ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్లో బీజేపీకి ఎదురుగాలి వీస్తున్నదా? ప్రచారం కోసం వెళ్తున్న ఆ పార్టీ నేతలను, ఎమ్మెల్యేలను,మంత్రులను ప్రజలు తరిమికొడుతున్న ఘటనలు ఏ సంకేతాలను ఇస్తున్నాయి? ఇటువంటి ఘటనలు ఇటీవల రైతు ఉద్యమానికి కేంద్రంగా నిలిచిన పశ్చిమ యూపీలోనే కాకుండా, రాష్ట్రమంతటా చోటుచేసుకోవడానికి కారణాలేమిటి?
ప్రజల నిరసనను చోటామోటా నేతలే కాదు.. ఏకంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేశవ్ప్రసాద్ మౌర్య కూడా ఎదుర్కొంటున్నారు. పశ్చిమ యూపీలోని కౌశాంబి జిల్లాలో తన సొంత ప్రాంతమైన సిరతులో ఆయన ఇటీవల ప్రజల ఛీత్కారానికి గురయ్యారు. మహిళలైతే ఏకంగా అతని ముఖం మీదనే తలుపులు వేస్తూ శాపనార్థాలు పెడుతున్నారు. మౌర్యను ఎద్దేవా చేస్తూ జనం నినాదాలు ఇచ్చారు. డిప్యూటీ సీఎంకే ఇది పరిమితం కాలేదు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా సొంతనియోజకవర్గం అమేథీలో కూడా ఇదే విధమైన వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. యూపీ మంత్రి సురేశ్ రాణా తన షమేలీ నియోజకవర్గంలో పర్యటించినప్పుడు రైతులు ఆయనను తిట్టని తిట్టు లేదు. ఎమ్మెల్యే సురేష్ పాసీ ప్రచారానికి వెళ్లినప్పుడు అడుగడుగునా నిరసనను ఎదుర్కొన్నాడు. కోపోద్రిక్తులైన జనం దాడితో ఆయన ప్రచారాన్ని మధ్యలోనే నిలిపేసుకున్నాడు. భాగ్పట్లో బీజేపీ ప్రచార పోస్టర్లను ప్రజలు చింపేశారు. మథుర బల్దేవ్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పూరన్ ప్రకాశ్ను స్థానిక ప్రజలు తరిమికొట్టారు. మీరట్లో బీజేపీ ఎన్నికల ప్రచార వాహనాలపై ప్రజలు రాళ్లతో దాడి చేశా రు. జనం నిరసనను తట్టుకోలేక ఓ ఎమ్మెల్యే వారిని తుపాకీతో బెదిరించిన ఘటన తాలూకు వీడియో వైరల్ అయ్యింది. ప్రజల ఆగ్రహానికి దడిసి బులంద్ షహార్లోని సైనా నియోజకవర్గం ఎమ్మెల్యే దేవేంద్రసింగ్ లోడి ఓ వీడియోను విడుదల చేశాడు. ‘ఇప్పటిదాకా నేను చేసిన తప్పులను క్షమించండి. మీ పాదాల వద్ద తల పెట్టి క్షమించమని వేడుకుంటున్నా. భవిష్యత్తులో ఇలాంటి తప్పులను మళ్లీ చేయనని ఒట్టేసుకుంటున్నా’ అని వేడుకున్నారు. రాష్ట్రం లో బీజేపీ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులను ఎలాంటివో దీనిద్వారా ఊహించుకోవచ్చు. రాజకీయ పరిశీలకుల అభిప్రాయం ప్రకారం.. బీజేపీ అభ్యర్థులు పార్టీ జెండా పట్టుకొని తిరగలేని పరిస్థితి ఉంది.
ఈ నేపథ్యంలో బీజేపీలో భయం అలుముకున్నది. దీంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కైరానా నియోజకవర్గ కేంద్రంలోనే ఉంటూ.. పార్టీ కార్యకర్తలకు ఇంటింటి ప్రచారం చేయాలని సూచించారు. ఈ నియోజకవర్గంలో కొన్ని హిందు కుటుంబాలు స్వస్థలాలను వదిలిపెట్టి వెళ్లిపోవటాన్ని ఎన్నికల ప్రచార అస్త్రంగా వాడాలని అమిత్ షా ప్రయత్నించినప్పటికీ సఫలం కాలేకపోయారు. బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రధాని మోదీ ఇప్పటిదాకా ఒక్క సభలో కూడా ప్రసంగించలేదు. కొవిడ్ కారణంగా రోడ్షోలు, ప్రదర్శనలు, బహిరంగ సభలను ఎన్నికలసంఘం జనవరి 31 వరకు నిషేధించింది. వర్చువల్ ప్రచారానికి అనుమతి ఉన్నప్పటికీ మోదీ ఇంకా రంగంలోకి దిగలేదు.
