‘వ్యవసాయం’ గురించి మాట్లాడాలంటే తెలంగాణ ఏర్పాటుకు ముందు, ఆ తర్వాత అని చెప్పుకోవాలి. ఏర్పాటుకు ముందు ఎవుసం చేయాలంటే రైతుకు అప్పుల తిప్పలు,
ఆత్మహత్యలు, కరెంటు కష్టాలు, కన్నీటి గోస ఒకటా, రెండా వ్యవసాయమే ఒక సమస్యల వలయం. బాధ తెలిసినవారికే బాధ్యత ఉంటుంది. అనుభవించిన వారికే ఆలోచన ఉంటుంది. గత పాలకులందరూ వ్యవసాయరంగం పట్ల కంటితుడుపు చర్యలు చేపట్టారే తప్ప, రైతుల శ్రేయస్సును పట్టించుకున్నపాపాన పోలేదు.
ఉమ్మడి రాష్ట్ర పాలనలో రైతుకు దన్నుగా నిలవాల్సిన నాయకులే ‘వ్యవసాయం దండగ’న్నారు. నేడు మన తెలంగాణ కేసీఆర్ పాలనలో ‘వ్యవసాయం పండగ’లా మారింది. దేశంలో వ్యవసాయాన్ని ఒక ఆర్థిక సంస్కరణగా ఏ పాలకుడూ గుర్తించలేదు. కేసీఆర్ మాత్రమే గుర్తించారు. అందుకే విస్మరించబడిన వ్యవసాయం దేశంలో నేడు మూల బిందువైంది. అనాథలా ఉన్న రైతు అందరికీ చర్చనీయాంశమయ్యాడు. రైతుల గురించి, వ్యవసాయం గురించి దేశంలోని ప్రతి నేత మాట్లాడాల్సిన పరిస్థితిని కేసీఆర్ తీసుకువచ్చారు. ఇప్పుడు వ్యవసాయాన్ని అందరూ గుర్తిస్తున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ అనుకూల విధానాలతో తెలంగాణ పల్లెలు నేడు ఆర్థిక పరిపుష్టి సాధించాయి. దీంతో అనేక వృత్తులు, రైతు చుట్టూ అల్లుకున్న వివిధ రంగాలు సంతోషంగా ఉన్నాయి. స్వయానా సీఎం కేసీఆర్ రైతు కావడం వల్ల తెలంగాణ రైతుల కరెంటు కష్టాలు మొదలుకొని.. పెట్టుబడి, సాగు నీరు, గిట్టుబాటు ధరల గురించి ఆలోచించాడు. రైతు ఇంతకుముందు పెట్టుబడి కోసం ఇబ్బందులు పడేవాడు. ఈ 70 ఏండ్ల స్వతంత్ర భారతావనిలో రైతులకు పెట్టుబడి సాయం చేయాలని ఏ ముఖ్యమంత్రి ఆలోచించలేదు. ఏ ప్రధానమంత్రి మనసుకూ తట్టలేదు. కానీ మన ముఖ్యమం త్రి కేసీఆర్ రైతుల పెట్టుబడి కోసం ‘రైతుబంధు’ పథకం తెచ్చి ఎకరానికి ఏడాదికి రూ.10 వేల చొప్పున అందించి రైతన్నకు రైతు బాంధవుడయ్యారు. రైతు చనిపోతే వాళ్ల కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయి ఇబ్బంది పడేవారు. అలాంటి కుటుంబాలకు అండగా ఉండటానికి ‘రైతుబీమా’ పథకంతో రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందేలా చేసిండు కేసీఆర్. ప్రపంచానికి అన్నం పెట్టే వ్యవసాయానికి పెట్టుబడి సాయం అందిస్తున్న మనసున్న మనిషి ముఖ్యమంత్రి కేసీఆర్.
తెలంగాణలో ‘రైతుబంధు’ పథకం కింద ఈ యాసంగి ఎనిమిదో విడతతో కలిపి రూ.50,680 కోట్లు రైతుల ఖాతాల్లో జమ కావడం దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన అంశం. పథకం మొదలైన దగ్గరినుంచి అన్నదాతకు వానకాలం, యాసంగి పంటకు ఆర్థిక సహాయం అందుతూనే ఉన్నది. రైతుకు పెట్టుబడి సాయం అందించడమే కాకుండా 24 గంటల ఉచిత కరెంటు, రైతుబీమా, అందుబాటులో ఎరువులు, విత్తనాలు ఉంచడంతో పాటు ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక క్లస్టర్ ఏర్పాటుచేశారు. అలాగే 2,601 రైతు వేదికలు నిర్మించి ఎప్పటికప్పుడు రైతులకు పంటల సాగులో సలహాలు, సూచనలు ఇప్పిస్తూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. సమాజంలో అనేక వృత్తి సంఘాలున్నాయి. కానీ ఏ సంఘమూ లేనిది, సంఘటితం కానిది రైతన్నలే. అందుకే రైతులు సంఘటితం కావాలి. రైతులంతా ఒక దగ్గర కలుసుకొని చర్చించుకోవడం కోసం క్లస్టర్లవారీగా రైతు వేదికలను నిర్మించారు.
