టీడీపీ, కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు ఎలాంటి నీటి ప్రాజెక్టులు రాలేదు. వచ్చిన కొన్ని ప్రాజెక్టులు పునాదిరాళ్లు వేయడంతోనే ఆగిపోయాయి.తెలంగాణలో లేని సముద్రాన్ని పూడ్చి అయినా సరే పేదలకు ఇండ్లు కట్టిస్తానన్న చంద్రబాబు, పిట్టగూళ్ల లాంటి ఇండ్లు కట్టించిన కాంగ్రెస్ ఏ ఎన్నిక వాగ్దానాన్నీ పూరించలేదు. గ్రామాలను, వృత్తులను, వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయడం ద్వారా పల్లెలు ధ్వంసమయ్యాయి. రైతులు, చేనేత పనివారు,వృత్తిపనుల వారి ఆత్మహత్యలు పెరిగాయి. గ్రామాలను వదిలి పొట్టచేత పట్టుకొని వలసలు పోయేవారి సంఖ్య నానాటికీ పెరిగింది.
తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ధ్వంసమైన వ్యవసాయాన్ని, గ్రామీణ వ్యవస్థను, సబ్బండవర్ణాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని పరిపాలన సాగిస్తున్నది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని సంక్షేమ పథకాలతో తెలంగాణ ప్రతి గడపా ఏదో విధంగా లాభపడేట్టు చేస్తున్నది. దేశానికే ఆదర్శప్రాయమైన ‘రైతు బంధు’, ‘రుణమాఫీ’ పథకాలు, పంటల మార్పిడి, ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, లక్షల ఎకరాలకు నీటివసతి కలిగించడం, ఎండకాలంలోనూ చెరువులు, కుంటలు, నింపడం లాంటి చర్యలతో తెలంగాణ ధాన్యాగారమైంది. ప్రతి రైతుకు రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడి సాయం అందడంతో లక్షల మంది రైతులు లాభపడ్డారు. ఈ పథకం రైతుపాలిట వరం లాంటిదే. ఇక్కడ రైతంటే ఏ ఒక్క కులంవాడో కాదు, సబ్బండ కులాల వారు ఈ పథకంతో లబ్ధి పొందుతున్నారు.
జనాభాలో ప్రతిఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ బతుకడం ప్రపంచంలో ఎక్కడా సాధ్యం కాదు. వ్యాపారాలు, పారిశ్రామిక ఉత్పత్తులు, వృత్తిపరమైన ఆదాయ మార్గాలు పెంచడం ద్వారా లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. ఆదాయ పెంపునకు తోడ్పడుతుంది. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గ్రామీణ ప్రజల ఆదాయ మార్గాలను పెంచడానికి పలు కులాలవారికి, ఆయా వృత్తుల సంబంధమైన ఆదాయ వనరులు పెంచారు. ఆర్థికసాయం చేశారు. ఇవి బీసీ కులాల వారికి ఎక్కువగా ఉపయోగపడ్డాయి. డబుల్ బెడ్రూం ఇండ్లు తెలంగాణ పేదలకు ఆత్మగౌరవాన్ని పెంచే సాధనాలు. చిరునామా లేని బీసీ సంచార జాతులకు త్వరలో ఇండ్లిచ్చి సంచారజాతులకు బంధువు కానున్నారు. భవిష్యత్తులో బీసీ బంధు పథకాన్ని కూడా ప్రవేశపెట్టి బీసీలు సాధికారత సాధించేందుకు కృషి చేస్తారనడంలో సందేహం లేదు.
