సమస్య అన్నది సర్వసాధారణం. విజ్ఞులు ఎవరైనా సమస్యను పరిష్కరించటంపైనే దృష్టిపెడతారు. అంతేకానీ దాన్ని ఆసరాగా చేసుకుని పబ్బం గడపాలనుకోరు. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తన రాజకీయ పబ్బం గడుపుకోవటానికి గోరంతల్ని కొండంతలు చేస్తున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా.. ప్రభుత్వంలో ఉన్నట్టు వ్యవహరించడం లేదు. ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్టు ముఖ్యమంత్రి సహా అతని మంత్రివర్గ సహచరులు మాట్లాడుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేపట్టిన గోబెల్స్ ప్రచారంతో అధికారంలోకి వచ్చినా అసత్యాలు మానటం లేదని మాజీ నీటిపారుదల శాఖ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు మండిపడ్డారు. చలో మేడిగడ్డ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం అన్నారం బరాజ్ వద్ద నిర్వహించిన ప్రెస్మీట్, ఫైనల్ పవర్పాయింట్ ప్రజెంటేషన్లో హరీశ్రావు చేసిన పూర్తి ప్రసంగ పాఠం..
Harish Rao | ప్రతిపక్షాలు సమస్య లేవనెత్తినప్పుడు ప్రభుత్వం పరిష్కరించాలి, లేదా సమాధానం చెప్పాలి. కానీ అందుకు విరుద్ధంగా పోటీ సభలు, సమావేశాలు, పర్యటనలు ఏర్పాటుచేసుకొని అటెన్షన్ డైవర్ట్ చేయడం సమస్యను పక్కదారి పట్టించడమే. ప్రతిపక్షానికి స్పేస్లేకుండా తామే ఆక్రమించడం అనేది చీప్ టాక్టిక్స్. ఇలాంటి చిల్లర మల్లర ప్రయత్నాల వల్ల తాత్కాలికంగా పైశాచిక ఆనందం పొందుతారేమో గాని, ప్రజల మన్ననలు ఏ మాత్రం పొందలేరు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించవద్దని నినదిస్తూ, మొన్న నల్లగొండ సభ ఏర్పాటు చేస్తే, కాంగ్రెస్ నాయకులు మేడిగడ్డకు వెళ్లి హడావుడి చేశారు. కుంగిన రెండు మూడు పిల్లర్లను భూతద్దంలో పెట్టి చూపించారు. ప్రజల్లో కాళేశ్వరం పట్ల లేనిపోని అపోహలు కల్పించే ప్రయత్నం చేశారు. నేడు కాళేశ్వరాన్ని కాపాడుకునేందుకు చలో మేడిగడ్డకు పిలుపునిస్తే, దాని నుంచి ప్రజలను, మీడియాను డైవర్ట్ చేసేందుకు పాలమూరు రంగారెడ్డి పర్యటనకు పిలుపునిచ్చారు. కాళేశ్వరం-కాగ్ రిపోర్టుపై హైదరాబాద్లో చర్చలు నిర్వహిస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేసి తన కుటిల బుద్ధిని బయటపెట్టుకుంటున్నది. ఇవాళ రాష్ర్టాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఏ విధంగా ఉందంటే డిఫ్లెక్షన్, డైవర్షన్, డిస్టార్షన్, డిస్ట్రక్షన్.. అంతిమంగా రిగ్రేషన్…అంటే ప్రతిపక్షం మీద దాడి చేయడం, ప్రజల దృష్టిని మళ్లించడం, వాస్తవాలను వక్రీకరించడం, నిర్లక్ష్యంతో జాతీయ సంపదను విధ్వంసం చేయడమే. మొత్తంగా తిరోగమన దిశలో ఈ ప్రభుత్వం పయనిస్తున్నదని తెలియజేయడానికి విచారిస్తున్నాం. గవర్నెన్స్ మీద చిత్తం లేకుండా చిల్లర రాజకీయాల మీదనే దృష్టి కేంద్రీకరించి రాష్ర్టాన్ని అధోగతి పాలు చేయబోతున్నారనే అనుమానం కలుగుతున్నది.
