ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అడుగడుగునా ఆర్థికంగా, రాజకీయంగా జరిగిన అన్యాయాలను ఎదిరించి రాష్ర్టాన్ని సాధించుకున్న తర్వాత, కేంద్ర ప్రభుత్వ పాలనావివక్ష శాపంలా మారింది. సీమాంధ్ర వలస పాలన వివక్ష నుంచి బయటపడ్డామనుకుంటే.., బీజేపీ రూపంలో భూతంలా మన ముందు నిలుచుంది. కొత్తగా ఏర్పడిన తెలంగాణను అన్నివిధాలా ఆదుకోవాల్సిన కేంద్రం, కనీసం విభజన హామీలనైనా నెరవేర్చకుండా సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తున్నది.
రాష్ట్ర విభజన సమయంలో రాజ్యాంగబద్ధంగా హామీ ఇచ్చినవాటిని కూడా మోదీ ప్రభుత్వం నెరవేర్చకపోవటానికి ఈర్ష్యాద్వేషాలే కారణం. బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, మెడికల్ కాలేజీలు ఇవ్వకుండా సతాయిస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీ య హోదా కల్పించటం లేదు. రాష్ట్రం నుంచి వసూలైన పన్ను ల్లో న్యాయంగా ఇవ్వాల్సిన వాటా ఇవ్వకుండా, నిధులను దారిమళ్లిస్తూ మొండిచెయ్యి చూపుతున్నది. బీజేపీ తమ రాజకీయ ప్రయోజనాల కోసం వివక్షతో అభివృద్ధి కుంటుపడేలా చేయడం సమ్మతమేనా! తెలంగాణ ప్రజానీకం ప్రశ్నించి ప్రతిఘటించాల్సిన సందర్భం ఇది.
రాజ్యాంగబద్ధంగా 1951లో ఏర్పడిన ఫైనాన్స్ కమిషన్, పన్నుల రూపంలో వచ్చిన ఆదాయాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏ విధంగా పంచాలనేది నిర్ణయించింది. అయినా పన్నుల రూపంలో వచ్చిన ఆదాయాన్ని అతితక్కువ మోతాదులో విదిలిస్తూ, అవసరమైనప్పుడు నిధులను మంజూరు చేయకుండా తాత్సారం చేస్తున్నది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి 2020-21 ఆర్థిక సంవత్సరం దాకా తెలంగాణ ప్రజలు రక్తం ధారపోసి రూ.3,65,797 కోట్లు పన్నుల రూపంలో కేంద్రానికి సమర్పించారు. కానీ, అందులో రూ.1,68,647 కోట్లు మాత్రమే రాష్ర్టానికి ఇచ్చి 54 శాతం నిధులను కేంద్రం దోచుకున్నది. వాస్తవాలు ఇలా ఉంటే.. ‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు’ అన్నట్లుగా రాష్ర్టానికి చెందిన బీజేపీ నేతలు కేంద్రం నుంచి రాష్ర్టానికి ఇప్పటివరకు రూ.3 లక్షల కోట్లు వచ్చాయని కాకి లెక్కలు చెప్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘మిషన్ భగీరథ’ పథకానికి స్వయానా నీతి ఆయోగ్ రూ.19,205 కోట్లు ఇవ్వాలని కేంద్రానికి ప్రతిపాదిస్తే, కేంద్రం పట్టించుకోకుండా చిల్లిగవ్వ ఇవ్వలేదు. కానీ మిషన్ భగీరథను కాపీ కొట్టి ‘జల్ జీవన్ మిషన్’ పేర పథకం కొత్తగా తెచ్చినట్టు కేంద్రం చెప్పుకొంటున్నది.
గతేడాది వరదలతో హైదరాబాద్ అతలాకుతలమైనప్పుడు ఆదుకోవాల్సిన కేంద్రం తమకేమీ పట్టనట్టుగా వ్యవహరించింది. నిబంధనల ప్రకా రం… విపత్తుల సమయంలో ఆర్థికంగా ఆదుకోవాడానికి ప్రాథమిక అంచనాలో 75 శాతం నిధు లు కేంద్రం సమకూర్చాలి. 15వ ఫైనాన్స్ కమిషన్ ప్రకారం… కేంద్ర, రాష్ట్ర వాటాలు కనీసం 80: 20 ఉండాలని సూచించినప్పటికీ ఎలాంటి సాయం అందించలేదు. నలుగురు సభ్యులతో కూడిన కమిటీని పంపిన కేంద్రానికి రాష్ట్రం మొత్తం వర్షాలు, వరదలతో రూ.9,400 కోట్ల నష్టం జరిగిందనీ, ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే రూ.567 కోట్ల నష్టం జరిగిందని నివేదించినా కేంద్ర ప్రభుత్వం కనీసం ఇటువైపు కూడా చూడలేదు. ఇప్పుడు హైదరాబాద్ ప్రజల ముందుకు ఏ మొఖం పెట్టుకొని కేంద్ర ప్రభుత్వ ఘనులు వస్తున్నారు? ఈ ఎనిమిదేండ్లలో తెలంగా ణకు ఏం చేశారు? ఇచ్చిన హామీలను నెరవేర్చని వారు తెలంగా ణ ప్రజల ముందుకు ఎలా వస్తున్నారు?
మానవతావాది ఎం.ఎన్.రాయ్ చెప్పినట్లు ‘రాజకీయాలు మతం కేంద్రంగా కాకుండా మనుషులు కేంద్రంగా జరిగినప్పుడు’ మాత్రమే నిజమైన దేశ అభివృద్ధి సాధ్యమవుతుంది. గుడి, మసీదు, మతం అంటూ ప్రజల దృష్టి మళ్లించే కుయుక్తులు బీజేపీ చేస్తున్నది. రాష్ర్టాల హక్కులు కాలరాయడం, సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డ రాష్టాలను అస్థిరత్వానికి గురిచేసి కూలదోయటం, ఈడీ, ఐడీ వంటి కేంద్ర సంస్థల చేత బెదిరింపులకు గురిచేసి విపక్ష నేతలను లొంగదీసుకోవటం చేస్తున్నది.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాలను గాలికివదిలేసింది. దేశానికి ఒక విజన్ అంటూ లేకుండా పాలన సాగిస్తున్నది. పర్యవసానంగా ఆకలి, ప్రజాస్వామ్యం, పత్రికాస్వేచ్ఛ వంటి ఏ సూచిలో చూసినా బంగ్లాదేశ్, పాకిస్థాన్ వంటి దేశాల కంటే హీనస్థితికి మన దేశం దిగజారింది. రూపా యి విలువను కనిష్ట స్థాయికి దిగజార్చి, జీడీపీ అత్యంత కనిష్టంగా నమోదైనా కనువిప్పు లేకుం డా వ్యవహరిస్తున్నది. ప్రభుత్వరంగ సంస్థలను వారి అనుయాయులైన ప్రైవేటు వ్యక్తులకు కారుచౌకగా అమ్మేస్తూ దేశాన్ని అంగటి సరకుగా మా రుస్తున్నది. ప్రస్తుత ఆర్థిక, రాజకీయ పరిస్థితుల నుంచి దేశాన్ని గట్టెక్కించాలంటే మోదీని గద్దె దించటమే పరిష్కారం. అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతున్న తెలంగాణను చూసి, తెలంగాణ వలె దేశాన్ని కూడా అభివృద్ధి పరచాలని తెలంగాణ సమాజం ముందు మోదీ మోకరిల్లాలి.
-ముఖేష్ సామల
97039 73946