‘దశపుత్ర సమా కన్యా దశపుత్రాన్ ప్రవర్ధయాన్/ యత్ఫలం లభతే మర్త్యస్తల్లభ్యం కన్యయౌకయా’ అన్నారు పూర్వీకులు. ఒక కుమార్తె పది మంది కుమారులకు సమానం. పది మంది కుమారులను పెంచిన సత్ఫలితం ఒక బాలికను పెంచితే లభిస్తుందని ఆనాడే బోధించారు. తెలంగాణ సమాజంలో బిడ్డ పుడితే లక్ష్మీదేవి వచ్చిందని అపురూపంగా చెప్పుకొంటారు. తెలంగాణ ప్రభుత్వం కూడా బాలికల అభ్యున్నతికి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నది. విద్యతో పాటు ఇతర రంగాల్లో బాలికలు సాధిస్తున్న విజయాలే ఇందుకు నిదర్శనం. కేంద్ర ప్రభుత్వం జనవరి 24ను జాతీయ బాలికా దినోత్సవంగా మొక్కుబడిగా ప్రకటించిందే తప్ప, లక్ష్యసాధనకు చేసింది శూన్యం. ఈ నేపథ్యంలో తెలంగాణ సమాజం సాధించిన ప్రగతిని మననం చేసుకొని మరింత దృఢచిత్తంతో ముందుకుపోవలసి ఉన్నది.
గురుకుల ప్రవేశాల్లోగాని, ఉన్నత విద్యలో గాని విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగిపోవడమే తెలంగాణ రాష్ట్రం సాధించిన అభివృద్ధిని తెలియజేస్తున్నది. గురుకులాల్లో బాలికల సంఖ్య 69 శాతం ఉన్నది. విద్యార్థినుల సంఖ్య డిగ్రీలో 52 శాతం ఉంటే, పీజీ కోర్సులలో అంతకుమించి 72 శాతానికి చేరుకోవడం విశేషం. బీఎడ్లో 81 శాతం విదార్థినులే ప్రవేశం పొందారు. గురుకులాలు, మాడల్ స్కూళ్లు, కేజీబీవీలలో బాలికల జోరు చూస్తుంటే గ్రామీణ ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్న పరివర్తన తెలిసిపోతుంది. మహిళల ముందడుగు విషయంలో సాధారణంగా కేరళ ముందు వరుసలో ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ జాతీయ స్థాయిలో కేరళకు దరిదాపులలో ఉన్నది. అన్ని సామాజికవర్గాలలో ఈ అభివృద్ధి కనిపించడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం 973 గురుకులాలను స్థాపిస్తే, అందులో 506 బాలికలవే. రాష్ట్రంలో విద్యార్థినుల కోసం 53 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు, 12 మహిళా పాలిటెక్నిక్, రెండు ఇంజినీరింగ్ కళాశాలలున్నాయి. రెండు న్యాయకళాశాలలు, ఐదు పీజీ గురుకులాలున్నాయి. పేద బాలికలు 5వ తరగతిలో గురుకులంలో చేరితో పీజీ వరకు ఉచిత విద్యను అందుకోవచ్చు.
బాలికల అభ్యున్నతికి వసతులు కల్పించడమే కాకుండా, తల్లిదండ్రులలో, సమాజంలో భావ విప్లవాన్ని తీసుకురావడం ముఖ్యమంత్రి కేసీఆర్ సాధించిన ఘనత. బాల్యవివాహాలు చేయడమనేది తల్లిదండ్రులకు బిడ్డలపై ప్రేమ లేక కాదు, ఆధునిక సమాజానికి అనుగుణమైన రీతిలో వారిని తీర్చిదిద్దాలనేది తెలువక పోవడం వల్ల. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారిణులకు ప్రోత్సాహకాలు ఇవ్వడం వంటి చర్యల ద్వారా బాలికల శక్తిని చాటగలిగింది. కల్యాణలక్ష్మీ పథకం ద్వారా బాల్య వివాహాలను నివారించగలుగుతున్నది. పేదలకు బాలిక పుడితే రూ.12 వేలకు అదనంగా మరో వెయ్యి రూపాయలు ఇస్తున్నది. అందుకే తెలంగాణలో బాలికల సంఖ్య జాతీయ సగటును మించిపోయింది. తెలంగాణలో లక్ష్మీ కళ వెలుగులీనుతున్నది.