కాంగ్రెస్ నాయకుల ధోరణి చూస్తుంటే వారికి రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల ప్రయోజనాలకన్నా రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమైనట్టుంది. పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు సీట్లు పొందాలనే దుగ్ధ తప్ప, నీళ్లిద్దామనే ఆలోచన లేదు. మేడిగడ్డ వద్ద రెండు పిల్లర్లు కుంగి మూడు నెలలు గడుస్తున్నాయి. ఇప్పటివరకు ప్రాజెక్టు పునరుద్ధరణ పై వారి నిర్మాణాత్మకమైన వైఖరిని వెల్లడించలేదు. ఎంతసేపు గోబెల్స్ ప్రచారం మీదనే దృష్టిపెట్టారు తప్ప, రైతుల ప్రయోజనాల గురించి ఆలోచన చెయ్యడం లేదు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు గోబెల్స్ ప్రచారం చేసారనుకుంటే, ఇప్పుడు అధికారంలో ఉన్నా అదే గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. మెగా ప్రాజెక్టుల నిర్మాణంలో సాంకేతిక సమస్యలు రావడం సహజం. బాధ్యత గల ప్రభుత్వాలు సమస్యకు వెంటనే పరిష్కారం కనుగొనాలి. ప్రజా ప్రయోజనాలు కాపాడే ప్రయత్నం చేయాలి. ప్రజల శ్రేయస్సే కేంద్ర బిందువుగా ప్రభుత్వాలు ముందుకు వెళ్లాలి. తలెత్తిన సాంకేతికలోపాన్ని పరిష్కరించకుండా అవినీతి ముద్రవేసి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే ప్రయత్నం చేస్తున్నరు. తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని కాంగ్రెస్ కుట్ర చేస్తున్నది. 2022లో గోదావరి చరిత్రలో వన్ ఆఫ్ ద హయ్యస్ట్ ఫ్లడ్ వచ్చింది. మేడిగడ్డ వద్ద 28 లక్షలు, అన్నారం వద్ద 17.5 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. అంతటి వరదను తట్టుకొని నిలబడి రైతాంగానికి నీళ్లందించాయి. కాళేశ్వరం ప్రాజెక్టులోని వంద కాంపొనెంట్లలో మేడిగడ్డ ఒకటి. కారణమేదైనప్పటికీ మేడిగడ్డలోని 86 పిల్లర్లలో రెండు పిల్లర్లకు కొంత సమస్య వచ్చింది. బాధ్యతగలిగిన ప్రభుత్వం దాన్ని రాజకీయం చెయ్యకుండా పరిష్కరించే ప్రయత్నం చెయ్యాలె. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నది?
2022లో వచ్చిన భారీ వరదల సమయంలోనే అనూహ్యంగా కన్నెపల్లి, అన్నారం పంప్హౌస్లు మునిగాయి. మీలాగా మేము చేష్టలుడిగి చూడలేదు. కాలం వృథా చెయ్యలేదు. యుద్ధప్రాతిపాదికన చర్యలకు ఉపక్రమించి ఏజేన్సీ ఖర్చులతో కొద్ది మాసాల్లోనే మరమ్మతులు చేయించి పునరుద్ధరించాం. నీళ్లు అందించాం. ఆ విషయాన్ని ఈ ప్రభుత్వానికి గుర్తు చేయడానికే ఇక్కడిదాకా వచ్చాం. ఆ స్ఫూర్తిని ఇప్పుడు మీరు చూపించాలనే బాధ్యతను చెప్పడానికి ఇక్కడి దాకా వచ్చాం. అన్నారం బ్యారేజీకి ఎలాంటి ఢోకా లేదు. ఏవైనా చిన్న సమస్యలుంటే వచ్చే రెండు నెలల్లో పూర్తి చేయొచ్చు. ఒకవైపు మేడిగడ్డను సేఫ్ జోన్కు తెచ్చేందుకు పునరుద్ధరణ పనులు చేస్తూనే, మరోవైపు అన్నారం నుంచి కాళేశ్వరం ఆయకట్టుకు నీళ్లు అందించడం సాధ్యమవుతుంది. 34 స్ట్రీములతో పాటు మానేరు నీళ్లు కూడా వస్తాయి. కాబట్టి ఆ నీటిని కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ఈ పనులు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.ప్రాజెక్టులో తలెత్తిన లోపాన్ని సరిదిద్దకుండా, ఆ సాకుతో తెలంగాణ రైతుల ప్రయోజనాలను, తెలంగాణ వ్యవసాయ ప్రయోజనాలను పణంగా పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న కపటనాటకం తెలంగాణ రైతాంగం పాలిట పెనుశాపంగా మారబోతున్నది.
