ఎన్నికలు వచ్చినప్పుడే నాయకులకు నిరుద్యోగులు గుర్తుకువస్తారు. కొత్త కొత్త ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి శిలాఫలకాలు నోచుకుంటాయి. తీరా ఎన్నికలు ముగిశాక ఉద్యోగాల ఊసే ఉండదు. ప్రాజెక్టుల పనులేమో కానీ శిలాఫలాకాలే కూలిపోయే దశకు చేరుకుంటాయి. దేశంలో ఐదు రాష్ర్టాల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆ విషయాలను ఓ సారి చర్చిద్దాం.
గత ఐదేండ్లలో యూపీలో 4.5 లక్షల మం దికి ఉద్యోగాలు ఇచ్చామని పదేపదే చెప్తున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వాటి వివరాలు మాత్రం చెప్పలేకపోతున్నారు. నిజానికి యోగీ చెప్పే ఉద్యోగాల ముచ్చట అబద్ధం. ఇవన్నీ యూపీలో మళ్లీ అధికారంలోకి రావడం కోసం బీజే పీ చేస్తున్న జిమ్మిక్కులు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన బీజేపీ 2014 నుంచి ఈ ఏడేండ్లలో 14 కోట్ల ఉద్యోగాలు ఇవ్వా లి. కాగా కనీసం కోటి ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఉద్యోగాలు వస్తాయని పాలకులు చేసిన ప్రచారం కూడా ఉత్తదే అయ్యింది. అందుకే ఏదైనా ప్రాజెక్టు ప్రారంభిస్తున్నప్పుడు శంకుస్థాపన శిలాఫలకం మీదే ఈ ప్రాజెక్టు వల్ల వచ్చే ఉద్యోగాల సంఖ్య గురించి కూడా రాస్తే మంచిదేమో. అట్లయితేనే అబద్ధాలు చెప్పే అవకాశం ఉండదు. కనీసం ఆ ప్రాంతవాసులు ఇచ్చిన హామీలపై పాలకులను నిలదీయవచ్చు. అప్పుడైనా నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పే నేతలకు కొంత భయం, పాపభీతి ఉంటుందనేది నా అభిప్రాయం.
అసలు విషయానికి వద్దాం.. ఉత్తరప్రదేశ్, మణిపూర్, గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్ ఈ ఐదు రాష్ర్టాల్లో 690 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇందులో యూపీలోని 403, పంజాబ్లోని 117 స్థానాలు ప్రధానంగా దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. 2024లో పార్లమెంట్ ఎన్నికల భవిష్యత్తును నిర్ణయించే విధంగా ఇవి ఉంటాయి. ఎటుచేసి ఈ ఎన్నికల్లో గెలువాలనే లక్ష్యంతో అధికార బీజేపీ ఉన్నది. మరోవైపు విపక్షాలు కూటములుగా ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఆధ్వర్యంలో భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు జరుగుతున్నాయి. ఉద్యోగ కల్పన హామీలు ఇవ్వబడుతున్నాయి. ఇలాంటి కార్యక్రమంలోనూ జిన్నా పేరు ఎత్తకుండా సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉండలేకపోతున్నారు. హిందూ ముస్లిం అంటూ విభజన రాజకీయాలు చేస్తున్నారు. భాయిజాన్, కబరిస్థాన్ మాటలు. ఇటీవల నోయిడాలో ప్రధాని మోదీ 35 వేల కోట్ల వ్యయంతో నిర్మాణం చేయనున్న జెవర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు శంకుస్థాపన చేశారు. దీనివల్ల లక్ష పైచిలుకు ఉద్యోగాలు వస్తాయన్నారు. 2019 అక్టోబర్ 19న పత్రికల్లో ఇదే ప్రాజెక్టు వస్తే 5 లక్షల ఉద్యోగాలు వస్తాయని వచ్చింది. మరోసారి 7 లక్షల ఉద్యోగాలు అని.. ఈ ఏడాది నవంబర్ 8న అమర్ ఉజాల అనే హిందీ పత్రికలో 5.5 లక్షల ఉద్యోగాలు వస్తాయని వార్త. ఇదంతా చెప్పి, రాయించింది ప్రభుత్వ ప్రతినిధులు కావడం విశేషం. శంకుస్థాపన రోజు పీఎం లక్షా పై చిలుకు ఉద్యోగులకు ఉపాధి అన్నారు. ఎవరి మాట నమ్మాలో ప్రజలకు అంతుచిక్కని విషయం.
