వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. మల్కాజ్గిరి లోక్సభ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉండి వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి ఎందుకు పోటీచేయాలని అనుకుంటున్నారని అడిగితే సమాధానం లేదు. అంటే ప్రస్తుత స్థానం నుంచి తిరిగి గెలుస్తానన్న ధీమా టీపీసీసీ అధ్యక్షుడికే లేనప్పుడు వచ్చే ఎన్నికల్లో ఇక ఎక్కడినుంచి ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనేది మిలియన్ డాలర్ ప్రశ్న. రేవంత్రెడ్డి మాదిరిగానే బీజేపీకి చెందిన నిజామాబాద్ ఎంపీ అరవింద్ కూడా ఇదే మాట చెప్తున్నారు. ఆయన నిజామాబాద్ ఎంపీ స్థానం నుంచి కాకుండా ఆర్మూర్ అసెంబ్లీ నుంచి పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. తిరిగి లోక్సభకు కాకుండా అసెంబ్లీకి ఎందుకు పోటీ చేయాలని అనుకుంటున్నారని అడిగితే? తాను రాసిచ్చిన పసుపు బోర్డు బాండ్కు కాలం చెల్లిందనే విషయం ప్రత్యేకంగా చెప్పాలా? అని పరోక్షంగా ప్రశ్నిస్తున్నారట?
బీజేపీ నాయకుల వాలకం చూస్తే ‘కూట్లో రాయి తీయలేనోడు… ఏట్లో తీస్తానన్న’ చందంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకపోవడం వల్లనే తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులను చేపట్టలేకపోతున్నట్టు కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి ఇటీవల విమర్శించారు. ఒక రైల్వే ప్రాజెక్టుల విషయంలోనే కాదు మెట్రో రైలు ప్రాజెక్టులకు నిధులు ఇచ్చే విషయంలోనూ తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష కనబరుస్తుందని తెలంగాణ ప్రభుత్వం ఒకవైపు వాపోతుంటే నోరు మెదపని కేంద్ర మంత్రివర్యులు తప్పంతా తెలంగాణ సర్కార్దేనన్నట్టు నిందిస్తున్నారు. హైదరాబాద్-న్యూ ఢిల్లీ తెలంగాణ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రాష్ట్రంలో 30 స్టేషన్ల మీదుగా వెళ్తున్నా, ఏడు స్టేషన్లలో మాత్రమే ఆగుతుందని, కనీసం జిల్లా కేంద్రాల్లోనైనా (పెద్దపల్లి, జనగామ, యాదాద్రి భువనగిరి) ఆగేటట్టు చూడాలని పార్టీలకు అతీతంగా, చివరికి బీజేపీ ఎంపీలు కూడా మంత్రి కిషన్రెడ్డి చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. రాష్ర్టానికి కొత్త రైల్వే ప్రాజెక్టుల మాటేమో గానీ కనీసం హాల్ట్ స్టేషన్లను ఏర్పాటుచేసినా మంత్రివర్యుల మాటలు నమ్మశక్యంగా ఉండేవేమో.
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తన కమిటీలన్నింటినీ రద్దుచేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు ఎల్లో, గ్రీన్ మీడియాలో (రెండు పచ్చలు) ప్రముఖంగా వార్తను ప్రచురించాయి. నిజమే.. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి రాష్ట్ర, జిల్లా కమిటీలు న్నాయనే విషయం ఈ సంచలన వార్తతోనే తెలిసింది.. ఈ పార్టీకి కమిటీలు కూడా ఉన్నాయనే విషయమే తెలియనప్పుడు వాటిని రద్దు చేయడమనేది నిజంగా ఆశ్చర్యం కలిగించే సంచలన నిర్ణయమే. ‘వైఎస్ఆర్ తెలంగాణ’ అనే ఒక పార్టీ ఉందనే విషయాన్ని తెలంగాణ సమాజం కానీ, ఈ ప్రాంత మీడియా కానీ గుర్తించకపోయినా ప్రాంతాభిమానంతో రెండు పచ్చల మీడియా భుజానికి ఎత్తుకొని ప్రమోట్ చేయడంలో భాగమే ఈ సంచలన వార్త సారాంశం.