‘పల్లే పల్లెన పల్లేర్లు మొలిచే తెలంగాణలోనా’ పాటను మరిపిస్తూ నేడు ప్రతి పల్లె చెరువులు నిండి అలుగులు దుంకుతున్నది. తెలంగాణలో ప్రతి పల్లె, ప్రతి ఎకరం పంట పొలాలతో ఆకుపచ్చగా అవతరించింది. దీనికి కారణం కేసీఆర్ ఆలోచనలు, ఆచరణలు. మిషన్ కాకతీయతో46 వేల పైచిలుకు చెరువులు పునరుద్ధరించటం, పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయటం, కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని మూడేండ్లలో పూర్తిచేయటం ఒక్క కేసీఆర్కు మాత్రమే సాధ్యమైంది.
స్వయంగా నేను ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను. ఒక రైతుగా అనేక కష్టాలను చూసినవాణ్ని. నష్టాలను భరించలేక వ్యవసాయానికి దూరమయ్యాం. ముఖ్యమంత్రి కేసీఆర్ స్ఫూర్తితో ఇప్పుడు తిరిగి వ్యవసాయం వైపు మళ్లాం. మా సొంత గ్రామమైన కూచన్పల్లిలో కుర్మా దుర్గయ్య అనే రైతు పంట పెట్టుబడికి అప్పు తెచ్చి నాటు వేస్తే కరెంటు లేక పంట ఎండిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. నేడు కేసీఆర్ పాలనలో 24 గంటల కరెంటు, పెట్టుబడికి రైతుబంధు పథకం, రైతు బీమా తో రైతు భరోసాగా వ్యవసాయం చేస్తున్నాడు. మా ఊరిలో రైతు వేదిక, మంజీరాపై చెక్డ్యాం నిర్మాణంతో మా ఊరు సస్యశ్యామలమైంది. ఇలా.. మా ఊరే కాదు, నేడు మంజీరాకు కాళేశ్వరం నీళ్లు అనుసంధానం కావడంతో మెతుకుసీమ మొత్తం ఆకుపచ్చ మాగాణి అయింది. ఇలా బంగారు తెలంగాణగా రూపుదిద్దుకుంటున్నది. ఇప్పుడే రైతును చూసినా సంతోషంగా కనపడుతున్నడు. అప్పట్లో రైతు చనిపోతే పట్టించుకునేవాళ్ళు ఉండేవారు కాదు. నేను స్వయంగా ప్రమాదవశాత్తు మరణించిన రైతుల కుటుంబాలకు 5 లక్షల ‘బీమా’ను అందించిన సందర్భంలో వాళ్లు కేసీఆర్కు తెలిపిన కృతజ్ఞత చాలా గొప్పది. తమ కుటుంబానికి కేసీఆర్ పెద్దదిక్కు అని, అండగా నిలిచిన ‘సార్ రుణమెట్లా తీర్చుకోవాలో’ అని అనడం వారికున్న కృతజ్ఞతను తెలిపింది.
రైతులకు మిత్తి బాధలు తప్పినయి. రైతుబంధు పైసలతో ఎరువులు, విత్తనాలు కొంటున్నారు. ఎరువుల కోసం పోలీస్స్టేషన్లలో ఎదురుచూసే పరిస్థితి నుంచి ఎరువులు సకాలంలో అందించి, ఎరువుల కోసం ఎకరాకు పదివేలు ఇస్తున్న ప్రభుత్వాన్ని చూస్తుంటే.. కేసీఆర్ తెలంగాణ రాష్ర్టానికి ముఖ్యమంత్రి కావడం మన అదృష్టం. ఇలా… ప్రతి సమస్య పరిష్కారానికి కేసీఆర్ ఆలోచనలు, కృషి, పట్టుదల రైతుల పట్ల చిత్తశుద్ధి ఎంతో గొప్పది. రైతులకు ఏదో చేయాలన్న తపన నేటిది కాదు. ఉద్యమకాలం నుంచి తెలంగాణలోని ప్రతి పల్లె తిరిగి, పల్లె నిద్ర చేసి, అణువణువు చూసి ఎక్కడేం చేయాలో నిర్ణయించుకున్నరు. తానే ఒక ఇంజినీర్ అవతారమెత్తి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తెలంగాణలో కరువును పారదోలారు. కృతజ్ఞత మరవని రైతులు తమకు పెట్టుబడి ఇచ్చి నిలబెట్టిన కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు చేయడం, ముగ్గులు వేసి, హారతి పట్టడం వారి అభిమానానికి తార్కాణం.
సాగునీటి కోసం మొగులుకు ఎదురుచూసే దుస్థితి ఉండకూడదని కలలు గన్న కేసీఆర్ హరితహారం చేపట్టి, అడవులను అభివృద్ధి పరచి వానలు సకాలంలో కురిసేట్లు చేశారు. గత ఏడేండ్లలో హరితహారం మూలంగా 3.7 శాతం అడవులు అభివృద్ధి చెందాయి. దాని సత్ఫలితాలు ఇప్పుడిప్పుడే అందుతున్నాయి. ప్రకృతితో మమేకమై పాలనను నడిపిస్తున్న మహానేత మన కేసీఆర్.
(వ్యాసకర్త: శేరి సుభాష్రెడ్డి, 99639 94848, శాసనమండలి సభ్యులు)