నలభై ఏండ్ల కిందట ఓ పరీక్ష రాయడానికి వెళ్లినపుడు ఇరువై రోజులకు పైగా కలకత్తాలో ఉండాల్సి వచ్చింది. దుర్గా పూజలో కామ్రేడ్ల భక్తిపారవశ్యం చూసి ఆశ్చర్యపోయాను. ఆ తర్వాత ఓ పెద్దాయన అన్న ‘ఆధ్యాత్మిక కమ్యూనిజం’ అనే మాట విని ఆశ్చర్యచకితున్నయ్యాను. ఎందుకంటే కమ్యూనిజానికి గతితార్కిక భౌతికవాదం పునాదులుంటాయి కానీ ఆధ్యాత్మికత కాదు. మతానికి ఆధ్యాత్మిక పునాదులుంటాయి. ఇవి రెండూ చుక్కెదురు. కమ్యూనిజం సిద్ధాంతకర్త కారల్ మార్క్స్ మతం మత్తు మందు లాంటిదన్నాడు.
మనిషి, భౌతికవాదానికి ఏ మాత్రం సంబంధం లేకుండా భావవాదం, మతవాద, విశ్వాసాలు ఆధారంగా ఏర్పడిన పార్టీ నాటి ‘జనసంఘ్’, నేటి బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు పరస్పర విరుద్ధ భావజాలం కలిగి ఉన్నవే. కాంగ్రెస్, ప్రాంతీయపార్టీలన్నీ లౌకిక, ప్రజాస్వామ్య, సామాజికవాద పునాదులపై నిర్మించబడిన మధ్యేమార్గ పార్టీలు. సాయుధ అతివాదం నుంచి పార్లమెంటరీ ప్రజాస్వామ్యవాదం వరకు వివిధ దశల్లో ఉన్న కమ్యూనిస్టు పార్టీలకు, బీజేపీ లాంటి మత, జాతీయవాద పార్టీలకు ఏ విషయంలోనూ సిద్ద్ధాంత సారూప్యత లేదు. మతవాదులకు, కమ్యూనిస్టులకు మధ్య సారూప్యతలున్నాయా అన్న అనుమానం కంచిలాంటి పీఠాలకు, తీవ్రవాద చర్యల్లో, సాయుధ దళాల గురించి తెలుసుకున్నప్పుడు వచ్చితీరుతుంది. ఈ అన్ని కార్యక్రమాల్లోనూ పసివాళ్లను ఉపయోగించుకోవడం చూసినప్పుడు మానవతావాదులకు కన్నీళ్లు కారక తప్పవు.
ఈ మధ్యకాలంలో కామ్రేడ్లు, మాజీ కామ్రేడ్లు కూడా బీజేపీ పంచన చేరడం అతిపెద్ద చారిత్రక వైరుధ్యం. కలెగూర గంప జనతాపార్టీలో పాత జనసంఘ్ ఓ భాగస్వామి కావడంతో పరాకాష్ఠకు చేరుకున్నాయి. బీజేపీ పూర్తి మెజారిటీతో అధికారంలోకి రావడంతో మత, జాతీయ భావన, దేశభక్తి నినాదాలతో లౌకిక ప్రజాస్వామిక పార్టీలతో పాటు సీపీఎం లాంటి వారినీ లోబరుచుకోవడం జరుగుతుంది. ఈ ప్రభుత్వాలను కూలగొట్టడంతో పాటు త్రిపుర, మణిపాల్లను సీపీఎం చేతిలో నుంచి అనైతిక రాజకీయాల ద్వారా లాక్కొని తన ఖాతాలో కలుపుకొన్నది బీజేపీ. పశ్చిమబెంగాల్లో సుదీర్ఘ సీపీఎం లెఫ్ట్ఫ్రంట్ పాలనకు తృణమూల్ కాంగ్రెస్ చరమగీతం పాడింది. అయితే గత 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ సీపీఎంతో లోపాయికారి ఒప్పందం చేసుకొని 18 ఎంపీ సీట్లను గెలిచింది. శత్రువు శత్రువు మిత్రుడన్నట్టు సీపీఎంను ఓడించిన తృణముల్ కాంగ్రెస్ తమ శత్రువుగా భావించి సీపీఎం శత్రువైన బీజేపీతో చేతులు కలపడం చారిత్రక తప్పిదం. అదే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 4 సీట్లను గెలిచింది. ఉపఎన్నికలో ఒక్క అసెంబ్లీ సీటూ గెలిచింది.
