నా చిన్నప్పుడు.. ‘పోచంపాడు కాలువ రావాలి’, ‘ఫ్లోరైడ్ లేని నల్లగొండ చూడాలి..’ లాంటి నినాదాలు నాన్న తన స్నేహితులతో కలిసి ఊరి గోడల మీద రాసేవాడు. హైస్కూల్ చదువు కోసం మొదటిసారి సూర్యాపేటకు వెళ్లాను. అక్కడ కూడా… ‘మూసీ మురికి నీళ్లు వద్దు.. కృష్ణా నీళ్లే ముద్దు’, ‘ఫ్లోరైడ్ లేని నల్లగొండ కావాలి… సూర్యాపేటకు కృష్ణా నీళ్లు రావాలి’ లాంటి నినాదాలు గోడలపై కనిపించేవి.
హైదరాబాద్ నుంచి వచ్చే మురికినీళ్లు మూసీ ప్రాజెక్టుకు వచ్చిన తర్వాత ఆ నీటిలో క్లోరిన్ కలపడం ద్వారా శుద్ధి చేసి తాగడానికి ఉపయోగించేవారు. ఆ నీళ్లు కూడా సూర్యాపేట ప్రజలకు దొరకని స్థితి ఉండేది. ఒక ఊరి డ్రైనేజీ నీళ్లు ఇంకో ఊరి ప్రజలు తాగడం అత్యంత బాధాకరమైన విషయం. ఇదీ తెలంగాణ ప్రజల గోస. వ్యవసాయానికి నీళ్లు లేక భూమి అమ్ముకొని బతికే దుస్థితి. చదువు కోసం సూర్యాపేటకు వస్తే మురికినీళ్లే గతి. అందుకే ‘సాగు కోసం రైతులకు నీళ్ళు కావాలని, తాగేందుకు మనుషులకు మంచినీళ్లు కావాలని’ నాన్న ఎప్పు డూ మాట్లాడేవాడు. తెలంగాణ ప్రాంతం, ముఖ్యంగా నల్లగొండ జిల్లాలోని ఎక్కువ ప్రాంతాల్లోని నీటిలో అధిక మోతాదులో ఫ్లోరిన్ ఉండేది. ఆ ఫ్లోరైడ్ ప్రభా వంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యేవారు. ఫ్లోరైడ్ నీళ్లు తాగితే ఫ్ల్లోరోసిస్ వ్యాధి కారణం చేత కాళ్లు, చేతులు, నడుములు వంకర పోయేది. అందుకే నాన్న ఫ్లోరైడ్ రహిత నల్లగొండ కావాలని ఆకాంక్షించాడు.
నేను హుజూర్నగర్లో ఓ చిన్న రియల్ ఎస్టేట్ కంపెనీలో కలెక్షన్ బాయ్గా పనిచేసేది. హుజూర్నగర్ వెళ్తున్న సందర్భంలో మునగాల దాటిన తర్వాత సాగర్ కాలువ నీళ్లు చూసి ఎంతో మురిసిపోయేవాడిని. నీళ్లతో అక్కడి పొలాలు పచ్చగా కళకళలాడేవి. కానీ తిరిగి సూర్యాపేటకు వచ్చేటప్పుడు, మునగాల దాటిన తర్వాత నీటి సుక్క కనిపించకపోయేది. బోర్లు, బావులపై ఆధారపడి వ్యవసాయం చేసేవాళ్లం. పశువులకు మేత లేక, తాపేందుకు నీళ్లు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డాం. కాల్వ కిందికి కూలీ పనులకు వెళ్లి ఆకలి తీర్చుకునేవాళ్లం.
ఇన్ని బాధలు చూసిన నేను రాష్ట్రం ఏర్పడితేనే అవన్నీ పోతయని, తెలంగాణ ఉద్యమంలో భాగస్వామి కావాలని నిర్ణయించుకున్నా. అందుకే 2001 ఏప్రిల్ 27న తెలంగాణ సాధనే లక్ష్యంగా ఏర్పాటైన టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న. పార్టీ అధినేత, ఉద్యమసారథి కేసీఆర్ వెంట నడిచిన. ఉద్యమంలో పాల్గొంటూ తెలంగాణ అడ్వకేట్ జేఏసీ అధికార ప్రతినిధిగా పనిచేసిన. ఉద్యమ నాయకుడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రసాధన కోసం ఏ పిలుపు ఇచ్చినా ముందుండి పోరాడిన. అన్నివేళలా ఆయన వెంట నడిచిన. ఉద్యమ ప్రతి సందర్భంలోనూ నాదైన బాధ్యత నిర్వర్తించిన. నా మీద దాదాపు 150 కేసులు నమోదైనయి. అయినా ఎక్కడా వెనుకడుగు వేయలేదు.
తెలంగాణ వచ్చింది. నాన్న కలలు నిజం కావడానికి అడుగులు పడ్డయి. తెలంగాణ ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ ‘నీళ్లు, నిధులు, నియామకాల’కు తొలి ప్రాధాన్యం ఇచ్చారు. బృహత్తరమైన కాళేశ్వరం ప్రాజెక్టు ను మూడేండ్లలో పూర్తిచేసి రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేశా రు. రైతుల ఆత్మహత్యలు, ఆకలిచావులు, వలసలతో సత మతమైన తెలంగాణ నేడు తలెత్తుకొని నిలబడుతున్నది. రైతు కోసం సాగునీళ్లు.. రైతుబంధు, బీమా.. రైతు కేం ద్రంగా నేడు పాలన సాగుతున్నది.
నాన్న కల నిజమైంది. మా ఊరికి పోచంపాడు కాలు వ వచ్చింది. ‘మిషన్ భగీరథ’ ద్వారా నల్గొండ జిల్లా ఫ్లోరై డ్ మహమ్మారి నుంచి బయటవడ్డది. మురికినీళ్లు తాగిన సూర్యాపేట, నల్లగొండ నేడు స్వచ్ఛమైన గోదావరి నీళ్లు తాగుతున్నది. తెలంగాణలో పడుతున్న అభివృద్ధి పరుగులను చూస్తుంటే దేశంలో కూడా కేసీఆర్ పాలన అవసరం అనిపిస్తున్నది. జై తెలంగాణ..! జై భారత్..!!.
– సీహెచ్ ఉపేంద్ర, 99632 02547
(వ్యాసకర్త: రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు)