అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఉద్యోగ కల్పన ఒకటి. ‘గ్లోబల్ ఎంప్లాయిమెంట్ ట్రెండ్స్’ నివేదిక ప్రకారం.. ఈ దేశాల్లో 90 కోట్ల మంది కార్మికులకు ఉద్యోగ సమస్య ఉన్నది. ఏ దేశమైనా దాని ఆర్థిక, సామాజిక అభివృద్ధిలో ‘ఉపాధి’ కీలకమైనది. తద్వారా ఆదాయాన్ని సృష్టించటం దేశాభివృద్ధికి ముఖ్యం.
మన దేశాభివృద్ధిలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. దేశ జీడీపీలో 8 శాతం, తయారీ రంగంలో 45 శాతం ఉత్పత్తులను, ఉపా ధి కల్పనలో 45 శాతం వాటా కలిగి ఉన్నాయి. ఈ పరిశ్రమలు ఎదుర్కొంటున్న సవాళ్లలో ఆర్థిక వనరుల కొరత ప్రధానమైనదని ఎస్ఎల్ కపూర్ (2015), యూకే సిన్హా (2019) కమిటీలు తమ నివేదికలో పేర్కొన్నాయి.
అభివృద్ధి చెందిన దేశాల్లో మొదటి వరుసలో ఉండే అమెరికా, ఐరోపా వంటి దేశాలు సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధికి అనేక ప్రోత్సాహకాలను కల్పిస్తున్నాయి. అందువల్ల ఆయా దేశాల్లో చిన్న తరహా పరిశ్రమలు అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్నాయి. వీటి వాటా జీడీపీలో, ఉపాధి కల్పనలో 60 శాతం కన్నా ఎక్కువగా ఉంటున్నదని ఐఎఫ్సీ రిపోర్ట్-2019 నివేదిక తెలిపింది.
మన దేశంలో సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు రుణా లు పొందలేకపోవటానికి ఆర్థికసంస్థల కఠిన ఆంక్షలే ప్రధాన కారణం. తనఖా పెట్టడానికి స్థిరాస్తులు లేకపోవటం, ఆర్థిక నివేదికల తయారీ విధానం సరిగా లేకపోవటం ప్రధాన కారణాలని పలు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. రుణాల మంజూరు విషయంలో ఆర్థిక నివేదికలది కీలక పాత్ర. కాబట్టి స్కిల్ ఇండియా కార్యక్రమం లో భాగంగా యువతకు ఆర్థిక నివేదికల తయారీకి సం బంధించిన శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించటం ద్వారా ఈ సమస్యను ఎదుర్కొనవచ్చు.
దేశంలో సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు సం ఖ్యాపరంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నప్పటికీ, అవి కల్పించే ఉపాధి అవకాశాలు తక్కువ. ఆయా పరిశ్రమల అభివృద్ధికి సరైన సదుపాయాలు లేకపోవడం ప్రధాన కారణం. సూక్ష్మ పరిశ్రమగా స్థాపించబడిన సంస్థ సూక్ష్మ పరిశ్రమగానే ఉండిపోతున్నది. సరైన వనరులు, సకాలంలో సమకూరిస్తే చిన్న పరిశ్రమలు కార్పొరేట్ స్థాయికి ఎదిగే అవకాశాలుంటాయి.
సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు ఆర్థిక వనరుల కల్పన కోసం దేశంలో అనేక పథకాలు తీసుకొచ్చారు. అయినా వీటిని ఆర్థిక వనరుల కొరత వేధిస్తూనే ఉన్నది. చిన్న పరిశ్రమల అభివృద్ధి కోసం 16.66 లక్షల కోట్ల రుణ నిధులు కావాలని ఐఎఫ్సీ-2020 నివేదిక వెల్లడించింది. కాబట్టి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ఈ పరిశ్రమలకు అవసరమైన ఆర్థిక వనరులు అందించాల్సిన అవసరం ఉన్నది.
ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నది. ఇతోధికంగా ఆర్థికసాయం అందిస్తున్నది. దీంట్లో భాగంగానే టీఎస్- ఐపాస్ విధానం, టీ-ప్రైడ్, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన కోసం జిల్లాలవారీగా ఇండస్ట్రియల్ పార్కులను అభివృద్ధి చేస్తున్నది. ఇటువంటి సంస్కరణలు, ప్రోత్సాహకాలు అన్ని రాష్ర్టాలు కల్పించగలిగితే సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధికి ఊతం లభిస్తుంది. ఉపాధి అవకాశాల కల్పన వల్ల ప్రజల జీవన స్థితిగతుల్లో గణనీయ మార్పులు వస్తాయి. తద్వారా ఐరాస నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఒకటైన ఆర్థిక స్వావలంబన సాధించే అవకాశం ఉన్నది. దీనిలో తెలంగాణ రాష్ట్రం ముందువరుసలో ఉండటం హర్షణీయం.
(వ్యాసకర్త: ఓయూ రీసెర్చ్ స్కాలర్)
–శనిగరపు విజయ్