ఈశాన్య ప్రాంతంలోని త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ర్టాలలో ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ ఏడాది జరిగే తొమ్మిది రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది లోక్సభ సమరానికి సెమీ ఫైనల్స్గా భావిస్తున్న తరుణంలో ఈ మూడు చిన్న రాష్ర్టాల్లో పోరుకు కూడా ప్రాధాన్యం సంతరించుకున్నది. మే నెలలో కర్ణాటక, నవంబర్ నెలలో ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మిజోరం రాష్ర్టాలలో ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణ, రాజస్థాన్, జమ్మూ కశ్మీర్ రాష్ర్టాల ఎన్నికలు డిసెంబర్లో ఉన్నాయి. బీజేపీ ఇటీవలి సంస్థాగత సమావేశంలో మొత్తం తొమ్మిది రాష్ర్టాల్లోనూ పాగా వేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. మరోవైపు బీజేపీకి దీటుగా కాంగ్రెస్ నిలువలేకపోతుండటంతో కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ఏర్పాటై, జాతీయ అజెండాతో ముందుకు పోతున్నది. బీజేపీని గద్దె దించాలని కేసీఆర్ పట్టుదలగా ఉన్నారు. దీంతో లోక్సభ ఎన్నికలకు ముందే వేడి రగులుతున్నది.
ప్రధాని మోదీ పాలనా విధానాల మూలంగా బీజేపీకి ఎదురుగాలి వీస్తున్నదని ఆ పార్టీ నాయకత్వం కూడా గ్రహించింది. దీంతో బీజేపీయేతర పార్టీల ఆధీనంలోని రాష్ర్టాలపై దృష్టిసారించాలని ప్రయత్నిస్తున్నది. కొన్ని రాష్ర్టాలలో బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్నప్పటికీ, కేంద్రంలోని మోదీ విధానాల ప్రభావం దేశమంతటా ఉంటుంది. అందువల్ల బీజేపీ నాయకత్వం తమకు సంప్రదాయంగా కంచుకోటలైన రాష్ర్టాలను వదిలి ఇతర ప్రాంతాలపై ఆశలు పెట్టుకోవడం వల్ల ఫలితం ఉండకపోవచ్చు. అయితే బీజేపీ సాగిస్తున్న అధర్మ యుద్ధమే ఇతర రాజకీయపక్షాల వారికి ఆందోళన కలిగిస్తున్నది. కేంద్ర దర్యాప్తు సంస్థలతో ఇతర రాజకీయపక్షాల నాయకులను వేధించడం, ధనబలంతో అబద్ధాల ప్రచారం సాగించడం, తమ పార్టీ విభాగాలను హింసాయుత చర్యలకు, దుర్భాషలకు దిగేవిధంగా రెచ్చగొట్టడం, ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోయడం మొదలైన కుట్రలతో బీజేపీ ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేస్తున్నది.
ఈశాన్య రాష్ర్టాలలో బీజేపీ కుట్రలు దీర్ఘకాలంలో దేశ సమగ్రతకే ప్రమాదం కలిగించవచ్చు. ఈశాన్యంలోని భిన్నజాతులు తమ అస్తిత్వ పరిరక్షణకు ఉద్యమిస్తున్న కాలంలో సాయుధ పోరాటాలు కూడా సాగాయి. వీటిని విదేశాలు కూడా ఎగదోశాయి. వెంటనే అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతాలను రాష్ర్టాలుగా మార్చి వారి స్వపరిపాలనా కాంక్షను తీర్చింది. క్రమంగా వారు జాతీయ స్రవంతిలో భాగమయ్యారు. కానీ బీజేపీ ప్రాంతీయ పక్షాలను నయానా భయానా లోబరచుకోవడం వల్ల స్థానిక జాతులలో అసంతృప్తి రగులుతున్నది. తెలంగాణతో సహా ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాష్ర్టాలలోని ప్రజలు బీజేపీ కుట్రలను తిప్పికొట్టకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థకు, దేశ సమగ్రతకు ముప్పు ఏర్పడవచ్చు. కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ జాతీయ రాజకీయాలలో ప్రవేశించి బీజేపీ ఆగడాలకు అడ్డుకట్ట వేయడం దేశ శ్రేయస్సు దృష్ట్యా అభిలషణీయం.