ఒకదేశం ప్రగతి సాధించాలంటే అన్నిటికంటే ముఖ్యమైనవి మానవ వనరులు. ప్రకృతి ప్రసాదించిన ఎన్ని వనరులు ఉన్నా, ప్రజల మేధ, ఆ వనరులను ఉపయోగించుకునే విచక్షణ మీదే ఆ దేశ ప్రగతి ఆధారపడి ఉంటుంది. నిజానికి భారతదేశంలో ఒక రాష్ట్రమంత కూడా లేని ఇంగ్లాండు ప్రపంచంలో సింహభాగాన్ని ఆక్రమించి వారి వనరులు కొల్లగొట్టి ఎదిగితే, అమెరికా ప్రపంచంలోని మానవ వనరులన్నింటినీ పోగేసుకొని సాంకేతికంగా, ఆర్థికంగా తిరుగులేని శక్తిగా నిలిచింది.
వెయ్యేండ్లు విదేశీయుల ఆక్రమణ, నిరంకుశ పరిపాలన కింద నలిగిన భారతదేశం తన సంస్కృతి, చరిత్రను మాత్రం జారవిడుచుకోలేదు. శతాబ్దాల వారసత్వ, జాతీయ సంపదను కాపాడుకున్నది. కానీ స్వాతంత్య్రం సాధించిన తరువాత ఏడు దశాబ్దాలకు కూడా అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో కాక ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఎందుకు వెనుకబడింది ? మేధ కలిగిన వారి విదేశీ వలసలకు కారణమేంటి?
ఈనాటి భారతదేశ పరిస్థితికి అస్తవ్యస్త విద్యావ్యవస్థ మూలకారణమైతే, అది అలా మారటానికి ముఖ్య కారణం భాష సమస్య. వేర్వేరు దేశాలుగా పరిఢవిల్లిన ప్రస్తుత భారతదేశం వివిధ భాషలు, మతాలు, సంస్కృతుల నిలయం. నిజానికి మొఘలు సామ్రాజ్యవిస్తరణ, బ్రిటిష్వారి పాలనవల్ల ఒక దేశంగా ఏర్పడిన భారతదేశం స్వాతంత్య్రనంతరం ఎన్నో సమస్యల నెదుర్కొన్నది. అన్నింటిలో ముఖ్యమైనది భాష సమస్య. దేశ భాషగా ఏ భాష ఉండాలన్నది ప్రధాన సమస్య. అప్పటికే బ్రిటిష్వారి ఇంగ్లీషు మాధ్యమ చదువు భారతీయుల అభిమానాన్ని చూరగొన్నది.
నిజానికి మెకాలే రూపొందించిన బ్రిటీష్ విద్యావిధానం భారతీయులను వారి సాం స్కృతిక భాష అయిన సంస్కృతానికి దూరం చేసింది. అది అర్థం చేసుకొని ఉంటే బహుశ ప్రథమ ప్రధాని నెహ్రూ సంస్కృ తం, ఉర్దూ భాషలను దేశభాషలుగా ప్రకటించి, ఇంగ్లీషును తప్పనిసరి భాషగాను, ఏ రాష్ట్రంలోని వారు వారి మాతృభాషలో చదువుకొనేటట్టు చేసి ఉండేవారు. కాని విదేశాలలో చదువుకొని, భారతీయ సంస్కృతి మీద లేశమైనా గౌరవంలేని నెహ్రూకి సంస్కృతాన్ని ప్రవేశపెట్టాలనిపించలేదు. అప్పుడు ఆయన ఒక అద్భుతమైన మోసం చేశారు.
ఆగస్టు 1947, స్వతంత్రం వచ్చేనాటికి నెహ్రూ చెప్పినట్టు దేశంలో హిందీ భాషని మాట్లాడేవారు మిగతావారికంటే ఎక్కువేంకాదు. కానీ ఆయన కొన్ని భాషలను కలిపేసి అందరూ హిందీ మాతృభాషగా మాట్లాడేవారని చూపించాడు. తెలుగు, మరాఠీ, తమి ళం, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయా ళం, ఒడియా, అస్సామీస్ మాట్లాడేవారి జనా భా విడిగా చూపించాడు. వేర్వేరు ప్రాంతాల్లో మాట్లాడే భాషలన్నిటినీ కలిపి హిందీ జనాభాగా చూపించాడు. ఈ మోసాన్ని దక్షిణాది రాష్ర్టాలు కనిపెట్టలేకపోయాయి. ఇక చాలామంది మంత్రులు, మేధావులు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ వారు కాబట్టి సంతోషంగా మౌనం వహించారు. అంతా కలిపి హిందీ మాట్లాడేవారు 42.01 శాతంగా చూపించడంతో ఇతరులకు మాట్లాడే అవకాశం లేకుండా పోయింది. ఇంగ్లీషుని తప్పనిసరి భాషగా, ప్రాంతీయ భాషలను మూడోభాషగా విద్యావిధానాన్ని రూపొందించారు. అయితే 1969లో ఇంగ్లీషును కాదని హిందీ మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని చూడగా తమిళులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో కేంద్రం వెనక్కితగ్గి ఉన్నత విద్యను, ముఖ్యం గా జాతీయస్థాయి విద్యాసంస్థల్లో అందించే కోర్సులను ఇంగ్లీషు మాధ్యమంలోనే అందించాలని నిర్ణయించింది.
ఇక 20,21 శతాబ్దాలలో జరిగిన సాంకేతిక ప్రగతి ముఖ్యంగా ఇంగ్లీషు భాష మాట్లా డే దేశాల వల్ల జరగడం, బ్రిటిష్ పాలకుల వల్ల ఇంగ్లీషు చాలా దేశాలకు సుపరిచిత మవడంతో ప్రపంచభాషగా మారింది. దీంతో భారతీయులు ఇంగ్లీషు మాధ్యమంలో అభ్యసించడానికి మొగ్గు చూపుతున్నారు.
కానీ అన్ని విద్యాసంస్థలూ, విశ్వవిద్యాలయాల్లో హిందీ మాధ్యమం ఉండాలన్న బీజే పీ వాదన ఆచరణ సాధ్యంకాదు. ఎందుకంటే ఉన్నత పరిశోధన పుస్తకాలు ఇంగ్లీషులో ప్రపంచమంతా దొరుకుతాయి. కానీ హిందీ లో దొరకవు.
ఒకవేళ మొండిగా హిందీని అమలు చేస్తే హిందీ మాధ్యమంలో చదివినవారి భవిష్యత్తు ఏమిటీ? విదేశాల్లో చదువుకోటానికైనా, ఉద్యోగాలకైనా వారికి అవకాశాలేముంటాయి.? వారందరికీ ఉద్యోగాలు కల్పించగలరా? అదీ సాధ్యం కాదు. ఈ సమస్యను జఠిలం చేస్తే గత ఉద్యమం కంటే తీవ్రమైన ఉద్యమం రాకపోదు.
-కనకదుర్గ దంటు , 8977243484