ఏదైనా ఒక రాష్ట్రం చేసే అప్పును ఔట్స్టాండింగ్ లయబిలిటీ అనీ, ఆ రాష్ట్రం ఇచ్చే సార్వభౌమ హామీని ఔట్స్టాండింగ్ గ్యారంటీ అనీ అంటారు. కేంద్ర ప్రభుత్వానికి అప్పు చేసే అధికారాన్ని రాజ్యాంగంలోని ఆర్టికల్ 292 ఇచ్చింది. రాష్ర్టాలు అప్పు చేసే విధానాన్ని ఆర్టికల్ 293 తెలుపుతుంది. దీనికి మూలం ‘భారత ప్రభుత్వ చట్టం 1935’లోని సెక్షన్ 163. అంటే అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు అప్పు చేసే స్వేచ్ఛను తన అధీనంలో పెట్టుకోవడానికి సెక్షన్ 163లో 3వ క్లాజును చేర్చింది. ఆ 1935 నాటి చట్టంలోని 3వ క్లాజునే ఆర్టికల్ 293 క్లాజు 3&4 గా మార్చి భారత రాజ్యాంగంలో చేర్చారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 293 రాష్ర్టాల అప్పుల గురించి వివరించింది. దీని ప్రకారం-
1. రాష్ట్రం తన కార్యనిర్వాహక అధికారం ప్రకారం దేశ భూభాగం పరిధిలో రాష్ట్ర సంచిత నిధి హామీకి అనుగుణంగా అప్పులు చేయవచ్చు. అయితే కాలానుగుణంగా రాష్ట్ర శాసన సభ నిర్దేశించే పరిమితులకు లోబడి ఈ అప్పులు ఉండాలి. ఈ పరిమితులలో అప్పులకు రాష్ట్ర శాసనసభ హామీలు ఇవ్వవచ్చు.
2. పార్లమెంటు చేసిన చట్టాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాలకు అప్పులు ఇవ్వవచ్చు. అయితే 292 అధికరణం ప్రకారం నిర్దేశించిన పరిమితులు దాటకూడదు. రాష్ర్టాలు చేసే అప్పులకు కూడా కేంద్రం హామీలు ఇవ్వవచ్చు. ఇందుకు అవసరమైన నిధుల భారం భారత సంచిత నిధిపై పడుతుంది.
3. ప్రస్తుత లేదా మునుపటి కేంద్ర ప్రభుత్వం అందించిన లేదా హామీ ఇచ్చిన అప్పు మిగులు ఇంకా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రప్రభుత్వ అనుమతి లేకుండా అప్పు తీసుకోకూడదు.
4. షరతులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వవచ్చు.
రాజ్యాంగ సభలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 292, 293ల మీద చర్చ జరిగిన సందర్భంగా రాష్ర్టాలు అప్పులు తీసుకునే అంశానికి సంబంధించిన ఆర్టికల్ 293లోని సబ్ సెక్షన్ 4ను తీసివేయ్యాలని అనంతస్వామి అయ్యంగార్ గట్టిగా పట్టు బట్టారు. బ్రిటిష్ పాలన అంతమై, భారత ప్రభుత్వం ఏర్పడినందున ఆర్టికల్ 293 లోని సబ్ సెక్షన్ 4 అవసరం తీరిపోయిందనే అభిప్రాయం ఆయన వ్యక్తం చేశారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఆర్థికశాస్త్రం అభ్యసించిన కె.టి. షా, బి.ఆర్.అంబేద్కర్ కూడా అప్పు తీసుకోవడం కార్యనిర్వాహక చట్టం కిందకు వస్తుందని, ఈ చట్టం ఎలాంటి ఆంక్షలు లేని విధంగా ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఆర్థిక విషయాలను, కేంద్ర-రాష్ట్ర ఆర్థిక సంబంధాలను అధ్యయనం చేసి తగు సూచనలను ఇవ్వాలంటూ నిపుణుల కమిటీని రాజ్యాంగ సభ నియమించింది. ఆ కమిటీ తన నివేదికలో రాష్ర్టాలకు ఓపెన్ మార్కెట్ నుంచి నేరుగా కేంద్రం అనుమతితో సంబంధం లేకుండా అప్పు తీసుకునే అధికారం ఉండాలని, రాష్ర్టాల ఆర్థిక స్థితిగతులను అనుసరించి మార్కెట్ క్రెడిట్ రేటింగ్స్ లభిస్తాయని, తద్వారా రాష్ర్టాలకు ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ వస్తుందని తమ నివేదికలో రాజ్యాంగ సభకు తెలియచేసింది.
కానీ, ఆర్థిక నిపుణుల అభిప్రాయాలను పట్టించుకోకుండా రాజ్యాంగ సభ కేంద్రం పూచీకత్తు మీద మాత్రమే రాష్ర్టాలు అప్పు తీసుకునే పరిస్థితి కల్పించింది. ఇప్పటి ఎఫ్ఆర్బీఎం పరిధిలోని రుణాల అనుమతులను ఆర్టికల్ 293, సెక్షన్ 2,3,4 ను అనుసరించి కేంద్రానికి అప్పగించింది. 2003 ఎఫ్ఆర్బీఎం చట్టాన్ని అనుసరించి కేంద్రం తనపైన మాత్రమే కాకుండా రాష్ర్టాలకు కూడా రుణ పరిమితి విధించింది. 2018 ఏప్రిల్ నుంచి ఎఫ్ఆర్బీఎం చట్టంలో మార్పులు చేసింది. కరోనా సందర్భంగా ఆర్థికమాంద్యాన్ని ఎదుర్కోవడానికి రాష్ర్టాల రుణ పరిమితిని పెంచినట్టే పెంచి, మళ్ళీ అందులో కొంత శాతానికి కేంద్రం షరతులు పెట్టడం అంబేద్కర్ స్ఫూర్తికి విరుద్ధం.
రిజర్వుబ్యాంకు ఇటీవల ప్రకటించిన లెక్కల ప్రకారం 2022 మార్చి నాటికి తెలంగాణ జీఎస్డీపీలో ఔట్స్టాండింగ్ లయబిలిటీ 27.4 శాతం ఉంది. కాగా పంజాబ్ 53.5 శాతం, కేరళ 38.3 శాతం, పశ్చిమ బెంగాల్ 38.8 శాతం, ఆంధ్రప్రదేశ్ 37.6 శాతం, హర్యానా 35.3 శాతం, యూపీ 34.2 శాతం, బీహార్ 34 శాతం, అస్సాం 31.9 శాతం కలిగి ఉన్నాయి. రెండు మూడు తప్ప అన్ని రాష్ర్టాలూ తెలంగాణ ఔట్స్టాండింగ్ లయబిలిటీ కంటే ఎక్కువగా అప్పులు కలిగి ఉన్నాయి. అయినప్పటికీ కేంద్రం వివక్ష చూపుతున్నది. ఎఫ్ఆర్బీఎం పరిధిలో తెలంగాణ రాష్ట్రం అప్పులను కావాలనే కేంద్రం ఆలస్యం చేస్తున్నది. దీనిని తెలంగాణపై కేంద్రం సాగిస్తున్న ఆర్థిక యుద్ధంగా భావించవలసి ఉంటుంది.
