ఆదివాసీ హక్కుల కోసం పోరాడి, ఆదివాసులకే అటవీ హక్కులు చెందాలని జీవిత లక్ష్యంగా పనిచేసిన వ్యక్తి బియ్యాల జనార్దన్రావు. వారి భూములు గిరిజనేతరుల సాగులో ఉండటాన్నిచూసి బియ్యాల చలించిపోయిన మానవతా వాది. 1/70 చట్టానికి చట్టబద్ధత కల్పించడం కోసం కృషిచేసిన మహనీయుడు. ప్రొఫెసర్ జయశంకర్, ప్రముఖ కవి కాళోజీ, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్లతో కలిసి తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటుకు కృషి చేసిన సిసలైన తెలంగాణ వాది. తెలంగాణ ఉద్యమంతో పాటు అనేక సామాజిక ఉద్యమాలకు నాయకత్వం వహించిన అధ్యాపక నాయకుడు.
రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్ జిల్లా నెల్లికుదురు మండలంలోని మునిగలవీడు గ్రామంలో బియ్యాల కిషన్రావు-అంజమ్మ దంపతులకు 1955 అక్టోబర్ 12న బియ్యాల జనార్దన్రావు జన్మించారు. బియ్యాల జనార్దన్రావు కుటుంబం వరంగల్ జిల్లా కొత్తగూడెం మండలం ఓటాయి గ్రామానికి వలస వెళ్లింది. ఇది ఆదివాసులు, గిరిజనులు ఎక్కువగా నివసించే ఏజెన్సీ ప్రాంతం. అందుకే జనార్దన్రావు ఆదివాసులు, గిరిజనుల జీవన విధానం, సంస్కృతి, అటవీ హక్కులు, భూమి హక్కుల గురించి పూర్తిగా అవగాహన చేసుకున్నారు.
1979లో కాకతీయ యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. 1981లో ఎంఫిల్ పూర్తిచేశారు. 1985లో ‘గిరిజన భూముల పరాయికరణ’ అనే పరిశోధనా గ్రంథానికి గాను పీహెచ్డీ పట్టా పొందారు. ఐసీఎస్ఎస్ఆర్ ద్వారా పీడీఎఫ్ చేశారు. తాను చదువుకున్న, పరిశోధన చేసిన కాకతీయ యూనివర్సిటీలోనే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ప్రొఫెసర్గా పనిచేశారు. ఆదివాసి హక్కుల కోసం, వారి చట్టాల కోసం, వారిలో చాలా అవగాహన పెంచేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్నో పరిశోధనాత్మక గ్రంథాలను రాసిన బియ్యాల జనార్దన్రావు ఆదివాసులకు హక్కుల గొంతుకగా, ఆదివాసి హక్కుల ఉద్యమ కార్యకర్తగా వారికి అండదండగా నిలిచారు. అందుకే ప్రజలు ఆయనకు ‘ఆదివాసి ఉద్యమ దివిటీ’ అని బిరుదునిచ్చారు.
తన జీవిత లక్ష్యం ఆదివాసుల హక్కుల కోసం పోరాడటం, నాడు సమైక్య పాలకుల చేత తెలంగాణ ప్రాంతం ‘నిధులు, నీళ్లు, నియామకాల’లో జరుగుతున్న అన్యాయాల గురించి ప్రజలకు తెలియజేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైతేనే ఈ ప్రాంతం సమగ్రాభివృద్ధి సాధిస్తుందని భావించి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఊపిరిపోసిన మహనీయుడు. బియ్యాల జనార్దన్ రావు తెలంగాణ ఉద్యమానికి ఒక పునాదిరాయిగా నిలిచారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్, ప్రముఖ కవి కాళోజీ నారాయణరావు, నేటి మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావులతో కలిసి తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటుకు కృషిచేసిన ప్రముఖ తెలంగాణ వాది బియ్యాల జనార్దన్రావు. కాకతీయ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా తన విధులు నిర్వహిస్తూనే విద్యార్థులు, యువకులు, స్నేహితులతో కలసి అనేక సామాజిక ఉద్యమాలకు నాయకత్వం వహించారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన అనేక పోరాటాల్లో ముందుండి పాల్గొన్నారు. ప్రపంచంలో జరుగుతున్న ఏకైక ఆదివాసి గిరిజన జాతర సమ్మక్క-సారక్క మేడారం జాతర జరుగుతున్న సమయంలో బియ్యాల 2002 ఫిబ్రవరి 27న గుండెపోటుతో తుదిశ్వాస విడిచా రు. యావత్ తెలంగాణ ప్రజానీ కం బియ్యాల జనార్దన్రావు ఉద్య మ పోరాటస్ఫూర్తిని ఆదర్శంగా తీ సుకొని ముందుగుసాగడమే ఆ యనకు మనమిచ్చే ఘన నివాళి.
(వ్యాసకర్త: ఈదునూరి వెంకటేశ్వర్లు 99663 36457, రీసెర్చ్ స్కాలర్, కేయూ)