బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి పిలవాల్సిన వారి జాబితా తయారుచేసి బండి సంజయ్ నడ్డాకు అందజేశాడు. అది చూడగానే నడ్డా ముందు నవ్వి తర్వాత ముఖం మాడ్చుకొని బండిని, జాబితాను ఎగాదిగా చూడసాగాడు. ఏం జరుగుతుందో అర్థం కాక బండి టెన్షన్తో జేబులో నుంచి గుట్కా తీసి, నడ్డా ముఖంలోని సీరియస్ నెస్ గమనించి గుట్కా ప్యాకెట్ జేబులోది జేబులోనే వదిలేసి లవంగం తీసుకొని.. ‘నేను నమిలేది లవంగమే.. మీ మీద ఒట్టు’ అని నడ్డాకు లవంగం చూపించాడు. నడ్డా అది పట్టించుకోకుండా జాబితా వైపు బండి వైపు మార్చి మార్చి చూడసాగాడు. అసలే టెన్షన్, గుట్కా లేక మరింత టెన్షన్, నడ్డా అలా ఎందుకు చూస్తున్నాడో తెలియక మరింత టెన్షన్.. ‘టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను ఏంటో చెప్పండి సార్’ అని బండి దీనంగా అడిగాడు.
ఈజాబితా నువ్వే తయారుచేశావా’ అని నడ్డా అడిగితే, ‘అనుకున్నదే అయింది’ అని బండి మనసులోనే అనుకుని ‘ఔను సార్ నేనే తయారుచేశాను ఈటల నా ముందు ఓ బచ్చా అందుకే జాబితాలో అతని పేరు చేర్చ లేదు. అయినా సీఎం పదవికి అతను నాకు పోటీనా తొక్కేస్తా, టికెట్ రాకుండా చేస్తా..’ అని మనసులోనే అనుకోని పైకి మాత్రం.. ‘అతను చోటా లీడర్ పైగా లెఫ్టిస్ట్ దిక్కు లేక మన పార్టీలోకి వచ్చాడు కానీ..’ అంటూ ఇంకా ఏదో చెప్పబోతుంటే నడ్డా చుప్ అని సైగచేసి.. ‘నేనేం అడుగుతున్నాను? నువ్వేం చెప్తున్నావ్? జాబితా తయారుచేసింది నువ్వేనా? అంటే ఈటెల అని చెప్తున్నావ్. ఇంతకూ ఈటెల అంటే మనిషి పేరా? లేక కార్యవర్గ సమావేశాల్లో వడ్డించే వంటకమా’? అని నడ్డా అడిగాడు.
అనవసరంగా బయటపడ్డాను, ఈటల గురించి నడ్డాకు అనవసరంగా చెప్పాను అని మనసులో అనుకొని.. ‘ఏం లేదు సారూ.. హైదరాబాద్ బిర్యానీ, సర్వపిండి, పచ్చిపులుసు అన్నీ చేయిస్తున్నాను’ అని బండి బదులిచ్చాడు . ‘సర్వపిండి, పచ్చిపులుసా? అవేం వంటలు ఎప్పుడూ వినలేదు… ఇంతకూ డోక్లా చేయిస్తున్నారు కదా?’అని నడ్డా అడిగాడు.
‘డోక్లా ఏంటి సార్’ అని బండి వినయంగా అడిగాడు. ‘గుజరాత్ వంటకం డోక్లా అంటే తెలియనివాడివి గుజరాతీల పార్టీ లీడర్గా ఎలా ఉన్నావయ్యా’ అని నడ్డా కోపంగా అడిగాడు.
డోక్లా అంటే తినే ఐటమా.., ఇంకా నయం ఏదో అనుకున్నాను అని మనసులోనే అనుకోని మౌనంగా ఉండి పోయాడు. వీళ్ళు మాట్లాడుకుంటుండగానే అక్కడికి మోదీ, షాలు వచ్చారు. నడ్డా తన చేతిలోని జాబితాను మోదీకి ఇచ్చి ‘సార్ ఇది అందరితో మాట్లాడి బండి తయారు చేసిన జాబితా’ అని చెప్పాడు.
కార్యవర్గ సమావేశానికి పిలవాల్సిన వారి పేర్లు వరుసగా ఉన్నాయి. మోదీ ఆ పేర్లు వరుసగా చదివాడు. 1.గవర్నర్, 2. ఈడీ, 3.సీబీఐ, 4.కేఏ పాల్.. అంటూ పేర్లు చదివి బండివైపు చిరాగ్గా చూసి.. ‘ఏమయ్యా మీ స్టేట్లో నువ్వొక్కడివే ఇలా ఉంటావా? అందరూ ఇలానే ఉంటారా’? అని అడిగాడు. ‘మేమంతా ఇలానే ఉంటాం సార్. మన పార్టీ కోసం పని చేసే వారందరిని గుర్తు పెట్టుకొని పిలుస్తాం సార్.. ఎవరినీ మరిచిపోమ్’ అని బండి ఉత్సాహంగా బదులిచ్చాడు. గవర్నర్ ఓ ఛానల్లో మనసు విప్పి మాట్లాడుతూ మా పార్టీ మా పార్టీ అని పదేపదే చెప్తుంటే ముచ్చటేసింది. ఇంటర్వ్యూ చేసే ఆయన మా పార్టీ అనొద్దు మా మాజీ పార్టీ అనాలని చెప్పినా గవర్నర్ మాత్రం అలానే మా పార్టీ అని చెప్పింది అందుకే గవర్నర్కు జాబితాలో చోటు అని బండి బదులిచ్చాడు.
