హైదరాబాద్ ఔటర్ రింగ్రోడ్డుపై కోట్ల విలువైన గంజాయి పట్టుబడింది. ఇది మాదక ద్రవ్యాల భయంకర రూపానికి ప్రతీక. అంతర్జాతీయ విమానాశ్రయాలు, రైళ్లలో, వాహనాల్లో పట్టుబడుతున్న మాదక ద్రవ్యాలు వందలు, వేల కోట్ల రూపాయల విలువచేసేవిగా ఉంటున్నాయి. పట్టుబడినవే ఈ స్థాయిలో ఉంటే.. పట్టబడకుండా మాదకద్రవ్యాలు ఏ స్థాయిలో పింపిణీ అవుతున్నాయో ఊహించుకుంటేనే భయం గొలుపుతున్నది.
ఈ మధ్యకాలంలో తరచూ వినబడుతున్న మాట డ్రగ్స్. సాధారణంగా వీటిని మాదక ద్రవ్యాలుగా వ్యవహరిస్తారు. మెడికల్ షాపుల్లో దొరికే మందులను కూడా వైద్యశాస్త్ర పరిభాషలో ‘డ్రగ్స్’గానే పిలుస్తారు. కానీ, వార్తల్లో వచ్చే డ్రగ్స్ భిన్నమైనవి. ఇవి మానసిక ఉత్ప్రేరకాలు. ఇవి తీసుకుంటే మనిషి మానసిక స్థితి ఉత్తేజానికి గురై, తాత్కాలికంగా ఇహప్రపంచాన్ని వీడి ఓ ఊహాలోక స్వర్గానికి చేరిన భావనకు లోనవుతాడు. దీన్నే యూఫోరియా అంటాం. ఒకసారి ఈ భావనను పొందిన వ్యక్తి మళ్లీ, మళ్లీ అలాంటి భావనను పొందాలని కోరుకుంటాడు. అలా తరచుగా డ్రగ్స్ తీసుకోవడానికి అలవాటు పడి చివరికి అవి లేకుండా బతుకలేని స్థితిలోకి పోయి బానిసగా మారుతాడు.
పురాణ కాలంలోనే దేవతలు అమృత పానం, రాక్షసులు సురాపానం చేసేవారని పురాణగాథలు చెప్తాయి. ఆ తర్వాత రాజులు, నవాబుల కాలంలో హుక్కా పీల్చేవారని కూడా విన్నాం. ఇవన్నీ మానసిక ఉత్ప్రేరకాలే. మనసుకు తాత్కాలికంగా ఉల్లాసాన్ని, ఉద్వేగాన్ని కలుగచేసేవి మత్తు పదార్థాలు. ప్రస్తుతం మత్తు పదార్థాల నుంచి మాదక ద్రవ్యాల (డ్రగ్స్) వైపుగా సమాజం ముఖ్యంగా యువత సాగుతున్నది. గంజాయి, కొకైన్, హెరాయిన్, మారిజువానా, మార్ఫిన్, చేరస్ లాంటివన్నీ ఈ మాదక ద్రవ్యాల కోవలోకి వస్తాయి. ఇవేకాకుండా ఇంకా అనేకరకాల డ్రగ్స్ చెలామణిలో ఉన్నాయి. మామూలు మత్తు పదార్థాల కన్నా ఈ మాదక ద్రవ్యాలు మనిషికి ఎక్కువ యూఫొరియా ప్రభావాన్ని కలిగిస్తాయి. అందువల్ల యువత వీటివైపు తొందరగా ఆకర్షించబడుతున్నది. కేవలం యువత అనే కాకుండా ఉన్నత ఆదాయవర్గాలలో ఈ మాదకద్రవ్యాల విష సంస్కృతి విపరీతంగా ఉన్న ది. ఈ డ్రగ్స్ సంస్కృతి పార్టీల్లో, పబ్బుల్లో గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్నదని అనేక సందర్భాల్లో వెల్లడవుతున్నది.
