ప్రజాస్వామ్యంలో ఉప ఎన్నికలను ప్రజలు కోరుకోవాలి కానీ నాయకులు కాదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలే కోరుకుంటే పార్టీలు పోటీతత్వంతో ప్రజల మద్దతు పొందేందుకు ప్రయత్నించాలి. అంతే కానీ మునుగోడు ఉపఎన్నిక కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి చేతకానితనం వల్ల వచ్చింది. ఓటర్లను డబ్బుతో కొనొచ్చనే అహంకారంతో ఆయన ఈ ఉప ఎన్నికను కోరి తెచ్చుకున్నారు.
రాజగోపాల్రెడ్డి 2018లో మొదటిసారి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కానీ తన ఆత్మగౌరవం దెబ్బతిన్నదని చెప్తూ ప్రజలు ఇచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. మళ్లీ ప్రజల చేతిలోనే రెఫరెండం పెట్టారు. అంటే తనను గెలిపించి ప్రజలే తప్పుచేసి ఉంటారని ఆయన భావించి ఉంటారు. అందుకే ప్రజలనే దోషులను చేసి ఉపఎన్నికకు వెళ్లారు. కానీ మునుగోడు ఓటర్లు తనకు కర్రు కాల్చి వాతపెట్టే రోజులు వస్తాయని, తన రాజకీయ భవితవ్యం ఇక ముగుస్తుందని బహుశా ఊహించి ఉండకపోవచ్చు.
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం 1967లో ఏర్పాటైంది. ఇప్పటివరకు 12 సార్లు ఎన్నికలు జరిగాయి. కొన్ని దశాబ్దాల పాటు అక్కడ ఎక్కువ రాజకీయ పార్టీల ఉనికి లేకపోవడంతో కాంగ్రెస్, కమ్యూనిస్టుపార్టీల ప్రభావం ఎక్కువగా ఉండేది. దాని కారణంగానే 1967-1983 వరకు జరిగిన ఎన్నికల్లో నాలుగుసార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఆ తర్వాత 1985-1994 వరకు జరిగిన ఎన్నికల్లో సీపీఐ మూడుసార్లు గెలిచింది. బీజేపీ 2014 ఎన్నికల్లో 15.97 శాతం ఓట్లు, 2018లో 6.40 శాతం ఓట్లు పొందింది. అంటే మునుగోడులో బీజేపీకి ఓటు బ్యాంకు లేదని అర్థం చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. 2014లో జరిగిన ఎన్నికల్లో తెరాస అనూహ్యంగా 38.13 శాతం ఓట్లు సాధించి మునుగోడుపై గులాబీ జెండా ఎగురవేసింది. 2018లో 37.56 శాతం ఓట్లు సాధించి ద్వితీయ స్థానంలో నిలిచింది. గత ఎన్నికల్లో మునుగోడు ప్రజలు రాజగోపాల్రెడ్డిని గెలిపిస్తే, ఆయన నియోజకవర్గ అభివృద్ధిపై ఏనాడూ శ్రద్ధ పెట్టలేదు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను కూడా అభివృద్ధికి ఉపయోగించలేకపోయారు. కానీ ఇప్పుడు తిరిగి మళ్లీ నన్నే గెలిపించమని నోట్ల కట్టలతో రంగప్రవేశం చేశారు. అయితే రాజగోపాల్రెడ్డిని రానీయకుండా ప్రజలు ప్రతి గ్రామంలో అడ్డుకోవడం అభినందనీయం. ప్రజలు తలచుకుంటే ఎంతటివారైనినా ఓడగొట్టడం తప్పదని తెలిసిన రాజగోపాల్రెడ్డి మతిస్థిమితం కోల్పోయినట్లు ప్రవర్తిస్తున్నారు! మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థికి ఆ పార్టీ నాయకుల నుంచే సంపూర్ణ మద్దతు లేకుండాపోయింది. ఈ పరిణామాల నేపథ్ంయంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు లాంఛనమేనని చెప్పవచ్చు.
