కందుకూరు: ఫోర్త్ సిటీకి భూములు ఇచ్చే ప్రసక్తే లేదని ముచ్చర్ల గ్రామ రైతులు స్పష్టం చేశారు. కనీసం తమకు సమాచారం లేకుండా నోటిఫికేషన్ ఎలా విడుదల చేస్తారని మండిపడ్డారు. ఈ విషయంలో గ్రామ సభలో తీర్మానం చేయవద్దని సర్పంచ్ ఊటు పద్మ మహేందర్ను కోరారు. ఈ మేరకు శనివారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆమెకు వినతిపత్రం అందజేసి.. గోడును వెల్లబోసుకున్నారు. పట్టా భూములు ఇచ్చేది లేదని తీర్మానాలను చేసి ప్రభుత్వానికి పంపుతామని చెప్పారు.
కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తేరెటి లక్ష్మణ్ ముదిరాజ్, మాజీ ఎంపీటీసీ మల్లేశ్, ఉప సర్పంచ్ తేరెటి రవి,మాజీ ఉప సర్పంచ్ రవీందర్, వార్డు సభ్యులు రమేశ్, వెంకటేశ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. కాగా, ప్రభుత్వం రైతుల పట్ల వివక్ష చూపుతున్నదని బీఆర్ఎస్ నాయకులు సురుసాని సురేందర్రెడ్డి, గంగాపురం లక్ష్మీనర్సింహారెడ్డి, మండల బీఆర్ఎస్ పార్టీ అద్యక్షుడు మాజీ సర్పంచ్ మన్నే జయేందర్ ముదిరాజ్ చెప్పారు. ముచ్చర్ల రైతుల పట్టా భూములను ప్రభుత్వం బలవంతంగా తీసుకుంటున్నదన్నారు.