తెలంగాణ ప్రభుత్వం వివిధ సంస్థలకు ఇచ్చే ఔట్స్టాండింగ్ గ్యారెంటీ పరిధిని నిర్ణయించే అధికారం ఆర్టికల్ 293, సబ్ క్లాజ్ 1ని అనుసరించి రాష్ట్ర అసెంబ్లీకి మాత్రమే ఉంటుంది. కేంద్రానికి ఈ విషయంలో ఎలాంటి అధికారం లేదు. గత ఏడాది రాష్ర్టానికి వచ్చిన రెవెన్యూ రాబడుల్లో 200 శాతం వరకు ఈ పరిధి ఉండవచ్చు అని తెలంగాణ అసెంబ్లీ నిర్ణయించింది. 2020-21 కరోనా సంవత్సరంలో కూడా తెలంగాణ రెవెన్యూ రాబడి రూ.1,00,973 కోట్లు, 2021-22 లో సవరించిన అంచనాల ప్రకారం రూ.1,56,177 కోట్లు. అంటే తెలంగాణ రాష్ట్రప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్ 293, సబ్ క్లాజ్ 1ని అనుసరించి 2 లక్షల కోట్ల నుంచి 3.2 లక్షల కోట్ల వరకు వివిధ సంస్థలకు గ్యారెంటీగా ఉండవచ్చు. 2022 మార్చి నాటికి తెలంగాణ ప్రభుత్వం రూ.1,31,511 కోట్లు అంటే జీఎస్డీపీలో సుమారు 11.5% మాత్రమే వివిధ సంస్థలకు గ్యారంటీగా ఉంది.
రాబడి లేని సంస్థలను సృష్టించి, తెలంగాణ ప్రభుత్వం అప్పు తీసుకుంటున్నదని, ఇది తప్పని, దీనిద్వారా తెలంగాణ రాష్ర్టాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నారనే అబద్ధపు
ప్రచారాన్ని బీజేపీ, కాంగ్రెస్తో పాటు పలు ఇతర పార్టీలు, వ్యక్తులు, మీడియా సంస్థలు చేస్తున్నాయి.
కానీ, వాస్తవం ఏమిటంటే..
‘RBI report on technical committee of State garuntees 1999’ నిర్దేశానుసారం రాష్ర్టాలు ఈ క్రింది వాటికి హామీదారుగా ఉండవచ్చు:
1. రాష్ట్ర పబ్లిక్ రంగ సంస్థలు, సహకార వ్యాపార సంస్థలు
2. బలహీనవర్గాల గృహనిర్మాణ సంస్థ, గృహ నిర్మాణ బోర్డులు, రవాణా కార్పొరేషన్లు, సామాజిక-ఆర్థిక మౌలిక సదుపాయాల మెరుగుదల, నగర, గ్రామీణాభివృద్ధి వంటి వాణిజ్యేతర కార్యకలాపాలు
3. రాష్ట్ర విద్యుత్ బోర్డులు
4. వాటర్ బోర్డు, మురికి నీటి నిర్వహణ బోర్డు, నీటిపారుదల కార్పొరేషన్, రోడ్డు రవాణా, గృహనిర్మాణం వంటి ప్రజావసరాల కోసం, ఇతర అభివృద్ధి సంస్థల కోసం ఏర్పాటు చేసే స్పెషల్ పర్పస్ వెహికిల్స్
అంటే మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరం ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టులకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఔట్స్టాండింగ్ గ్యారంటీలు రిజర్వుబ్యాంక్ సూచించిన నిబంధనల మేరకు ఉన్నాయని అర్థం. రేపు దళితబంధుతోపాటు ఇంకే ప్రజా ప్రయోజనాల కొరకు అప్పు తీసుకున్నా కూడా రాజ్యాంగబద్ధమేనని, రిజర్వుబ్యాంక్ నియమాలను అనుసరించేనని తేటతెల్లం అవుతున్నది.
1994 నాటి ఎస్ఆర్ బొమ్మై- కేంద్రప్రభుత్వం కేసులో, 2011 నాటి నాగరాజన్- కేంద్రప్రభుత్వం కేసులో, 2018 నాటి నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ప్రభుత్వం- కేంద్రప్రభుత్వం మధ్య సాగిన కేసులో, కేంద్రప్రభుత్వం-కులదీప్ నయ్యర్ కేసులో వచ్చిన తీర్పులు ఈ సందర్భంగా గమనార్హమైనవి. సమాఖ్యతత్వం భారత రాజ్యాంగ ప్రాథమిక స్వరూపమని, 293 అధికరణం 4వ క్లాజును అనుసరించి విధించే ఏ షరతులైనా రాజ్యాంగ సమాఖ్య స్వరూపానికి భంగకరం కాకూడదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది.
