కేంద్రంలోని బీజేపీ పాలనలో దేశ సమాఖ్య స్ఫూర్తి పూర్తిగా దెబ్బతింటున్నది. అన్ని సంస్థలను, వ్యవస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తున్నది. రాష్ర్టాల హక్కులను కాలరాయడమే కాకుండా, తమ ప్రభుత్వం ఉన్న రాష్ర్టాలతో ఒక విధంగా, బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ర్టాలతో మరోరకంగా వ్యవహరిస్తున్నది. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాలను ఎలాగైనా దెబ్బ తీయాలనే కుట్ర బీజేపీ చర్యల్లో స్పష్టంగా కనిపిస్తున్నది. తమతో అంటకాగకుంటే ఇబ్బందులు పెట్టడం బీజేపీకి అలవాటైపోయింది.
తెలంగాణ రాష్ట్రం మొదటి నుంచి దేశానికి ఆర్థికంగా తోడ్పాటునందిస్తున్నది. అత్యధిక పన్నులు చెల్లిస్తున్నది. అయినా కేంద్రం రాష్ర్టానికి మొండిచేయే చూపిస్తున్నది. తెలంగాణలో బీడుపడ్డ భూములను సస్యశ్యామలం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని కేవలం మూడేండ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించింది. యావత్ ప్రపంచమే రాష్ట్ర ప్రభుత్వా న్ని కొనియాడింది. కానీ మన కేంద్ర ప్రభుత్వానికి మాత్రం కళ్లు మూసుకుపోయాయి. కాళేశ్వరానికి జాతీయ హోదా కోసం 2016లో రాష్ట్రం దరఖాస్తు పెట్టుకున్నా.. ఇప్పటిదాకా నాన్చింది కేంద్రం. కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్ తుడు రాతపూర్వకంగా లోక్సభకు సమాధానం ఇచ్చారు. తెలంగాణ సీఎం కేసీఆర్ 2016 ఫిబ్రవరిలో, 2018 డిసెంబర్లో కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వాలని ప్రధాని మోదీని కలిసి విజ్ఞప్తి చేశారని ఆయన తన రిైప్లెలో ఒప్పుకొన్నారు. అయితే, ఏదైనా ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వాలంటే దానికి కేంద్ర జలసంఘం, సాంకేతిక సలహా కమిటీ ఆమోదం ఉండాలని, ప్రాజెక్టు పెట్టుబడుల ప్రతిపాదనలకు కూడా ఆమోదం ఉండాలన్నారు. దాని తర్వాతే ప్రాజెక్టుకు జాతీయహోదాపై స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని, ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు.
తెలంగాణ ప్రభుత్వం దరఖాస్తు పెట్టుకొని ఆరేండ్లవుతున్నది. ఇప్పుడు ఓ ఎంపీ అడిగితే గానీ విషయం బయటకు చెప్పలేదు. మరోవైపు.. మొన్నటిదాకా అసలు జాతీయ హోదా కోసం కేసీఆర్ ప్రభుత్వం అడగనేలేదని బీజేపీ ఎంపీలు వాదించారు. ఇప్పుడు పార్లమెంట్ సాక్షిగా కేంద్రం కుట్రలు బయటపడ్డాక మౌనం వహిస్తున్నారు. రాష్ట్రం నుంచి మేం నలుగురం ఎంపీలం ఉన్నామని గొప్పలకు పోయే బీజేపీ ఎంపీలు రాష్ర్టానికి జరుగుతున్న అన్యాయాన్ని ఏనాడూ ప్రశ్నించిన పాపాన పోలేదు. వీళ్లతో ఇప్పటివరకు తెలంగాణకు పైసా లాభం జరగలేదు. రాష్ట్ర ప్రాజెక్టుకు జాతీయహోదా ఇచ్చేది లేదని పార్లమెంట్ సాక్షిగా చెప్పాక కూడా ఏ ఒక్క బీజేపీ ఎంపీ, రాష్ట్ర నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్రమంత్రి నోరు మెదపలేదు. దీన్నిబట్టే అర్థమవుతున్నది మన రాష్ట్రంపై వీరికి ఎంత ప్రేమ ఉన్నదో.