రేవంత్రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డలో తలెత్తిన లోపాన్ని సాకుగా చూపించి, యావత్ కాళేశ్వరాన్ని విధ్వంసం చేసే కుట్రకు పాల్పడుతున్నదనే అనుమానాలు తలెత్తుతున్నాయి.. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన ప్రకటన ఈ అనుమానాన్ని మరింత బలపరుస్తున్నది. బాంబులు పెట్టి ప్రగతిభవన్ పడగొడుతానని గతంలో రేవంత్రెడ్డి చేసిన ప్రకటనను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. బీఆర్ఎస్ను రాజకీయ క్షేత్రంలో పడగొట్టడం కోసం కాళేశ్వరాన్ని పడగొట్టాలనే ధ్వంస రచన సీఎం నేతృత్వంలో జరుగుతున్నదని ఎవరికైనా అనిపిస్తుంది. కాళేశ్వరంపై కాంగ్రెస్ దుష్టపన్నాగాన్ని బయట పెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ ఇక్కడి దాకా వచ్చింది.
ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ప్రారంభించిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఏడాది కాలంలోనే అంచనా వ్యయాన్ని 17వేల కోట్ల నుంచి 38వేల 500 కోట్లకు పెంచింది. రూ.1,426 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద డ్రా చేసి, 168 కోట్ల భూసేకరణ పనులు మాత్రమే చేశారు. సరైన ప్లానింగ్ లేకుండానే 1శాతం మొబిలైజేషన్ అడ్వాన్స్ చెల్లించింది నిజం కాదా? ఒప్పందం ప్రకారం ఉన్న 0.5 శాతం సర్వే అండ్ ఇన్వెస్టిగేషన్ డబ్బులను 3.5 శాతం చేసింది నిజం కాదా? ఎలాంటి ప్లానింగ్ లేకుండా, డీపీఆర్ ఆమోదం లేకుండా ప్రాజెక్ట్ రూపకల్పన చేయడాన్ని కాగ్ రిపోర్ట్ తప్పు పట్టిన మాట వాస్తవం కాదా? కేంద్రంలో, మహారాష్ట్రలో, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి కూడా ప్రాణహిత ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు సాధించడంలో విఫలం కావడం వాస్తవం కాదా?. తలాపునా గోదారి పారుతున్నా, ఉమ్మడి పాలనలో తెలంగాణ రైతన్నకు కన్నీటి గోసే మిగిలింది. తెలంగాణ రైతుల విషాదగాధలు తెలిసిన ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రిగా అయ్యారు కాబట్టి, ప్రాజెక్టులు లేక వృథాగా సముద్రంలో కలిసే గోదావరి జలాలను బీళ్లకు మళ్లించేందుకు భగీరథయత్నం చేశారు కేసీఆర్. కాళేశ్వరానికి శ్రీకారం చుట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు పట్ల కనీస అవగాహన లేకుండా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నరు.
కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల పొడవైన సొరంగాలు, 1531కిలోమీటర్ల గ్రావిటి కెనాల్, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్, 240 టీఎంసీల నీటి వినియోగం. వీటన్నింటి సమాహారమే కాళేశ్వరం. ఈ మహాయజ్ఞంలో ఇంజినీర్లు, విశ్రాంత ఇంజినీర్లు, ఇంజినీరింగ్ నిపుణులు రాత్రింబవళ్లు శ్రమించారు. వారి శ్రమను, వారి మేథస్సును అవమానించేలా కాళేశ్వరం ప్రాజెక్టును చెత్త ప్రాజెక్టు అని వ్యాఖ్యలు చేయడం అత్యంత బాధాకరం. ఇది ఇంజనీర్లను అవమానించడమే. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయడమే.