మునుగోడుకు తమ పార్టీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించకపోయినా, టీఆర్ఎస్ ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషిచేస్తూనే ఉంది. నియోజకవర్గంలో 2.41 లక్షల మంది ఓటర్లుంటే, వారిలో 2.38 లక్షల మందికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. రైతుబంధు సాయం 1.46 లక్షల మందికి, 39,866 మందికి ఆసరా పింఛన్లు అందుతున్నాయి. 37,335 మందికి కేసీఆర్ కిట్స్ అందగా; కల్యాణలక్ష్మి ద్వారా 8,628, షాదీ ముబారక్ ద్వారా 245 మంది లబ్ధి పొందారు. 5,370 మందికి ప్రభుత్వం గొర్లు పంపిణీ చేసింది. 1,187 కుటుంబాలు రైతు బీమా పొందాయి. నేతన్నలకు చేనేత మిత్ర పథకం ద్వారా నూలుపై 50 శాతం రాయితీ లభిస్తున్నది. 10,500 కుటుంబాలకు లబ్ధి చేకూరేలా చేనేతకారులకు లక్ష రూపాయల వరకు వ్యక్తిగత రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. నియోజకవర్గ రైతుల చిరకాల కోరిక అయిన చర్లగూడెం, శివన్నగూడెం, లక్ష్మణపల్లి, కిస్టరాయినిపల్లి రిజర్వాయర్ల పనులను 70 శాతం పూర్తిచేసింది. చుండూరు, చౌటుప్పల్ పురపాలికల్లో సుపరిపాలన అందిస్తున్నది. దండు మల్కాపూర్ దగ్గర 579 ఎకరాల్లో చిన్న పరిశ్రమల పార్కు ఏర్పాటుచేసింది. ఇందులో 50 కంపెనీలు ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించి 3 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఇక్కడ త్వరలోనే ప్రభుత్వం నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటుచేయనున్నది. దీంతో యువతకు మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
ప్రస్తుతం మునుగోడు నియోజకవర్గంలో ఎక్కడచూసినా ప్రతిపక్షపార్టీలు మనుగడ సాగించలేని పరిస్థితి. అందుకే అవన్నీ వారి వైరుధ్యాలను, అజెండాలను పక్కనపెట్టి అంతర్గతంగా అంటకాగుతున్నాయి. ఈ విషయాలను మునుగోడు ప్రజలు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. నోట్లతో ఓట్లు కొనాలనే బీజేపీ లాంటి పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలి. బీఎస్పీ సహా ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై కేవలం కాంగ్రెస్ ఓటు బ్యాంకునే చీలుస్తున్నాయని అందరూ గమనించాలి. తిరుగులేని ఓటుబ్యాంకుతో విజయం తథ్యమని తెలిసినా టీఆర్ఎస్ నాయకులు ప్రజల మధ్యే తిరుగుతున్నారు. ప్రభుత్వ పథకాల గురించి వివరిస్తూ ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. నిజానికి ఈ ఉప ఎన్నిక ప్రజలకు, తన స్వార్థం కోసం దొడ్డిదారిన వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు తెచ్చుకున్న రాజగోపాల్ రెడ్డికి మధ్య జరుగుతున్న ఎన్నిక. ఏ ఎన్నికయినా అంతిమంగా గెలవాల్సింది ప్రజలే. వాళ్లే ఆలోచించి ప్రజా సర్కారుకు పట్టం కట్టాలి. తన అభివృద్ధి కోసం ప్రజల నెత్తిన ఉప ఎన్నికను రుద్దిన రాజగోపాల్ రెడ్డి స్వార్థ రాజకీయాలకు సమాధి కట్టాలి.
(వ్యాసకర్త: మర్రి యాదవ రెడ్డి , 73372 22461 కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్)