‘చూడు బండి మనం ఎదిగేందుకు, ప్రత్యర్థులను అణచి వేసేందుకు అన్ని వ్యవస్థలు వాడుకుంటున్నాం. వాడుకోవాలి. కానీ ఇలా బహిరంగ సభలకు వారిని పిలువవద్దు.. వారు రావడానికి ఉత్సాహపడుతున్నారు ఆ సంగతి నాకు తెలుసు..’ అని మోదీ చెప్పారు. ‘అయ్యో సభకు రాలేక పోతున్నాను’ అని గవర్నర్ బాధపడతారని బండి మనసులోనే అనుకున్నాడు. ‘చూడు బండి… పార్టీ కోసం గవర్నర్ పనిచేయాలి కానీ పార్టీ మీటింగ్కు రానవసరం లేదు. పాల్ను ఉపయోగించుకోవాలి కానీ, పాల్కు మనం ఉపయోగపడొద్దు. మీటింగ్కు పిలిస్తే మనల్ని ఉపయోగించుకుంటాడు. ఇక ఈడీ, సీబీఐ లాంటివి ప్రభుత్వాలను కూల్చడానికి, ప్రత్యర్థి పార్టీల వారిపై ఉసిగొల్పడానికి ఉపయోగించుకోవాలి. వాళ్ళను మీటింగ్కు పిలిస్తే నచ్చని నేతల ఇళ్లపై దాడులు చేసేదెవరు’ అని బండికి మోదీ వివరించారు.
తలూపిన బండి.. ‘సార్ తెలంగాణలో సభ కాబట్టి తెలంగాణకు బోలెడు వరాలు ప్రకటిస్తే మనకు తిరుగులేదు. కాళేశ్వరానికి జాతీయహోదా, ఐటీఐఆర్ ప్రాజెక్టు, కాజీపేట రైల్వేకోచ్, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ వంటి హామీలన్నీ అమలు చేద్దాం సార్. విభజన చట్టంలోని హామీలన్నీ ఇచ్చేశామంటే పార్టీకి బోలెడు ప్రయోజనం’ అని బండి ఇంకా ఏదో చెప్తుంటే మోదీ గట్టిగా నవ్వి ..‘మా ఇంటికి వస్తే నాకేం తెస్తావ్? మీ ఇంటికి వస్తే నాకేం ఇస్తావ్’ అనేరకం మేం. ఢిల్లీకి తెలంగాణ వచ్చినా, తెలంగాణకు ఢిల్లీ వచ్చినా మాకే ఇవ్వాలి. మేమెవరికీ ఇవ్వం’ అని మోదీ ఖరాకండిగా చెప్పాడు. ‘ఏమీ ఇవ్వకపోతే తెలంగాణ జనం మన పార్టీని చీదరించుకుంటారేమో సార్’ అని అక్కడున్న పార్టీ నాయకులంతా కోరస్గా పలికారు.
‘పక్క రాష్ర్టానికి ప్రత్యేక హోదా, కాళేశ్వరానికి జాతీయహోదా లేదు గీదా లేదు కానీ మన పార్టీకి బోలెడు ఓట్లు తెచ్చే పథకం ఇస్తా’ అని మోదీ చెప్పగానే అంతా ఆసక్తిగా మోదీ వైపు చూశారు! భారీ ప్రాజెక్టులు, బోలెడు నిధులు, లక్షల మందికి ఉపాధి చూపే ప్రాజెక్టు అని ఎవరికి వారు ఊహల్లో మునిగిపోగా మోదీ అందరివైపు చూసి ‘మీ మనసులో ఏమనుకుంటున్నారో నాకు తెలుసు. అవేవి కాదు.. అవేవి ఓట్లు ఇచ్చేవి కావు..’ అన్నారు.
‘మరేంటి’ అని ప్రశ్నిస్తే…‘మీ రాష్ర్టానికి ఓ భారీ… అని సస్పెన్స్ కొనసాగిస్తూ.. మీ రాష్ర్టానికి ఎన్నికల నాటికి ఓ భారీ…. మతకలహాలు ప్లాన్ అమలు చేస్తాం. ఓట్ల వర్షం కురిపించే పథకం ఇదే’ అని మోదీ గట్టిగా నవ్వాడు.
– కౌటిల్య