అస్సాంలో 2020 అక్టోబర్ 20న కేంద్రమంత్రి గడ్కరీ రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించే జల, రోడ్డు, రైలు తదితర మార్గాలను కలిపే మల్టీనేషనల్ ప్రాజెక్టు ద్వారా 20 లక్షల మందికి ఉపాధి కలుగనుందన్నారు. నాగ్పూర్ వార్ధా వద్ద మల్టీ మోడల్ లాజిస్టిక్ ప్రాజెక్టు 22 వేల కోట్ల వ్యయం తో నిర్మిస్తున్నట్లు, దీనిద్వారా యాభై వేల మందికి ఉపాధి వస్తుందన్నారు. ఆటో సెక్టార్లో 7.5 లక్షల ఉద్యోగాలన్నారు. ఇలా అన్నీ నీటిమూటలే.. ఒకదానికి, ఇంకోదానికి పొంతనే ఉండదు. పెట్టుబడి ఎక్కువ ఉన్న ప్రాజెక్టులో తక్కువ ఉపాధి, పెట్టుబడి తక్కువ ఉన్నకాడ ఎక్కువ ఉపాధి. దేనికీ పారదర్శకత లేదు. మరోవైపు నోయిడాలో ఎయిర్పోర్టు కోసం భూమిచ్చినవారికి పునరావాసం, పరిహారం తక్కువగా ఇచ్చారని ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నిర్మాణం వల్ల రూ.60-90 వేల కోట్ల పెట్టుబడులు పెట్టే, ఇతర వ్యాపారస్థులు వస్తారన్నారు సీఎం యోగి. 24 కోట్ల జనాభాలో 15 కోట్ల మంది పేదలున్న యూపీ ప్రజలు ముఖ్యంగా నిరుద్యోగులు బీజేపీ ప్రభుత్వాన్ని ఎలా నమ్మాలి? 135 కోట్ల జనాభా ఉన్న భారత్లో 80 కోట్లున్న పేదలు, 18 కోట్లు దాటిన నిరుద్యోగులు ఎలా నమ్మాలి? ఎన్నికల్లో గెలవడం కోసం ఇంత తమాషానా? జాతి, ధర్మం అంటూ కులం, మతం పేరిట మనుషులను విడదీసి ఎన్నికల్లో గెలవాలని భావించే యూపీలో అన్ని రాజకీయపార్టీలు ఇదే ప్రాతిపదికన టిక్కెట్లు ప్రకటించడం జరుగుతున్నది. యాదవ్, దళితులు, ముస్లిం, ఇసాయి, ఠాకూర్, బ్రాహ్మణ, జాట్ ఇత ర ఓబీసీల ఓట్ల మీద ఎవరికి వారే గురిపెట్టారు. 100 సీట్లలో ఎంఐఎం కూడా పోటీ చేస్తున్నట్లు ప్రకటించి టిక్కెట్ల పంపిణీ ప్రారంభించింది. ఎస్పీ, బీఎస్పీ, బీజేపీలు టిక్కెట్ల కేటాయింపు ప్రారంభమైంది. మహిళలకు, యువకులకు కాంగ్రెస్ 40 శాతం టిక్కెట్లు ఇవ్వడం మొదలుపెట్టింది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించినవారికి, జర్నలిస్టులకు, సంఘ సేవకులకు కూడా టిక్కెట్లు ఇచ్చింది. ఆప్ కూడా ఎక్కువ సీట్లలో పోటీ చేయనున్నట్లు ప్రకటించింది.
ఈ నేపథ్యంలో యూపీలో అధికార బీజేపీ ఓటమి అంచున ఉందని సర్వేలు ప్రకటిస్తున్నాయి. ఇది మింగుడుపడని పరిస్థితి ఆ పార్టీ శ్రేణుల్లో ఉన్నది.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్టు)
ఎండీ మునీర్
99518 65223