మనకు ఉపకారం చేసిన వారికి తిరిగి ఉపకారం చేయకున్నా పర్వాలేదు కాని అపకారం మాత్రం తలపెట్టకూడదు. మనకు మంచి చేసిన, జీవితాన్నిచ్చిన వారి పట్ల విశ్వాసంగా ఉండాలి. వారికెప్పుడూ మోసం తలపెట్టకూడదు. హుజూరాబాద్లో జరుగనున్న ఉప ఎన్నిక సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్పై కొందరు నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు. స్థాయి మరిచి వాఖ్యలు చేస్తున్నారు. మొన్నటి వరకు టీఆర్ఎస్ పార్టీలో, ప్రభుత్వంలో పదవులు అనుభవించిన ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్ను నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇది గర్హనీయం.
ఈటలను కేసీఆర్ జీరో నుంచి హీరో స్థాయికి తీసుకువచ్చారు. టీఆర్ఎస్లోకి రాకముందు ఈటల ఎవరికి తెలుసు? ఈటలను దామోదర్ రెడ్డి లాంటి సీనియర్ నేతపై పోటికి నిలిపి ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు తన చరిష్మాతో విజయాన్నందించారు. అప్పటి నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా అవకాశమిచ్చారు. అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ని చేసారు. రెండు మార్లు మంత్రిని చేసారు. పలు సందర్బాల్లో రాజేందర్ నా కుడిభుజం అని కూడా కేసీఆర్ సంబోధించారు. అతడిపై అత్యంత విశ్వాసాన్ని ఉంచారు. అలాంటి కేసీఆర్పై నేడు ఈటల మాట్లాడుతున్న మాటలు అతని విజ్ఞతను, వివేకం స్థాయిని తెలియజేస్తున్నాయి.
ప్రభుత్వం గొప్ప కార్యక్రమాలు చేస్తుంటే వాటిని ఈటల ప్రభుత్వంలో ఉండి విమర్శించటం మొదలు పెట్టాడు. రైతుల జీవితాల్లో నూతన విప్లవాన్ని తీసుకువచ్చిన రైతుబంధు కార్యక్రమాన్ని హేళన చేశాడు. తనలో ఉన్న పదవీకాంక్ష అతన్ని విద్వేషం, విశ్వాస ఘాతుకం వైపునకు తీసుకెళ్లింది. మెల్లమెల్లగా దురాశతో ఈటల కాంగ్రెస్, బీజేపీ ట్రాప్లో పడ్డాడు. క్యాబినెట్లో, పార్టీలో అంతర్గతంగా తీసుకునే నిర్ణయాలను ప్రత్యర్థులకు లీక్ చేశాడు. తద్వారా పార్టీని బలహీనపర్చేందుకు కుట్ర పన్నాడు. వాళ్ళ మాయలో పడి నీడనిచ్చిన చెట్టు వంటి పార్టీకి, జీవితాన్నిచ్చిన కేసీఆర్కు వెన్నుపోటు పొడిచాడు. రహస్య ప్రదేశాల్లో ప్రత్యర్థులతో మంతనాలు జరిపి పార్టీని విచ్ఛిన్నం చేసేందుకు కుట్ర చేసి అది బయట పడటంతో ఏం చేయాలో తెలియక అర్థం పర్థం లేని మాటలు మాట్లాడటం మొదలు పెట్టి చివరకు బర్తరఫ్కు గురయ్యాడు.
కేసీఆర్ మనసున్న మనిషి, ప్రేమగల్ల వ్యక్తి. ఆయనకు మంచి చేయటం మాత్రమే తెలుసు. అలాంటి కేసీఆర్పై మోసం చేశాడని నిందలు వేసి తానే ప్రజాద్రోహానికి పాల్పడ్డాడు. మాట్లాడితే నేను సత్యం గల్ల బిడ్డను, ఆత్మగౌరవంతో బ్రతుకుతాను అంటూ చెప్పే రాజేందర్, స్వరాష్ర్టాన్ని సాధించి, సంక్షేమాభివృద్ధి ఫలాలను అందిస్తూ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తున్న ఇంటి పార్టీ అయిన టీఆర్ఎస్లో ఉండటం ఆత్మగౌరవమా? ఢిల్లీకి గులాముగా ఉంటూ, కీలుబొమ్మగా ఉండటం ఆత్మగౌరవమా? ఈటల ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రజలను మోసం చేసి సొంత ఆస్తులు కూడబెట్టుకుని, ఆత్మగౌరవం అంటూ నీతులు చెప్తే హుజూరాబాద్ ప్రజలు నమ్మరు. తన వ్యక్తిగత స్వార్థం కోసం.. తెలంగాణకు అన్యాయం చేస్తున్న బీజేపీలో చేరటం ఏ ప్రయోజనాల కోసమో ఆయనే చెప్పాలె. ఆయన మాట్లాడే మాటలు హుజూరాబాద్ ప్రజల గౌరవాన్ని కించపరిచే విధంగా ఉన్నాయి.
కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండి.. దేశానికి, తెలంగాణకు చేసిందేమిటి? ఏం ఉద్ధరించడానికి ఈటల రాజేందర్ బీజేపీలో చేరారు? బీజేపీ గెలిస్తే ఈటలకు లాభం. టీఆర్ఎస్ గెలిస్తే హుజూరాబాద్కు లాభం. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని తరలించుకుబోయింది బీజేపీ. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ సుమారు 4 లక్షల ఉద్యోగుల జీవితాలను రోడ్డున పడేసింది. నోట్ల రద్దు చేసి నల్లధనం తీసుకువచ్చి పేదల ఖాతాల్లో డబ్బులు వేస్తామని జనాలకు టోపీ పెట్టింది. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో నిత్యావసర ధరలు పెరిగి పేదవారి నడ్డి విరగటానికి కారణమ య్యింది బీజేపీ. నల్లచట్టాలు తీసుకువచ్చి రైతుల ప్రాణాలు తీస్తున్నది. గ్యాస్ ధరను రెట్టింపు చేసి ప్రజలపై పెనుభారం మోపుతున్నది. రాష్ర్టానికి రావాల్సిన నిధులను ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నది. ఇలాం టి బీజేపీలో చేరటం ఆత్మగౌరవం ఎలా అవుతుంది! ఈట ల గెలిస్తే ఇవన్నీ మార్చగలడా? నల్ల చట్టాలను రద్దు చేయించగలడా? గ్యాస్ ధర తగ్గించగలడా?
హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఈటల
తన స్వప్రయోజనాల కోసం నిర్లక్ష్యానికి గురి చేశాడు. రాష్ట్రంలో మంత్రులంతా తమ నియోజక వర్గాల్లో డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మిస్తే, రెండుసార్లు మంత్రిగా ఉండి ఒక్క ఇల్లు కూడా పూర్తి చేయని ఏకైక మంత్రి ఈటల. కానీ నేడు ఈటల గాలికొదిలేసిన హుజూరాబాద్ అభివృద్ధి బాధ్యత హరీశ్ రావు తీసుకుంటే..,
దండయాత్రకు వచ్చారంటూ మాట్లాడుతున్నాడు. ఈ ప్రాంతంతో ఏ సంబంధం లేని కేంద్ర మంత్రులు, బీజేపీ కేంద్ర నాయకులు వచ్చి తిరిగితే అది మంచి అట. ఈ ప్రాంత బిడ్డ, ఉద్యమకారుడు, మంత్రిగా ఉన్న వ్యక్తి అభివృద్ధి పనుల నిమిత్తం తిరిగితే అది తప్పెలా అవుతుందో ఈటల చెప్పాలి.
తన వ్యక్తిగత స్వార్థం కోసం నీడనిచ్చిన చెట్టును నరుక్కున్నాడు ఈటల. అన్నం పెట్టినోళ్ళకు సున్నం పెట్టాడు. విశ్వాస ఘాతకుడిగా మారి విద్వేషాలు రెచ్చగొట్టే పార్టీలో చేరి ప్రజాద్రోహానికి తలపడ్డాడు. ప్రజలు ఇదంతా గమనిస్తున్నారు. మేలు చేసిందీ, చేసేది ఎవరో విజ్ఞులైన ప్రజలకు తెలుసు. విజ్ఞత మరిచిన రాజేందర్కు బుద్ధి చెప్పేందుకు హుజూరాబాద్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
తాడబోయిన విజయ్