ఓ దిక్కు హిజాబ్ వివాదాలు, మరో దిక్కు హనుమాన్ చాలీసా నినాదాలు. సిటిజన్షిప్ వ్యతిరేక నిరసనలు, సర్జికల్ స్ట్రయిక్ దాడులు, ట్రిపుల్ తలాక్ రాజకీయాలు, రాష్ర్టాల్లో ప్రభుత్వాల కూల్చివేతలు, చైనా- పాకిస్థాన్- బంగ్లాదేశ్ సరిహద్దు పంచాయితీలు, నీళ్ల కోసం రాష్ర్టాల మధ్య కొట్లాటలు, నిధుల కోసం కేంద్రంపై రాష్ర్టాల పోరాటాలు, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నిత్యం ప్రజల ఆక్రందనలు, ఆందోళనలు బతుకు కోసం పోరాటాలు ఇదీ ప్రస్తుత దేశ పరిస్థితి.
ఈడీలు, సీబీఐలు బ్రిటిష్ నల్ల చట్టాల మాదిరిగా దేశంలో దాడులు కొనసాగిస్తున్నాయి. పార్లమెంటు సాక్షిగా రాజ్యాంగంపై ప్రమాణం చేసిన నేతలు ఇవాళ ఆ ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తున్నారు. ఈ అవమానాల నుంచి భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దేశం వైపు అడుగులు వేస్తున్నారు. ఆ అడుగులు భారత ప్రజల అభివృద్ధికి అంకురార్పణ కానున్నాయి.
75 ఏండ్ల స్వయంపాలనలో కూడా ఈ దేశ పాలకులను నిందించే పరిస్థితి ఉన్నదంటే మనం సాధించిన ‘ప్రగతి’ ఎట్లా ఉన్నదో స్పష్టమవుతుంది. పంచవర్ష ప్రణాళికలు ప్రజలకు నిరాశలే మిగిల్చాయి. దేశాన్నేలిన పార్టీలు పేదల అభివృద్ధిని నిర్లక్ష్యం చేశాయి. అయితే 60 ఏండ్ల స్వతంత్ర పాలనలో తెలంగాణ ఒక ప్రయోగశాలగా నిలిచింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఇక్కడ పాలన జరిగింది. ఆ సమైక్య పాలనకు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ గాంధీ మార్గంలో పోరాటం సాగించి, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా తెలంగాణ స్వరాష్ర్టాన్ని సాధించారు. 2014కు ముందు వివక్ష, అణచివేత, ఆకలి- ఆక్రందనల ప్రాంతం తెలంగాణ. కేసీఆర్ సుదీర్ఘ మహోన్నత పోరాటం తర్వాత స్వరాష్ట్రం సిద్ధించింది. 29వ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో స్వయంపాలన దేశానికి దిక్సూచిగా ఉండాలని తలచి సబ్బండవర్గాల అభివృద్ధికి కంకణబద్ధులైన సీఎం కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నరు. వ్యవసాయం నుంచి నీళ్ల దాకా, వైద్యం నుంచి విద్య వరకు, ఆదివాసీల నుంచి అణగారిన వర్గాల వరకూ, దళితుల నుంచి దారిద్య్రానికి దిగువన ఉన్నవారి వరకూ అందరి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. సాగు, తాగునీరు, ఉచిత విద్యుత్ తెలంగాణకు కావాల్సిన ప్రాథమిక అంశాలుగా భావించి ఆ కర్తవ్య బాధ్యతల్లో ఎనిమిదేండ్లుగా ముందుకుసాగుతున్న తెలంగాణ ప్రజల అభివృద్ధి ప్రదాత కేసీఆర్. దేశం వజ్రోత్సవాలు జరుపుకొంటున్న వేళ, కొత్త రాష్ట్రం తెలంగాణ దేశంలో అగ్రగామిగా నిలుస్తున్నది. అపజయాల నుంచి విజయాల వైపు.. వివక్ష, అణచివేత నుంచి అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్నది. రాష్ట్ర ప్రజలుగా తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి పరంపరను తెలుసుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత.
