‘అభివృద్ధి, ఆత్మ గౌరవం’ మునుగోడు ఉప ఎన్నిక వేళ రాజకీయ పార్టీలన్నీ వల్లె వేస్తున్న పదాలివి. వీటిపై లోతైన చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే, యాదున్నదా!! ఎట్లుండే మునుగోడు? ఉమ్మడి రాష్ట్రంలో అత్యంత వెనుకబాటుకు గురైన నియోజకవర్గం. నేడు… అభివృద్ధిలో పరుగులు పెడుతున్న ప్రాంతం. ఒకప్పుడు ప్రతి పల్లెలో ఫ్లోరైడ్ వ్యథలు… నేడు ప్రతి గ్రామంలో పసిడి పంటలు. ఈ అభివృద్ధికి కారణం ఎవరో ఆలోచించి ఓటేయాల్సిన బాధ్యత మునుగోడు ప్రజలది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నియోజక వర్గంలో కిలోమీటర్లు నడిచినా నేలపై ఎటూ చుక్క నీరు కనిపించేది కాదు. చౌటుప్పల్ వంటి పట్టణాల్లోనూ ఖాళీ బిందెలతో ధర్నాలు, ప్రజాప్రతినిధుల ఘెరావ్లు ఉండేవి. కూలిన కట్టలు, సర్కారు తుమ్మలు పల్లె చెరువులను పరాచక మాడేవి. సాగుకు భూమి ఉన్నా, నీరు లేక రైతులు కూలీలయ్యారు. పిల్లలను మంచి బడిలో వెయ్యాలన్నా.. ఎదిగిన ఆడబిడ్డకు పెండ్లి చెయ్యాలన్నా భయమే. పంటకు పెట్టుబడి కావాలంటే భయం… షావుకారు మిత్తి మెడకెన్నాళ్లు వేలాడుతుందోనని!! ఆఖరికి, ఇంట్లో మనిషి చచ్చినా.. బతికున్నవాడికి బాధ కన్నా భయమే ఎక్కువ. అంతిమ సంస్కారాలకు ఆరడుగుల జాగా దొరకని దైన్యమది!
కాని ఇప్పుడెట్లున్నది మునుగోడు? ఆకలిని దాటుకుని వలసలు ఆగిపోయాయి. ఆత్మాభిమానంతో పల్లెలు ఆయువు నిలుపుకొన్నాయి. పంట భూముల్లో సిరులు పండుతున్నాయి. నిమ్మల పడుతున్న రైతులు… నిలదొక్కుకుంటున్న వృత్తిదారులు… మొత్తంగా బతుకు మీద ఒక ధీమా. మునుగోడు ప్రజలు ఇప్పుడు ఇంటికి వచ్చిన మనిషికి అన్నం పెట్టలేనంత పేదరికంలో లేరు. ఇది ఎట్ల సాధ్యమైంది? చేతి నిండా పని దొరుకుతున్నది కాబట్టే. తరాల వేదనను దాటుకుని, నుదుటి రాతను తిరగ రాసుకున్నది మునుగోడు. స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేస్తున్నది.
బట్లపల్లి.. 0.5 శాతం ఉండాల్సిన ఫ్లోరైడ్ పీపీఎం 28 శాతానికి పైగా నమోదైన ఊరిది. దిక్కుకొక్కరై బక్కచిక్కిన బట్లపల్లిలో ఇన్నాళ్లకు మళ్లీ పడావు పడ్డ ఇండ్ల మధ్య నూతన నిర్మాణాలు వెలుస్తున్నయి. ప్రైమరీ స్కూల్లో బాల్యం ఆటలాడుతున్నది. బడి పక్కనే నిర్మించిన భగీరథ ట్యాంకు ఇచ్చిన భరోసా ఇది. కస్తాల చెరువు…. చండూరు మండలంలోని ఈ చెరువు ముప్పయేండ్లకు మత్తడి దుంకింది. రైతు చేనుకు చేవనిచ్చింది. చేతి నిండా చేపలిచ్చి బెస్తోళ్లకు బతుకు దెరువైంది. ఇలాంటివి ఇప్పుడు వందల గ్రామాలున్నాయి. మిషన్ కాకతీయ ఫలితమిది.