కేసీఆర్ ఎందుకు క్షమాపణ చెప్పాలి? ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తే తద్వారా వచ్చేది కేవలం 16 లక్షల ఎకరాల ఆయకట్టు మాత్రమే. అదే కాళేశ్వరం ద్వారా వచ్చే ఆయకట్టు 38లక్షల ఎకరాలు. నీళ్లు అందే ఆయకట్టును డబుల్ చేసినందుకు క్షమాపణ చెప్పాలా? రిజర్వాయర్ల సామర్థ్యం 16 టీఎంసీల నుంచి 141 టీఎంసీకి పెంచినందుకా? లిఫ్ట్ చేసే సామర్థ్యం 1.8 టీఎంసీ నుంచి 3 టీఎంసీలకు పెంచినందుకా? (భూసేకరణ కోసం చేసిన ఖర్చు 1000 కోట్ల నుంచి 6000 కోట్లకు పెరిగింది.) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2005లో జలయజ్ఞంలో భాగంగా తెలంగాణలో 19 భారీ ప్రాజెక్టులని, 12 మధ్యతరహా ప్రాజెక్టులని, 2 ప్రాజెక్టుల అధునికీకరణ (నిజాంసాగర్ &నాగార్జున సాగర్), వరంగల్, ఖమ్మం జిల్లాల్లో గోదావరి కరకట్టల నిర్మాణం ప్రతిపాదించి ప్రారంభించింది. వీటిల్లో రెండు ప్రాజెక్టులు మాత్రమే పూర్తి అయ్యాయి. అవి నిజామాబాద్ జిల్లాలో చేపట్టిన అలీసాగర్ ఎత్తిపోతల పథకం, అర్గుల రాజారాం గుత్ప ఎత్తిపోతల పథకం. మిగతా ప్రాజెక్టులు 10 సంవత్సరాలు గడిచినా అనేక సమస్యల్లో కూరుకుపోయి నత్తనడక నడిచాయి. అప్పటి జలయజ్ఞం ధనయజ్ఞమని రాష్ట్రమంతా కోడైకూసింది. జలయజ్ఞంలో 52వేల కోట్ల దుర్వినియోగం జరిగిందని కాగ్ దుమ్మెత్తిపోసింది. అలాంటి చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ నేడు కాగ్ గురించి మాట్లాడుతున్నది. కాంగ్రెస్ కాగ్ రిపోర్టు గురించి మాట్లాడుకోవడం అంటే తమను తాము నిందించుకోవడమే అవుతుంది..
కాళేశ్వరం కింద సాగవుతున్న ఆయకట్టు విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారం చూస్తుంటే హాస్యాస్పదంగా ఉన్నది. కాళేశ్వరం ద్వారా 98వేల ఎకరాలకు మాత్రమే నీళ్లు అందుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రవచిస్తారు. వారి ప్రవచనానికి విరుద్ధంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి నిన్న జరిగిన ప్రెస్మీట్లోనే ఏటా లక్షా 30వేల ఎకరాలకు నీళ్లు అందుతున్నాయంటారు. మొన్న మరోమంత్రి కొండా సురేఖ రంగనాయక్ సాగర్ నుంచి నీళ్లు విడుదల చేస్తూ, ఆ రిజర్వాయర్ పరిధిలోనే లక్షా 10వేల ఎకరాలకు నీళ్లు అందుతాయని ప్రకటిస్తారు. ముఖ్యమంత్రి మొత్తం ప్రాజెక్టు కింద 98వేలు అంటే, మంత్రి సురేఖ ఒక్క రిజర్వాయర్ కిందనే లక్షా 10వేలు అంటరు. ఉత్తమ్కుమార్ ముచ్చటగా మూడుసార్లు మూడు విధాల సంఖ్యలు చెబుతరు. ఉత్తమ్ కూడా యథారాజా తథాప్రజా అన్నట్టు తయారయ్యారు. రేవంత్రెడ్డి సాంగత్యంతో స్థాయి దిగజారి మాట్లాడుతున్నరు.