ఒక రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు, ఆ రాష్ర్టానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం ఎంపీ లు పోరాడాలి. కానీ మన రాష్ర్టానికి చెందిన బీజేపీ ఎంపీ లు ఏమీ మాట్లాడరు. కేంద్రం ‘మీ వడ్లు కొనమంటే కొనం’ అని అన్నా సప్పుడు చేయరు. కేంద్రం రాష్ర్టానికి పైసా వరద సాయం ఇవ్వకున్నా మాట్లాడరు. రాష్ర్టానికి రావాల్సిన ఐటీఐఆర్ను గుజరాత్కు పట్టుకుపోయినా పెదవి విప్పరు. కానీ, రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొట్టడంలో మాత్రం ముం దుంటారు. తమ పదవులు కాపాడుకునేందుకు పార్టీ పెద్దల దగ్గర భజన చేస్తుండటంతోనే కాలం గడుస్తున్నది.
ఇంత వివక్షనా?: 2021లో తౌక్టే తుఫాను వల్ల పలు రాష్ర్టాలతో పాటు గుజరాత్లో కూడా వరదలొచ్చాయి. వెంటనే ప్రధాని మోదీ రంగంలోకి దిగి ఎప్పటికప్పుడు రివ్యూ చేశారు. నష్టంపై సర్వే చేయించి అప్పటికప్పుడు రూ.వెయ్యి కోట్ల సాయాన్ని ప్రకటించారు. కానీ, గతంలో హైదరాబాద్కు వరదలొచ్చి సిటీ ఆగమాగమైనా కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. రాష్ర్టానికి ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ వాటాగా న్యాయబద్ధంగా రావాల్సిన నిధులు తప్ప, అదనపు నిధుల ఊసే లేదు. ఆ నిధులను అడిగే సాహసం రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు చేయడం లేదు. పైసా తీసుకురావడం చేతగాని, రాష్ర్టానికి చెందిన కేంద్రమంత్రి చాలా నిధులిచ్చామని ప్రెస్మీట్లు పెట్టి మరీ చెప్పుకోవడం సిగ్గుచేటు.
ఇవే కాదు, రాష్ర్టానికి రావాల్సిన జీఎస్టీ, కంపన్సేషన్ నిధులు, జాతీయ వర్సిటీలు.. ఇలా ఏ ఒక్క దానికోసం బీజేపీ ఎంపీలు మాట్లాడరు. ఇలాంటోళ్లు ఇప్పుడు పాదయాత్రల పేరుతో ఏ మొహం పెట్టుకొని జనంలోకి వస్తారు? ప్రజలకు ఏం చేశామని చెప్తారు? బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, పసుపు బోర్డు, చెరుకు రైతుల సమస్యల పరిష్కారం, మెగా పవర్లూమ్ క్లస్టర్, టెక్స్టైల్ పార్కులు, జాతీయ రహదారులు, కేంద్రీయ, నవోదయ విద్యాలయాలు.. ఇలా చెప్పుకొంటూ పోతే రాష్ర్టానికి కేంద్రం నుంచి రావాల్సిన వాటి లిస్ట్ పెద్దగానే ఉంటుంది. అయినా ఎప్పుడూ వీటి గురిం చి ప్రస్తావించరు.
‘ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందన్నట్టు’.. రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలు ఇంత ఒత్తిడి తెస్తుండగానే బీజేపీ నాయకులు నిధుల మాటెత్తడం లేదు. ఇలాంటి వీళ్లు.. ‘రాష్ట్రంలో మేం అధికారంలోకి వస్తే కేంద్రం నుంచి మస్తు నిధులు తీసుకొస్తాం.. రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తామని’ బాకాలూదుతున్నారు. ప్రజలు తమను ఎలా నమ్ముతారనుకుంటున్నారో అర్థం కావడం లేదు. రాష్ట్ర సమస్యలు పక్కనపెడితే కనీసం తమ నియోజకవర్గ సమస్యలపైనా పార్లమెంట్లో ప్రస్తావించే దమ్ములేనోళ్లు రాష్ర్టానికి ఏదో చేస్తామని చెప్తే ఎలా నమ్ముతామని తెలంగాణ ప్రజానీకమే ప్రశ్నిస్తున్నది.
(వ్యాసకర్త: టీఆర్ఎస్ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్)
-వై.సతీష్రెడ్డి
96414 66666