మూడేండ్ల కిందట ఈ డ్రగ్స్ రాకెట్ తెలుగు సిని మా పరిశ్రమను ఓ కుదుపు కుదిపింది. ప్రముఖ నటీనటులు, కొంతమంది టెక్నీషియన్లతో సహా సుమారు 15 మంది వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి నోటీసులు అందుకొని విచారణ ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా ఆ మధ్యలో హిందీ చిత్రసీమలో సుశాంత్సింగ్ అనే యువనటుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన విదితమే. ఆ తర్వాత కేసు పరిశోధనలో ఈ సంఘటన తదనంతర పరిణామాలు రకరకాల మలుపులు తిరుగు తూ చివరికి డ్రగ్స్ వాడకం దగ్గర తేలింది. బాలీవుడ్లోనూ ఎందరో ప్రముఖ నటీమణులు పోలీస్ విచారణను ఎదుర్కొంటున్న తీరు చిత్రసీమలో కూడా ఈ డ్రగ్స్ సంస్కృతి విస్తారంగా విస్తరించి ఉన్న దాఖలాలు విస్మయం కలిగిస్తున్నాయి.
డ్రగ్స్ వాడకం వల్ల మనుషులు వీటికి బానిసలుగా మారుతారు. ఆ ప్రభావంతో మనిషి శరీరంలోని అన్ని అవయవాలు దెబ్బతింటాయి. వాటి మత్తులో మనిషి తాను ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో అసాంఘిక కార్యకలాపాలకు, నేరాలకు పాల్పడుతాడు. ఒకసారి వీటికి అలవాటైన వ్యక్తి అవి లేకుండా ఉండలేకపోవడం, డ్రగ్స్ దొరకని పరిస్థితుల్లో స్వయం నియంత్రణ కోల్పోయి నేరాలకు, అకృత్యాలకు పాల్పడుతాడు. దీంతో ప్రపంచవ్యా ప్తంగా చాలా దేశాల్లో ఈ డ్రగ్స్ వాడకంపై నిషేధం విధించారు. మనదేశంలో కూడా 1985లో ‘నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ట్-1985’ అనే చట్టాన్ని తెచ్చారు. దీనిద్వారా ఈ మాదకద్రవ్యాలు కలిగి ఉన్నవాళ్లు, వాటిని తయారుచేసేవాళ్లు, వినియోగించే వారు, సరఫరా చేసేవాళ్లు, వాటిని ప్రోత్సహించేవా రు అందరూ శిక్షార్హులవుతారు.
చట్టాలెన్ని ఉన్నా దేశంలో మూలమూలన నల్లబజారులో ఈ డ్రగ్స్ యథేచ్ఛగా లభిస్తున్నాయి. మాదక ద్రవ్యాలతో పట్టుబడిన ఉదంతాలు తరచూ వినిపిస్తున్నా.. వారిలో ఎందరికి శిక్షలు పడ్డాయి, వాటి సరఫరా ఎంతవరకు నిరోధించబడిందంటే కచ్చితమైన సమాచారం లేదు. మాదకద్రవ్యాల కట్టడిలో చట్టాలను కఠినంగా అమలుచేయటం జరుగుతున్నదా అనే అనుమానాలకు తావిస్తున్నది.
మాదకద్రవ్యాల కట్టడిలో ప్రభుత్వాలనే నింది స్తూ కూర్చోకుండా బాధ్యత కలిగిన పౌరులుగా అం దరూ అప్రమత్తంగా ఉండాలి. పిల్లలు ముఖ్యంగా యువత మీద తలిదండ్రుల నిరంతర పర్యవేక్షణ అవసరం. కళాశాలలో ఉపాధ్యాయుల దగ్గరి నుంచి మొదలుకొని స్నేహితులు, బంధువులు, పక్కింటి వారు, పొరుగింటివారు ఇలా సమాజంలోని అన్ని వర్గాల వారు ఈ విషయంలో బాధ్యత వహించి సమిష్టిగా కృషిచేస్తేనే, ‘డ్రగ్స్’ అనే విష సంస్కృ తి నుంచి సమాజాన్ని రక్షించగలుగుతాం. దేశాన్ని అభివృద్ధి పథం లో నడిపించాల్సిన యువతను ఈ భయంకర భూతం బారి నుంచి కాపాడుతాం. అంతేకాకుండా ఇప్పుడున్న చట్టాలను అవసరమైతే తగినవిధంగా మార్పులు చేసి, కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉన్నది.
(వ్యాసకర్త: కోఠి ఈఎన్టీ దవాఖాన వైద్యులు)
డాక్టర్ రవిశంకర్ ప్రజాపతి