ఈ ఫలితాలు ఈటల వంటి పూర్వాశ్రమ వామపక్షులకు ఉత్సాహాన్ని కలిగించి ఉంటాయి. 18 ఏం డ్లుగా పలు పదవులు ఇస్తూ, తమ్ముని వలె చూసుకున్న కేసీఆర్తో సంబంధాలు బెడిసికొట్టినప్పుడు ఈటలకు బీజేపీ కనపడింది. పక్క రాష్ట్రంలో ప్రతిపక్షాలు, ఇదివరకు అధికారం చెలాయించిన పార్టీల పారిశ్రామికవేత్తలు బీజేపీలో చేరి ఆత్మ, ఆస్తుల రక్షణ చేసుకోవడం గమనించి ఉంటాడు. అసైన్డ్ భూములు లాక్కున్న తనకు బీజేపీనే సరైనదని భావించి ఉంటా డు. అందుకే తన వామపక్ష సిద్ధాంతాలను వదులుకున్నాడు. కాషాయీకరణ చెందాడు. ఎప్పుడో మర్చిపోయిన బీసీవాదం యాదికొచ్చింది. దేశాన్నే ప్రైవేటీకరణ చేయడానికి తలుపులు బార్లా తెరిచి లక్షలమంది ఉద్యోగాలను కాజేసిన బీజేపీ ఉద్యోగాలిచ్చేదిగా కనబడింది. అం తే.. అంతే.. బీజేపీలోకి శాఖ సంక్రమణం చేసి ‘నవ్విపొదురుగాక నాకే టి సిగ్గు!’ అన్నట్టు ప్రవర్తిస్తున్నాడు.
కానీ రెండేండ్ల కిందట పశ్చిమబెంగాల్లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కమ్యూనిస్టుల సహకారంతో 18 ఎంపీ సీట్లు పొందిన బీజేపీ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావాన్ని చూపలేదన్న విషయం మరిచిపోయాడేమో. కేరళలోనూ వామపక్షాల ధాటికి బీజేపీ నిలవలేకపోయింది. తమిళనాడు సామాజికశక్తుల ముందు మతశక్తుల ఆటలు సాగలేదు. తెలంగాణలో బీజేపీది వాపు మాత్రమేనని ఉప, మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. తెలంగాణలో టీఆర్ఎస్కు ఏ పార్టీ ప్రత్యామ్నాయం కాదని ప్రతి ఎన్నిక రుజువు చేస్తున్నది. అయినా ఏ సిద్ధాంతం లేకుండా కేవలం వ్యక్తి మీద వ్యతిరేకతతో, ఏ సారూప్యతలు లేని పార్టీలో చేరితే దక్కే ఫలితం ఇంతే. తెలంగాణ సమగ్రాభివృద్ధి మ్యానిఫెస్టోగా ముందుకెళ్తున్న టీఆర్ఎస్ను ఓడించడం బీజేపీకి ఎలా సాధ్యం? ఈటల ఆశ లొట్టిపిట్ట పెదవులకు నక్క ఆశ పడ్డట్టే అవుతుంది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని, ప్రయోజనాలను కాపాడుతున్న, కాపాడే టీఆర్ఎస్, కేసీఆర్ కంటే బీజేపీ ఏ విధంగా చూసినా మేలైనది కాదు. ‘చిన్ని నా బొజ్జకు శ్రీరామరక్ష’ అనే చందాన కామ్రేడిజం నుంచి కాషాయంలోకి పోవడాన్ని ఎలా సమర్థించుకుంటారంటే ‘చిన్ని నా ఆస్తులకు శ్రీరాముడే రక్ష’ అనే నినాదంతోనేనా?
–డాక్టర్ కాలువ మల్లయ్య