సల్కనూరు శంకర్.. చండూరు మండలం అంగడిపేటలో ఎకరం భూమి ఉన్న చిన్న రైతు. ఆయన అనారోగ్యంతో చనిపోతే రూ.3 లక్షల అప్పు ఎలా తీర్చాలో ఆయన భార్య సంతోషకు తెలియలేదు. అలాంటి పరిస్థితుల్లో కేవలం 11 రోజుల్లో రైతు బీమా ద్వారా 5 లక్షల నగదు అందింది. ఆ డబ్బుతో భర్త చేసిన అప్పు తీర్చి, మిగిలిన డబ్బును కొడుకు, బిడ్డ చదువు కోసం ఖర్చు చేస్తున్నది సంతోష. రైతు బీమా ఇచ్చిన ధీమా ఇది.
ఐదు దోనల తండాలో ఆరు నెలల కింద నొప్పులు మొదలైనప్పుడు ఓ గర్భిణి 102కు ఫోన్ చేసింది. వాహనం వచ్చి ఆమెను తీసుకుని కోఠి ప్రసూతి దవాఖానకు చేర్చింది. సహజ కాన్పులో పండంటి బిడ్డ పుట్టింది. మూడు రోజుల తర్వాత కేసీఆర్ కిట్ తోడుగా బిడ్డను తీసుకుని అదే 102 వాహనంలో క్షేమంగా ఇంటికి చేరుకున్నది. సర్కారు మాతాశిశు సంరక్షణకు నిదర్శనమిది.
గాదె ఏదమ్మ… ఊరు గుడి మల్కాపురం. భర్త అనారోగ్యంతో చనిపోతే కూలీనాలి చేసుకుంటూ అప్పు చేసి ఇద్దరు పిల్లలను చదివించింది. ఈ మధ్యే ప్రభుత్వం దళిత బంధు కింద పది లక్షల రూపాయలు ఇవ్వడంతో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ షాపు పెట్టుకున్నది. ఇప్పుడు ఏదమ్మ అప్పులు తీర్చడంతోపాటు యజమానై మరో ఇద్దరికి ఉపాధి చూపించగలుగుతున్నది. వెలివాడ బతుకుల్లో సర్కారు నింపిన వెలుగులివి.
ఇలా చెప్పుకొంటూపోతే, స్వయం సమృద్ధి దిశగా మునుగోడు నియోజకవర్గం వేసిన అడుగులు అనేకం. ఇప్పుడిక్కడ ఏ ఊరికి వెళ్లినా ఎకరం ధర రూ.50-60 లక్షలకు తక్కువ లేదు. ఇద్దరు బిడ్డలున్న రైతు చెరొక అరెకరం బిడ్డకు ఇచ్చి, ఘనంగా పెండ్లి చేసి అ త్తగారింటికి పంపిస్తున్నడు. తాతల కాలం నుం చి ఆవాసాలుగానే ఉన్న తండాలు ఇప్పుడు పంచాయతీలైనయి. రాజకీయ అవకాశాలు పెంచుకున్నయి. అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నయి. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు కొడుకులే సాదాలన్న రంది లేదు. రెండు వేల రూపాయల ఆసరా పింఛన్తో దర్జాగా, సొంతంగా బతుకుతున్నరు. గుంట జాగా లేని మనిషి జరిగిపోయినా సగౌరవంగా, సంప్రదాయబద్ధంగా అంతిమ సంస్కారాలు జరిపేందుకు వైకుంఠ ధామాలు ఉన్నాయి. కడుపు కోతలు, కార్పొరేట్ బిల్లుల కాలంలో కాబోయే తల్లికి ధైర్యం చెబుతూ సర్కారు దవాఖాన సహజ కాన్పులు చేస్తున్నది.
నేడు మునుగోడు నియోజకవర్గంలోని పల్లెల్లో నీటి యుద్ధాల్లేవు. ఇంటికే నల్లా నీళ్లు వస్తున్నయి. వీధుల్లో చెత్త కుప్పల్లేవు. వాకిలి ముందుకే చెత్త ట్రాక్టర్ వస్తున్నది. స్వచ్ఛతలో చండూరు దేశంలోనే ఉత్తమ మున్సిపాలిటీగా నిలిచింది. ఇవాళ సేద తీరేందుకు ప్రతి ఊళ్లో ప్రకృతి వనమున్నది. అన్నదాతకు వడ్డీ వ్యాపారుల వేధింపుల్లేవు. 24 గంటల కరెంటుతో తెల్లవారుజామున జరిగే రైతు మరణాలు ఆగినయి. వ్యవసాయోత్పత్తి పెరిగింది. వివిధ రంగాల్లో ఉపాధి ఊపందుకున్నది. ఫ్లోరైడ్ బాధితుల కష్టాలను గట్టెక్కించేందుకు చౌటుప్పల్కు డయాలసిస్ సెంటర్ వచ్చింది.
