దేశంలో ఏ మూల చూసినా సామాజికంగా,ఆర్థికంగా పీడితులు ఎవరంటే.. దళితులే. వారు వివక్షకు గురవడం దేశానికి మంచి పరిణామం కాదు. ఈ ఆర్థిక, సామాజిక వివక్ష రూపుమాపేందుకు, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు మన ముఖ్యమంత్రి కేసీఆర్ పూనుకొన్నారు. వారి జీవితాల్లో మార్పును తీసుకువచ్చేందుకు కార్యాచరణ రూపొందించారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ తలపెట్టిన గొప్ప కార్యమే‘దళిత సాధికారత’…
రాష్ట్రంలో జరుగుతున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో దళితుల గడపలు తట్టినం. ప్రత్యేకంగా దళిత వాడల అభివృద్ధే ఎజెండాగా కేసీఆర్ మార్గనిర్దేశనంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టాం. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు దళితులను ఓటు బ్యాంకుగానే చూశారు. ఓట్ల సమయంలో హామీలు గుప్పించి ఎన్నికలయ్యాక విస్మరించారు. సామాజికంగా, ఆర్థికంగా దళితులను వెనకబడేశారు. ఇలాంటి పరిస్థితుల్లో వారి కోసం సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు వారికి కొత్త ధైర్యాన్నిచ్చాయనే చెప్పవచ్చు. కేసీఆర్ చెప్పినట్టు తమ సమస్యల పరిష్కారానికి తాము కథానాయకులమౌతామని, ప్రభుత్వ సహకారంతో తాము అభివృద్ధి బాటన పయనిస్తామని వారు ధీమాగా మాకు చెప్పినప్పుడు ఆనందం వేసింది.
దళితుల అభివృద్ధికి కావాల్సిన అవసరాలను గుర్తిం చి వారికేం చేస్తే బాగుంటుంది. వారి జీవన ప్రమాణా ల్లో మార్పు తీసుకురావాల్సిన చర్యల గురించి వారి నివాస ప్రాంతాలు తదితర అంశాలపై సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా అధికారులతో సర్వేలు నిర్వహిస్తున్నారు. పేదల కోసం ప్రభుత్వం నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మిస్తున్నది.
తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో సుపరిపాలన సాగుతున్నది. ధనవంతులైన దళితులను తెలంగాణలో చూడాలనేది కేసీఆర్ ఆకాంక్ష. దానికోసం ‘దళిత ఎంపవర్మెంట్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. క్షేత్రస్థాయిలో మారుమూలన ఉన్న దళితుల జీవితాల్లో గుణాత్మకంగా అభివృద్ధిని సాధించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదో చారిత్రాత్మక నిర్ణయం.
దళిత సాధికారత పథకానికి 1200 కోట్లు కేటాయించారు. రాబోయే మూడేండ్లలో రూ.35 నుంచి 40 వేల కోట్లు వారి అభివృద్ధి కోసం ఖర్చుచేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో 7,79,902 మంది దళిత రైతుల వద్ద 13,58,000 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. వారికి భూ సర్వే చేసి రైతుబంధు కార్యక్రమంతో పాటు ఇతర వసతులను అందజేస్తున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంత దళితుల కోసం సంక్షేమ పథకాలు, స్వయం ఉపాధి కార్యక్రమాలు చేపడుతున్నారు. సామాజిక బాధల నుంచి దళితులను విముక్తి చేయడం, దళితులపై దాడులు జరిగితే కఠిన చట్టాలు అమలుచేస్తూ దళితుల అభ్యున్నతికి కృషి చేస్తున్నారు.
సంకల్పం, అకుంఠిత, దీక్షాదక్షత, మానవతకు మారుపేరుగా ఉండే ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత వర్గాల అభివృద్ధి విషయంలో పట్టుదలతో ఉన్నారు. వారి పట్టుదలకు ప్రజలు, దళిత వర్గాల మేదావులు చేయిచేయి కలపాలి. దళిత సాధికారత పథకంతో దళితులను అభివృద్ధి బాటలో నిలుపుదాం.
నన్నపునేని నరేందర్
(వ్యాసకర్త: వరంగల్ తూర్పు శాసనసభ్యులు)