తెలంగాణ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశమే లేని కాంగ్రెస్ పార్టీ నాడు అయిష్టంగానే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది. అంతర్రాష్ట్ర వివాదాలు, చాప్రాల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ మధ్య, నీటి లభ్యత లేని చోట బ్యారేజీ ప్రతిపాదిస్తే నాటి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మౌనంగా ఉన్నారు. పదవుల కోసం పెదవులు మూసుకున్నరు. అలా తెలంగాణకు తీరని ద్రోహం చేశారు. ప్రతిపాదిత తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని సీడబ్ల్యూసీ చెప్పింది నిజం కాదా?(కాపీ చూపించాలి). ప్రతిపాదిత ప్రాజెక్టులో జలాశయాల సామర్థ్యం సరిపడా లేదని, కాబట్టి ప్రాజెక్టు అవసరాలకు తగినంత ఆన్లైన్ జలాశయాల సామర్థ్యాలను పెంచుకోవాలని, కొత్త జలాశయాలు నిర్మించాలని సీడబ్ల్యూసీ చెప్పింది నిజం కాదా? (కాపీ చూపించాలి) ఇన్ని అడ్డంకులున్నప్పటికీ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేయాలనే సంకల్పంతో కేసీఆర్ అనేక ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగా స్వయంగా మహారాష్ట్ర వెళ్లి అక్కడి గవర్నర్ విద్యాసాగర్రావు సహకారంతో ముఖ్యమంత్రి ఫడ్నవిస్తో చర్చలు జరిపారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు. గోదావరి జలాలను ఎలాగైనా తెలంగాణ ప్రాంత రైతాంగానికి అందించాలనే పట్టుదలతో ప్రత్యామ్నాయం వెతకాల్సి వచ్చింది. ఇందులో భాగంగా కేంద్రప్రభుత్వ వ్యాప్కోస్ సంస్థ అధ్యయనం చేసింది. అనంతరం వ్యాప్కోస్ నివేదిక ప్రకారం, ప్రాజెక్టు స్థలాన్ని మేడిగడ్డ వద్దకు మార్చడం జరిగింది. తుమ్మిడిహెట్టి వద్ద 165 టీఎంసీల నీటి లభ్యత మాత్రమే ఉంటే, మేడిగడ్డ వద్ద 284 టీఎంసీల నీటి లభ్యత ఉన్నది. వందేండ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తెలంగాణ తాగు, సాగు, పారిశ్రామిక అవసరాలు తీర్చడంతో పాటు, హైదరాబాద్ నగర అవసరాలు తీర్చేలా మేడిగడ్డ వద్ద ప్రాజెక్టును ప్రతిపాదించాం. నిర్మించాం. కాంగ్రెస్ పార్టీ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణం పేరుతో ఏడేండ్ల కాలాన్ని వృథా చేస్తే, బీఆర్ఎస్ పార్టీ మాత్రం నాలుగేండ్లలో కాళేశ్వరం పూర్తి చేసి రైతులకు నీళ్లు అందించింది. మేము కూడా వారిలాగా నీళ్లు ఇవ్వకుండా పదేండ్ల కాలం వృథా చేస్తే బాగుండేదని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటున్నట్టుంది. తెలంగాణ రైతుల పట్ల ప్రేమ ఉన్న పార్టీ కాబట్టి, రైతన్న కష్టాలు, కడగండ్లు తొలగించేందు యుద్ధప్రాతిపాదికన ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు అందించాం.. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలు పెరిగాయని విమర్శలు చేస్తున్న వారు వాస్తవాలు తెలుసుకోవాలి. అసలు ఈ దేశంలో ఎక్కడైనా తొలుత ప్రతిపాదించిన అంచనా వ్యయంతో ప్రాజెక్టు పూర్తయిన చరిత్ర ఉన్నదా? కొన్ని ప్రాజెక్టుల విషయంలో వంద రెట్ల దాకా పెరిగిన సందర్భాలు ఉన్నాయి..
ఇదే మేడిగడ్డ వేదికగా నీటిపారుదలశాఖ ఇంజినీర్లు ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన ప్రజెంటేషన్లో చెప్పిందేమిటి? మొత్తం కాళేశ్వరం కింద 20లక్షల 33వేల 576 ఎకరాలకు నీళ్లు అందుతున్నాయని ఇంజినీర్లు ఇచ్చిన నివేదిక తేటతెల్లం చేసింది. కాళేశ్వరం ద్వారా నేరుగా 98,570 ఎకరాలు, కాళేశ్వరం ప్రాజెక్టు కాల్వల ద్వారా నింపిన 456 మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల ద్వారా 39,146 ఎకరాల కొత్త ఆయకట్టు. కాళేశ్వరం ప్రాజెక్టు నీటితో ఎస్సారెప్సీ 1, 2 స్టేజులతోపాటు నిజాంసాగర్ నీటితో నింపిన 2,143 ట్యాంకుల ద్వారా 1,67,050 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లు అందించడం జరిగింది. (మొత్తం 3,04,766 ఎకరాలకు నీళ్లు అందించడంతో పాటు) దీంతోపాటు