దళితులు అత్యంత అణగారిన జాతులుగా సామాజిక అణచివేతకు గురవుతూ పేదలుగా సామాజిక బాధితులుగా ఉన్నారు. వీరే ఈ దేశపు మూలజాతులు. అడవుల్లో నివసించే గిరిజనులకైనా ఆ అటవీ ప్రాంత భూములపై హక్కులున్నాయి కానీ, దళితులకు చారెడు భూమి కూడా లేదు. రాజ్యాంగంలో కొన్ని హక్కులు, రిజర్వేషన్లు దళితులకు పొందుపరిచినా వీరి పరిస్థితి అంతంత మాత్రమే. ఈ పరిస్థితుల్లో అత్యంత పీడితులైన దళితులను పట్టించుకున్న పాలకుడే మంచి పాలకుడవుతాడు. దళితులను విద్యావంతులుగా, పారిశ్రామికవేత్తలుగా, ఉన్నతోద్యోగులుగా, వ్యాపారవేత్తలుగా చూడాలని ఆర్థికంగా బలోపేతం చేయాలని అంబేద్కర్ ఆశించాడు. అంబేద్కర్ ఆశించిన దళిత అభివృద్ధిని సాకారం చేయడానికే కేసీఆర్ తెలంగాణలో ప్రవేశపెడుతున్న ‘దళిత బంధు’ పథకం ఉద్దేశ్యం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పాలనలో, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దళితులపై దాడులు, అత్యాచారాలు నిర్విఘ్నంగా సాగుతుంటే, కేసీఆర్ దళిత సాధికారత కోసం ‘దళితబంధు’ పథకాన్ని ప్రారంభించడం మహోన్నత మాననీయ చర్య.
అణగారిన జాతుల వారైనా వాళ్లలో చైతన్యాన్ని పెంచిన నాయకుడు కేసీఆర్. వారి కోసం ప్రత్యేకంగా విద్యాలయాలు పెట్టడమే గాక, అన్నిరంగాల్లోనూ నిష్ణాతులను చేసే విద్యనందిస్తున్నారు. దీంతో అణగారిన దళిత కులాల నుంచి అంతర్జాతీయ, జాతీయస్థాయి పోటీ పరీక్షల్లో గెలిచినవారున్నారు. డాక్టర్లుగా, ఇంజినీర్లుగా, హిమాలయాలను ఎక్కేవారుగా, స్పోర్ట్స్మెన్, స్పోర్ట్స్ ఉమెన్గా ఎంతోమంది దళితులు ఎదిగారు. ఇప్పుడు ప్రవేశపెట్టిన ‘దళితబంధు’ ద్వారా ఆర్థిక, పారిశ్రామిక, రాజకీయ స్వావలంబనల ద్వారా దళితులకు సామాజిక గౌరవం పెరుగుతుంది. ఈ పథకం ద్వారా దళిత సాధికారతను సాకారం చేయడానికి కేసీఆర్ హుజూరాబాద్ నుంచే పునాదిరాళ్లు వేయడం ఆహ్వానించదగిన పరిణామం.
తెలంగాణలో ప్రారంభించిన ‘రైతు బంధు’ పథకం రైతుల దుఃఖాన్ని దూరం చేసి దేశానికే ఆదర్శ ప్రాయమైంది. అలాగే ‘దళిత బంధు’ పథకం తెలంగాణకంతటికీ విస్తరించడమే కాకుండా రైతుబంధులా దేశమంతటికి విస్తరిస్తుంది. దళిత సాధికారతను పెంచడంలో కచ్చితంగా అన్ని రాష్ర్టాలకూ ఉదాహరణ ప్రాయమవుతుంది. ఈ పథకం కింద ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థికసాయం చేయడం వల్ల తాము చేయగలిగే పనులను ఎంపిక చేసుకొని వ్యాపారాలు, చిన్నపరిశ్రమలు, పాడి పరిశ్రమలాంటివి చేసుకొని ఆర్థిక స్వావలంబన సాధించవచ్చు. ఇంత అద్భుతమైన పథకాన్ని హుజూరాబాద్ నుంచే ఎందుకు ప్రారంభిస్తున్నారని, ఆ రూ. 10 లక్షలను దళితుల చదువులకు ఉపయోగించాలని, దళితులు కోరుకునేది ఆర్థిక సాధికారత కాదని పసలేని విమర్శలు చేస్తున్న రాజకీయులు, మేధావులున్నారు. కేసీఆర్ ఇచ్చిన జవాబులు వారి కండ్లను తెరిపిస్తాయి. ఏదేమైనా ‘దళిత బంధు’ పథకం తరతరాలుగా ఆర్థిక, సామాజిక అణచివేతకు గురవుతున్న దళితుల జీవితాల్లో వెలుగు నింపుతుందనటంలో సందేహం లేదు.
డాక్టర్ కాలువ మల్లయ్య