రైల్వే ఉద్యోగాల నియామక పరీక్షల్లో చోటుచేసుకున్న అవకతవకలపై బీహార్లో ఎగిసిన నిరసనోద్యమం యూపీ కి కూడా విస్తరించింది. రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్లో నిరుద్యోగులు ఉద్యమబాట పట్టారు. ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ పోటీ పరీక్షల్లోని అవకతవకలు, అవినీతిని నిరసిస్తూ రైళ్లను నిలిపేశారు. నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. చెల్లాచెదురైన యువత స్థానిక హోటళ్లు, లాడ్జిల్లో దాక్కుంటే పోలీసులు దాడిచేసి, తలుపులు పగులగొట్టి మరీ యువకులను బయటకు ఈడ్చుకొచ్చి చితకబాదారు. ప్రతిపక్ష పార్టీలు నిరుద్యోగ యువతకు మద్దతుగా నిలువటంతో.. రైల్వేమంత్రి ఎన్టీపీసీ, ఆర్ఆర్బీ పరీక్షలను తిరిగి నిర్వహిస్తామని చెప్పాల్సి వచ్చింది. అయితే, ఈ హామీ యువత ఆగ్రహాన్ని ఏ మేరకు చల్లార్చుతుందో చూడాలి.
ఏదేమైనా.. యూపీలో బీజేపీకి ముఖం చెల్లని పరిస్థితి వచ్చిందన్నది తేటతెల్లం
అవుతున్నది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఓటర్లలో మత ప్రాతిపదికన విభజన తేవటానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియోలు వెల్లడిస్తున్న దాని ప్రకారం.. యూపీ వ్యాప్తంగా అభివృద్ధి లేమిపై, నిరుద్యోగంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తాము చెల్లించిన పన్నులతో కూడిన ప్రభుత్వ ఆదాయాన్ని యోగి తన ప్రచారం కోసం దుర్వినియోగం చేశాడని జనం భావిస్తున్నారు.
యోగి సర్కార్ రాష్ట్రంలో ఐదేండ్లలో 2.64 కోట్ల ఉద్యోగాలు కల్పించిందని మంత్రి సిద్ధార్థనాథ్ సింగ్ చేసిన ప్రకటనను చూసి జనం నవ్వుతున్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఈ ఏడేండ్లలో సృష్టించామని చెప్పుకొంటున్న రెండు కోట్ల ఉద్యోగాలకన్నా ఇది ఎక్కువ కదా అని ఎద్దేవా చేస్తున్నారు. కేంద్ర ఆర్థికశాఖ మాజీ ముఖ్య సలహాదారు కౌశిక్బసు చేసిన ట్వీట్ నిజాలను వెల్లడిస్తున్నది. ‘యూపీలో 2016-2021 మధ్య పని చేయగల యువత జనాభా 14.69 కోట్ల నుంచి 16.92 కోట్లకు పెరిగింది. కానీ.. ఉద్యోగాలున్న వారి సంఖ్య 5.64 కోట్ల నుంచి 5.58 కోట్లకు తగ్గింది. ఈ ఉద్యోగాల కోత అనేది కరోనా రాకముందే జరిగింది. ప్రజల సంక్షేమం కన్నా బడాయి పనుల మీద రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ దృష్టిపెట్టడం వల్లే ఇది జరిగింది’ అని బసు తెలిపారు.
నిరుద్యోగం, పెరిగిన ధరలు, కరోనా సంక్షోభంలో ప్రభుత్వం ఆదుకోకపోవటం, పంటలకు ధరలు లేక చెరకు తదితర పంటల రైతులు నష్టాల పాలవటం, రైతు ఉద్యమంపై కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు సాగించిన అణచివేత.. ఇలాంటి పలు కారణాలతో ప్రజలు కుల మతాలకు అతీతంగా ఏకమయ్యారు. దాని ఫలితమే నేడు యూపీలో బీజేపీకి ఎదురవుతున్న అవమానాలు.