ఎస్సారెస్పీ స్టేజ్ 1, స్టేజ్ 2, ఎల్ఎండీ లోయర్మానేరు డ్యాంకు కాళేశ్వరం నీళ్లను మళ్లించి తద్వారా స్థిరీకరించిన ఆయకట్టు 17లక్షల 8వేల 230 ఎకరాలు. వీటితోపాటు అదనంగా కాళేశ్వరం నీళ్లు కూడవెళ్లి, హల్దీ వాగుల ద్వారా 66 చెక్ డ్యాంలతో మరో 20వేల 576 ఎకరాలకు సాగునీరు అందించాం. అంటే మొత్తం 20లక్షల 33వేల 572 ఎకరాలకు కాళేశ్వరం ద్వారా నీళ్లు అందించాం. ఈ వివరాలు ఇదే మేడిగడ్డ వేదికగా మీద ప్రభుత్వ నివేదికనే స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి మాత్రం ఆ నివేదికలోని వాస్తవాలను జీర్ణించుకోలేకపోయారు. కాళేశ్వరం ప్రాజెక్టును జలాశయాలు, చెరువులతో అనుసంధానం చేయడం ద్వారా భూగర్భ జలమట్టం గణనీయంగా పెరగటంతోపాటు మత్స్య సంపద 200శాతం పెరిగింది. దీంతో ఎంత మందికి ఉపాధి అవకాశాలు కలిగాయి. ఇదంతా వాస్తవం కాదా? సాగు విస్తీర్ణం పెరిగింది నిజం. పంట ఉత్పత్తి పెరిగింది నిజం. మత్స్య సంపద పెరిగింది నిజం. భూగర్భ జలాలు పెరిగింది నిజం. రైతన్నల కండ్లల్లో ఆనందం నిండింది నిజం. ఇదంతా దాచేస్తే దాగని సత్యం. మనకండ్ల ముందు, మనందరి అనుభవంలో ఉన్న సాగునీటి విజయగాథ ఇది. ఇదంతా ఎంతో కృషి వల్ల జరిగితే, వర్షాలు పడటం వల్లనే ఇది సాధ్యమైందని ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడటం అతని దిగజారుడు తనానికి నిదర్శనం. నాడు మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు కూడా వర్షాలు పడ్డాయి. మరి ఎందుకు భూగర్బ జలాలు పెరగలేదు? ఎందుకు సాగు విస్తీర్ణం పెరగలేదు? ఎందుకు పంటల ఉత్పత్తి పెరుగలేదు? ఆలోచించుకోవాలి. నిజానికి ఏ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలోనైనా మొదట హెడ్వర్క్స్.. అంటే డ్యాంలు, బరాజ్లు, స్పిల్వే గేట్లు, జలాశయాలు, ఎత్తిపోతల పథకాలు అయితే పంప్ హౌస్లు , సర్జిపూల్స్, విద్యుత్తు సబ్స్టేషన్లు, విద్యుత్తు లైన్లు, డెలివరీ సిస్టర్న్లు తదితర అనుబంధ నిర్మాణాలు పూర్తి చేస్తారు. వీటి పైననే ప్రభుత్వాలు నిధులు కేటాయించి ఖర్చు చేస్తాయి. ఎందుకంటే ఇవి నిర్మాణం కాకుండా ఆయకట్టుకు నీరివ్వలేం. వీటి తర్వాతనే ప్రధాన కాలువ, డిస్ట్రిబ్యూటరీల నిర్మాణంపై ఖర్చుచేస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిర్మాణం అయిన నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, జూరాల తదితర ప్రాజెక్టుల్లో కూడా జరిగింది ఇదే. 1963లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు శంఖుస్థాపన జరిగితే హెడ్ వర్క్స్ పూర్తి అయిన తర్వాతనే 1975లో 11 ఏండ్ల తర్వాత మొదటిసారి 25వేల ఎకరాల ఆయకట్టుకు నీటి విడుదల చేశారు. 2008-09 నాటికి ఆయకట్టు 9లక్షల ఎకరాలకు చేరుకున్నదన్న వాస్తవాన్ని గుర్తించాలి. అంటే 45 ఏండ్లు గడిచాక 9లక్షల ఎకరాలకు చేరింది. నాగార్జునసాగర్కు 1955లో ఫౌండేషన్ వేస్తే 12 ఏండ్ల తర్వాత 98వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చారు. 30 ఏళ్ల తర్వాత పూర్తి ఆయకట్టుకు నీళ్లు ఇచ్చారు….1984-2014 వరకు అంటే 30 ఏండ్ల కాలంలో కల్వకుర్తి ద్వారా ఇచ్చింది 13వేల ఎకరాలకు మాత్రమే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పెండింగ్ పనులు పూర్తి చేయడం ద్వారా 3లక్షల 7వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇచ్చాం. 2001లో దేవాదుల చంద్రబాబు ప్రారంభిస్తే 2014 వరకు ఇచ్చిన ఆయకట్టు 45వేలు మాత్రమే. ఏ ప్రాజెక్టు చరిత్ర చూసినా, దశల వారీగా ఆయకట్టు పెరుగుతూ పోయింది తప్ప ఒక్కసారే మొత్తం ఆయకట్టు సాగులోకి రాలేదు…కాళేశ్వరం విషయంలోనూ మేము అదే చెబుతున్నాం. మీరు కాళేశ్వరం చివరి పనులైన డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్ పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు నీళ్లు ఇవ్వండి. కాళేశ్వరం అందించే విస్తృత ప్రయోజనాలను తెలుసుకోండి ముఖ్యమంత్రీ.
