రజాస్వామ్యం అనే భావనను ఆచరణలో విజయవంతం చేయడం కేసీఆర్ రాజనీతికి, పరిపాలనా పటిమకు నిదర్శనంగా నిలుస్తుంది. గ్రామ స్థాయిలో ప్రజలు అభివృద్ధిలో భాగస్వాములవుతున్నారు. అది హరితహారమైనా, మరే పథకమైనా గ్రామ పరిపాలనలో భాగమయ్యాయి. సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాలను సాధించడం ఎలా అని ప్రపంచవ్యాప్తంగా పరిపాలకులు తంటాలు పడుతున్న వేళ, తెలంగాణ మానవాభివృద్ధిలో ఒక పెద్ద గంతు వేస్తున్నదంటే, అందుకు కేసీఆర్ దార్శనికత, పరిపాలన కారణం. ప్రపంచీకరణ సాగుతున్న తరుణంలో సంక్షేమ పథకాలను, అభివృద్ధి విధానాలను సమపాళ్లలో కలిపిన చతురత కేసీఆర్ సొంతం. ఈ విధానాల ఫలాలను తెలంగాణ అంతటా చూడవచ్చు. పల్లెల నుంచి పట్టణాలకు కూలీలు వలస పోయే కాలం పోయింది. పాలమూరు నుంచి పొయ్యే బొంబయి బస్సు ఆగిపోయింది! పల్లెలకు కూలీల కొరత ఏర్పడ్డది. విద్యావంతులు కూడా పల్లెకు పోదాం, వ్యవసాయం చేద్దాం అంటూ గ్రామీణ ప్రాంతానికి తరలిపోతున్నారు. ప్రముఖ కవి దేవులపల్లి కృష్ణ శాస్త్రి మాటలను ఈ సందర్భంగా ప్రస్తావించుకోవచ్చు.
పల్లె తల్లి వంటిది, పట్నం ప్రియురాలి వంటిది!
తల్లి రమ్మంటుంది, ప్రియురాలు తెమ్మంటుంది!
అందుకే మన పల్లె… మన ప్రగతి!
ఇదే కేసీఆర్ చూపుతున్న అంతిమ పరిష్కారం
–సహ్య