అంటే ఎఫ్ఆర్బీఎం పరిధిలోని అప్పును తెలంగాణ తీసుకోకుండా కేంద్రం జాప్యం చేయడం, ఆంక్షలు విధించడం ఎఫ్ఆర్బీఎం చట్టాలకే కాక, రాజ్యాంగానికి, సుప్రీంకోర్టు తీర్పులకు కూడా విరుద్ధం. ఏవో చిన్న సాకులు పెట్టుకొని రాష్ర్టానికి రుణాలను నిలిపివేయడం లేదా ఆలస్యం చేయడాన్ని తెలంగాణపై కేంద్రం సాగిస్తున్న ఆర్థికయుద్ధంగా చూడవలసి ఉంటుంది. పరిగెడుతున్న ఇంజిన్కు ఒక ట్రబుల్ ఇంజిన్ అడ్డు తగిలింది అని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు.
రాష్ర్టాల నికర రుణసేకరణపై 15వ ఫైనాన్స్ కమిషన్ పరిమితి విధించిందనే అబద్ధపు ప్రచారం జరుగుతున్నది. 15వ ఆర్థికసంఘం ఈ విషయాలను అధ్యయనం చేయడానికి ఒక కమిటీ నియమించాలని మాత్రమే సిఫారసు చేసింది. ఈ సిఫారసులను కేం ద్రం అమోదించింది. కానీ, కమిటీని మాత్రం నియమించలేదు. 14వ, 15వ ఆర్థికసంఘం సెస్ను డివిజబుల్ పూల్లో పెట్టాలని సిఫారసు చేశాయి. అయి నా కేంద్రం అంగీకరించకపోవడం ద్వంద్వనీతిని తెలియచేస్తున్నది.
ఇక కేంద్ర ప్రభుత్వం ఎక్స్ట్రా బడ్జెటరీ రిసోర్సెస్ (ఈబీఆర్) ద్వారా 2016-17లో 79,167 కోట్లు, 2017-18లో 88,095 కోట్లు, 2018-19లో 1,62,602 కోట్లు, 2019-20లో 1,48,316 కోట్లు, 2020-21లో 1,21,301 కోట్లు, 2021-22లో ఇప్పటివరకూ 30,000 కోట్లు సమకూర్చుకున్నట్లు కేంద్రబడ్జెట్ ఎక్స్పెండిచర్ ప్రొఫైల్ 2022-23, స్టేట్మెంట్ 27లో తెలియజేశారు. కేంద్రం ఔట్స్టాండింగ్ లయబిలిటీలు మాత్రమే (ఔట్స్టాండింగ్ హామీలు కాదు) 2022 మార్చి నాటికి జీడీపీలో దాదాపు 60 శాతం ఉన్నాయి. రెవెన్యూ రాబడిలో వడ్డీ చెల్లింపుల శాతం 40 శాతం వరకు ఉన్నది.
ఇక తెలంగాణ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. ఔట్స్టాండింగ్ లయబిలిటీ (27.4 శాతం)తోపాటు ఔట్స్టాండింగ్ హామీ (11.5 శాతం)లు కలిపి చూస్తే 2022 మార్చి నాటికి 38.9 శాతం మాత్రమే ఉన్నది. ఇక తెలంగాణ ప్రభుత్వ రెవెన్యూ రాబడిలో వడ్డీ చెల్లింపులు దాదాపు పది శాతమే. అంటే తెలంగాణ ఆర్థిక పరిస్థితి భారత దేశ స్థూల ఆర్థిక పరిస్థితితో పోలిస్తే ఎంతో మెరుగ్గా ఉందని తెలిసిపోతుంది. అయినప్పటికీ తెలంగాణ ఎఫ్ఆర్బీఎం అప్పునకు కేంద్రం అడ్డు తగలడం రాజకీయ దురుద్దేశమే.
-పెండ్యాల మంగళాదేవి