మహాత్మా జ్యోతిబాపూలే చెప్పిన విద్యావకాశాలు, అంబేద్కర్ ఆర్థిక, సామాజిక, రాజకీయ నూతన ఆలోచనా విధానం, వారి కలలు ఇవాళ తెలంగాణలో సుసంపన్నమవుతున్నాయి. అస్తిత్వం నుంచి అభివృద్ధిలో తెలంగాణ ముందున్నదని ప్రపంచం అనుకునేలా మన రాష్ట్రం నిలిచింది. ప్రజల దీవెన వల్లనే ఇదంతా సాధ్యమైంది. స్వాతంత్య్ర భారతంలో ఏ పాలకులూ తీసుకురాని పథకాలకు సీఎం కేసీఆర్ అంకురార్పణ చేశారు. తెలంగాణ పథకాలు, తెలంగాణ పాలనపై అటు ప్రపంచదేశాలు ప్రశంసలందిస్తున్నాయి. దేశంలో కేంద్రంతోపాటు పలు రాష్ర్టాలు తెలంగాణ పాలనను అనుకరిస్తున్నాయి, అనుసరిస్తున్నాయి. తెలంగాణ అభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడుగడుగునా అడ్డుపడింది. ఎఫ్ఆర్బీఎం పరిమితికి మించి అప్పులు ఇవ్వొద్దని, అంతటితో ఆగకుండా ఇక్కడ ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా వాటిని ప్రైవేటుపరం చేయాలని, ఆర్టీసీని ప్రైవేటుశక్తులకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తీవ్ర ఒత్తిడి చేసింది. విద్యుత్పై రాష్ర్టాలకు హక్కులు లేకుండా కార్పొరేట్లకే అధిపత్యం ఉండేలా చట్టాన్ని తీసుకువస్తున్నది.
తెలంగాణ- ఆంధ్రప్రదేశ్, కర్ణాటక- తమిళనాడు రాష్ర్టాల మధ్య ఉన్న జల వివాదాలకు పరిష్కారం చూపేందుకు కేంద్రం ఒక్క అడుగు కూడా ముందుకువేయలేదు. ప్రజా సమస్యలను పక్కకునెట్టి పాలన సాగిస్తున్నది. ఈ నేపథ్యంలో, దేశంలో గుణాత్మక మార్పు రావాలని, దేశవ్యాప్తంగా అనేక సమస్యలకు పరిష్కారం చూపాలని, దేశమంతా సుపరిపాలన అందాలనే ప్రజల డిమాండ్ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారు.
తెలంగాణ ఉద్యమ తరహాలోనే దేశ ప్రజల సంక్షేమం కోసం మరో పోరాటానికి సిద్ధమవుతున్నారు కేసీఆర్. ప్రజలు కోరుకుంటున్న సెక్యులర్ దేశం నిర్మాణం కోసం కేసీఆర్ పెట్టబోయే పార్టీతో నిజమైన అడుగులు పడనున్నాయి. కేసీఆర్ సాగించే ఈ మహా పోరాటం లో మేధావులు, సామాజిక ఉద్యమకారులు, యువకులు, మహిళలు అంతా కలసి రావాలి. భారత్ రాష్ట్ర సమితిగా దేశంలో కేసీఆర్ నవశకానికి నాంది పలకనున్నారు. దసరా పర్వదినాన జమ్మిచెట్టు నుంచి ఆయుధాలు చేబూని కేసీఆర్ బయల్దేరుతున్నారు. దేశ పౌరులుగా మనమంతా కేసీఆర్కు అండగా నిలుద్దాం.
(వ్యాసకర్త: డాక్టర్ గాదరి కిశోర్కుమార్, తుంగతుర్తి ఎమ్మెల్యే)