తెలంగాణ ఉద్యమ ఫలితం కాళేశ్వరం. ఉద్యమ ప్రయోజనాలను కాలరాసే విషపు కుట్రలను మానండి. రేవంత్రెడ్డి.. మీరు తెలంగాణ ఉద్యమ ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా అయినా తెలంగాణ ప్రయోజనాలు కాపాడండి. అటు ఉద్యమంలోనూ, ఇటు పరిపాలనలోనూ ద్రోహం చేసి నిరంతరం ద్రోహిగా చరిత్రలో మిగిలిపోకండి. ద్రోహాలకు ఇప్పటికైనా ముగింపు పలకండి. మేడిగడ్డను ధ్వంసం చేయకండి.ఈ వేదికగా మీకు నేను ఒక అప్పీల్, హెచ్చరిక రెండూ చేయదల్చుకున్నా. .మీరు ఏమన్నా చేసుకోండి. ఎన్ని కేసులైనా పెట్టుకోండి. మమ్మల్ని ఎంతైనా హింసించండి. కానీ ప్రాజెక్టును కాపాడండి. రైతులను కాపాడండి. ఇది బీఆర్ఎస్, కాంగ్రెస్ సమస్య కాదు.ఇది పార్లమెంట్ ఎన్నికల సమస్య కానేకాదు. ఇది ఓట్ల సమస్య అంతకంటే కాదు. ఇది తెలంగాణ రైతుల బతుకుదెరువు సమస్య. లక్షలాది రైతు కుటుంబాల జీవితాలతో ముడిపడి ఉన్న సమస్య. ఇది తెలంగాణ సాగునీటి సమస్య. ఇది తెలంగాణ భూగర్భ జలాల సమస్య. సమస్యను ఈనాడు పిల్లర్ల వద్దే పరిష్కరించండి. అల్పమైన రాజకీయ ప్రయోజనం కోసం ఆలస్యం చేసి మిగతా పిల్లర్లకు సమస్య విస్తరించేలా చేయకండి. ఒకవేళ అలాంటిదేమన్నా జరిగితే, మేడిగడ్డ ప్రాజెక్టుకు మరింత పెద్ద నష్టం గనుక వాటిల్లితే, దానికి పూర్తి బాధ్యత ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వానిదే అవుతుందని హెచ్చరిస్తున్నా.
ప్రపంచ చరిత్రలో డ్యాంలలో లోపాలు తలెత్తడం కొత్తకాదు. పెద్దపెద్ద ప్రమాదాలే జరిగిన సంఘటనలున్నాయి. మీ పరిపాలనలోనే ప్రాజెక్టుకు ప్రాజెక్టే కొట్టుకుపోయిన సందర్భాలు ఉన్నాయి. ప్రభుత్వాలు రాజకీయ లబ్ధి కోసం ఎవరిపైనో నిందలు వేయకుండా సకాలంలో మరమ్మతులు చేసి ప్రజలకు సాగునీరు, తాగునీరు అందించాయి. మన దేశంలోనే డ్యామ్లు తీవ్రంగా దెబ్బతిన్న కేసులు 36 ఉన్నాయి.
సాగునీటి ప్రాజెక్టుల్లో అనేక కారణాల వలన ప్రమాదాలు జరుగుతాయి. ప్రభుత్వాలు వాటిని పునరుద్ధరించి రైతాంగానికి నీటిని సరాఫరా చేసినాయి తప్ప నిందలు వేస్తూ కూర్చోలేదు.