ఒక్కో విద్యార్థికి ఏటా రూ.1.20 లక్షలు వెచ్చించి గురుకులాల ద్వారా ప్రభుత్వం నాణ్యమైన విద్య, వసతి అందిస్తున్నది. తద్వారా మధ్య తరగతి తల్లిదండ్రులకు ఆర్థిక భారం తప్పిస్తున్నది. హరితహారంతో అటవీ శాతం – వర్షపాతం పెరిగింది. సరంపేట వాగు ఏడాది పొడువునా పారుతున్నది. చౌటుప్పల్ మండలం దండు మల్కాపురంలో 35 వేల మందికి ఉపాధి కల్పించేందుకు గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు సిద్ధమవుతున్నది. తెలంగాణ సర్కారు ఇచ్చిన రూ.150 కోట్లతో నిర్మించిన పిల్లాయిపల్లి కాల్వ చౌటుప్పల్ మండలాన్ని సస్యశ్యామలం చేస్తున్నది. చారిత్రక రాచకొండ పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంటున్నది. కల్యాణలక్ష్మి/షాదీముబారక్ ఆడపిల్ల తల్లిదండ్రులకు ఆసరైతున్నది. నేతన్నకు చేయూత, గొల్ల కురుమలకు రాయితీ గొర్రెల యూనిట్లు వంటివెన్నో పల్లెలు ఆర్థిక ముఖచిత్రాన్ని, ఆయా సామాజిక వర్గాల స్థితిగతులను మార్చినాయి. పల్లెల్లో జీవన ప్రమాణాలు పెరిగాయి. గ్రామాలు ఇప్పుడు సంపద ఉత్పత్తి కేంద్రాలుగా మారుతున్నయి. పల్లె నుంచి పుట్టుకొచ్చిన రూపాయి పట్టణాలనూ బతికిస్తున్నది. అందుకు మునుగోడుకు మించిన సాక్ష్యమేమున్నది. ఈ మార్పు స్వరాష్ట్రంలో, సీఎం కేసీఆర్ సారథ్యంలోనే సాధ్యమైందని ఇక్కడి జనం బలంగా విశ్వసిస్తున్నారు. అందుకే ఆ యోధుడి వెంట నడిచేందుకు సంసిద్ధతను వ్యక్తం చేస్తున్నారు.
మరి బాధ్యతాయుతమైన స్థానంలో ఉండీ, కేంద్ర ప్రభుత్వం చేస్తున్నదేంది? జీఎస్టీ పేరుతో చేనేత కార్మికులను, నిత్యావసరాల ధరలు పెంచి సామాన్యులను కష్ట పెడుతున్నది. పేద, మధ్యతరగతి బతుకులను అధఃపాతాళానికి తొక్కింది. ఆకలిలో దేశాన్ని అగ్ర స్థానంలో నిలిపిందీ కీర్తి గడించిన ఈ కమలనాథులే కదా! అంగ బలం, డబ్బు మదంతో ఉప ఎన్నిక తెచ్చి, మునుగోడు జనంతో ఆటలాడుతున్నదీ వీరే!! తీరా పాచికలు పారక రాష్ర్టాన్ని అస్థిర పరిచే లక్ష్యంతో ఎమ్మెల్యేల కొనుగోలుకు తెర తీసి, అడ్డంగా దొరికి తెలంగాణ సమాజం ముందు బోనులో నిలబడింది వారే. సిద్ధాంతాలతో పేరుతో రాద్ధాంతం చేసే బీజేపీ అసలు నైజమిది. ఈ విషయాలన్నీ మునుగోడు ఓటర్లు మననం చేసుకోవాలె. మంచీ చెడులు బేరీజు వేసుకుని మంచికే పట్టం కట్టాలె. క్షణ క్షణం మారే రాజకీయాన్ని యువత సరిగ్గా అర్థం చేసుకోవాలె. మేలి భవిత కోసం నియ్యత్ గల నాయకుడిని ఎన్నుకోవాలె. ఒకనాడు యావత్ తెలంగాణకు పాలన అందించిన రాచకొండ సాక్షిగా.. నేడు ఒక చారిత్రాత్మక తీర్పును భావి భారతానికి కానుకగా అందివ్వాల్సిన బాధ్యత మునుగోడుపై ఉన్నది.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
నరేందర్ మడూరి
99120 28833