ఒక కార్య సాధకుడు రాష్ట్రంలో అనితర సాధ్యమైన కార్యమొకటి మొదలు పెట్టాడు. దళితుల కుటుంబాల్లో వెలుగులు పంచే కార్యక్రమం అది. ఆ కార్యక్రమం పేరు‘దళితబంధు’. కార్యసాధకుడు కేసీఆర్. ‘దళితబంధు’ ప్లానింగ్ అంతా ముఖ్యమంత్రిది. ఎగ్జిక్యూషన్ అంతా రాహుల్ బొజ్జా, కర్ణన్లది.
భవిష్యత్తులో చేపట్టే పనుల రూపురేఖలు ఎట్లుండబోతాయోనని దార్శనికంగా ఆలోచించి, ఈ పనిపై లోతైన మేధోమథనం చేసిన తర్వాతనే దార్శనికులు పనులు మొదలుపెడతారు. ఎంతటి కఠినమైన దారిలోనైనా నడుచుకుంటూ గమ్యం చేరే సాధన కేసీఆర్కు బాగా తెలుసు. చిత్తశుద్ధి, వాక్శుద్ధి, లక్ష్యశుద్ధి కలగలిసిన రూపంగా తెలంగాణ పునర్నిర్మాణం చేస్తున్న కేసీఆర్ ఇప్పటిదాకా ఎవరూ చేయని, చేయలేని సాహసాన్ని చూపుతూ ‘దళితబంధు’ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇందుకు హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ప్రయోగశాలగా ఎంచుకొని ‘దళితబంధు’ ఆలోచనల అమలుకు హుజూరాబాద్ డిక్లరేషన్ను విడుదల చేశారు. ‘దళితబంధు’ను ప్రారంభిస్తూ కేసీఆర్ చరిత్రాత్మక ప్రసంగం చేశారు. హుజూరాబాద్ డిక్లరేషన్ అదే సభలో ఆచరణాత్మక రూపంగా ఆవిష్కరింపబడింది. హుజూరాబాద్ సభలోనే కొందరు లబ్ధిదారులకు చెక్కులందించారు. కేసీఆర్ కలల రూపానికి, మేధోమథనానికి ప్రతిరూపంగా ప్రవేశపెట్టిన దళితబంధును ఆచరణ రూపునివ్వటానికి తనకు ఇష్ఠుడు, ఇచ్చిన పనిని సమర్ధవంతంగా పూర్తిచేయగల కర్తవ్యధారి ఆర్.కర్ణన్ను కరీంనగర్ కలెక్టర్గా నియమించారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు హుజూరాబాద్ ‘దళితబంధు’ పథకం అమలుకు కర్ణన్ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో పాలనా విభాగాలన్నింటిని సమర్థవంతంగా పనిలో పెట్టారు. కేసీఆర్ ఆదేశాలను ఎప్పటికప్పుడు అమలు జరిపే మంత్రి హరీశ్రావు విశ్రాంతి లేకుండా సమీక్షలు చేస్తున్నారు. ‘దళితబంధు’ అమలుకోసమే సీఎంఓలోకి తీసుకున్న మరో సమర్థవంతమైన ఉన్నతాధికారి రాహుల్ బొజ్జా కార్యక్షేత్రంలో పర్యవేక్షణ సాగిస్తున్నారు. రాహుల్ బొజ్జా, కలెక్టర్ కర్ణన్ వారం రోజుల్లోనే ముమ్మరంగా సర్వే పూర్తిచేసి హుజూరాబాద్ నియోజకవర్గంలో 21 వేలమంది దళితులున్నట్లు తేల్చారు.
కేసీఆర్ చేతులమీదుగా దళితబంధు పథకాన్ని తొలిసారి అందుకున్న లబ్ధిదారులు రూ.10 లక్షలతో ఏం చేయబోతున్నారన్న ఆలోచనలను కర్ణన్ స్వయం గా తెలుసుకుంటున్నారు. కేసీఆర్ ఏ ఆలోచనలతో ఈ పథకం ప్రవేశపెట్టి దళితుల జీవితాల్లో నూతనత్వాన్ని చూడాలనుకుంటున్నారో అందుకు సాక్షీభూతంగా పాలనాయంత్రాంగం కార్యరంగాన్ని సన్నద్ధం చేస్తున్నది. హుజూరాబాద్ ప్రయోగశాలలో జరుగుతున్న సర్వేలు, నిర్ణయాలు, ఆచరణలు, లబ్ధిదారులు ఎంచుకునే పథకాలు అన్నీ తర్వాత ఇతర జిల్లాలకు మిగతా నియోజకవర్గాలకు మార్గదర్శకంగా నిలుస్తాయి.
రెండేండ్లు వెనక్కు వెళ్దాం. కొందరు కాళేశ్వరం అసాధ్యమని, తలకు మించిన భారమన్నారు. కానీ ఇవాళ ఆ కొందరే ఇదొక మానవ నిర్మిత మహాద్భుతం అంటున్నారు. దేశ నలుమూలల నుంచి జనం వచ్చి చూస్తుండటంతో కాళేశ్వరం పర్యాటక ప్రాంతమైంది. అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించరు. జరిగాక అద్భుతమని ఎవరికీ చెప్పవలసిన పనిలేదు. రెండవసారి తెలంగాణలో ఒక మహాద్భుతం జరుగుతున్నది. దివాంధులు దాన్ని గుర్తించడం లేదు అంతే. రేపటి దళిత సూర్యోదయానికి ఇవాళ ఒక చంద్రుడు చేస్తున్న మహాయజ్ఞం ‘దళితబంధు’.
జూలూరు గౌరీశంకర్