హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ) : శాతవాహన యూనివర్సిటీలో ఈ విద్యాసంవత్సరం ఆరు కొత్త కోర్సులు ప్రవేశపెట్టినట్టు యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఉమేశ్కుమార్ తెలిపారు. శనివారం హైదరాబాద్లో తనను కలిసిన విలేకరులతో ముచ్చటించిన ఆయన 2026-27 విద్యాసంవత్సరంలో కొత్త పీజీలో ఆరు కోర్సులు ప్రవేశపెట్టామని వెల్లడించారు. ఎమ్మెస్సీ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్, ఎమ్మెస్సీ ఫొరెన్సిక్ సైన్స్, ఎంఎస్డబ్ల్యూ, ఎంఏ జర్నలిజం, ఎంబీఏ టూరిజం మేనేజ్మెంట్, ఎంకాం ఫైనాన్షియల్ అకౌంటింగ్ కోర్సులు ప్రవేశపెట్టామని పేర్కొన్నారు.
ఎంబీఏలో ఐసెట్, మిగతా కోర్సుల్లో సీపీగెట్ ద్వారా సీట్లు భర్తీచేస్తామని తెలిపారు. వచ్చే విద్యాసంవత్సరంలో ఎంపీఈడీ కోర్సు ప్రవేశపెట్టబోతున్నామని పేర్కొన్నారు. ఖేలో ఇండియా స్కీమ్లో భాగంగా రూ. 14 కోట్లకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించామని తెలిపారు. అమ్మాయిలు, అబ్బాయిల కోసం వర్సిటీలో ప్రత్యేకంగా హాస్టళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు.