బీజేపీకి తెలంగాణలో భవిష్యత్ ఉందో? లేదో? వారం, పది రోజుల్లో కర్ణాటక ఎన్నికలతో తేలిపోతుందట. కర్ణాటకలో ఎన్నికలు జరిగితే ఇక్కడెట్ల దాని భవిష్యత్ తేలుతుందనే ప్రశ్న తలెత్తిందా? సరిగ్గా ఇదే డౌట్ను ఖమ్మం వెళ్లిన ఈటల రాజేందర్ నేతృత్వంలోని బీజేపీ చేరికల కమిటీ వ్యక్తం చేసింది. అధికారంలో ఉండి కూడా అక్కడ బీజేపీ గెలువకపోతే ఇక్కడ (తెలంగాణ) ఎట్ల గెలుస్తది? ఇదే అనుమానాన్ని తమ అనుచరులు, శ్రేయోభిలాషులు వ్యక్తం చేస్తున్నారు. అందుకే కర్ణాటక ఫలితాలు వచ్చాకే తాము బీజేపీలో చేరేది, లేనిది చెప్తామని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తేటతెల్లం చేశారు. మాతో అంటే అన్నారు కానీ… పత్రికల వారికి అలా చెప్పకండి. ఫలితాల తర్వాత మీ నిర్ణయం వేరేగా ఉంటే… తెలంగాణలో ఇక బీజేపీకి భవిష్యత్ లేదని చెప్పకనే చెప్పినట్టవుతుందని చేరికల కమిటీ వాపోగా, మీకే కాదు కాంగ్రెస్కు కూడా ఇదే మాట చెప్పామన్నారట. ఇప్పటికే తమకు గిరాకీ లేక తం టాలు పడుతుంటే, ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిపడినట్టు మధ్యలో ఈ కర్ణాటక ఫలితాలొకటి వచ్చిపడ్డాయని చేరికల కమిటీ నిరాశతో హైదరాబాద్కు వెనుదిరిగినట్టు సమాచారం.
పీసీసీ అధ్యక్షుడు ఒక్కడే ఎస్పీ. మిగతా వాళ్లు ఎంత సీనియర్లు అయినా హోంగార్డ్స్ లాంటోళ్లే. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్రెడ్డి బాధ్యతలు స్వీకరించాక పార్టీలో తన హోదాపై క్లారిటీ ఇస్తూ సూత్రీకరించారు. అయితే కాంగ్రెస్లో ఇక నుంచి పెద్దా, చిన్నా, సీనియర్, జూనియర్ అంటూ ఎవరూ ఉండరని, తామంతా సమానమేనని ‘పెద్దలు’ జానారెడ్డి స్పష్టం చేశారు. నల్లగొండలో విభేదాలను మరిచి నాయకులందరూ ఏ విధంగా నిరుద్యోగుల దీక్షను సక్సెస్ చేశారో, హైదరాబాద్లో ప్రియాంక గాంధీ పాల్గొనే యువ సంఘర్షణ సభను అదేమాదిరిగా విజయవంతం చేయాలని జానారెడ్డి పిలుపునిచ్చారు. అసలు విషయం ఏమంటే… కాంగ్రెస్లో నల్లగొండ, మహబూబ్నగర్ రెడ్ల పంచాయితీ వల్లే బీజేపీ బలపడుతున్నదని, ఇకనుంచి అందరం కలిసి పనిచేద్దామని జానారెడ్డి సమక్షంలో ఇటీవల రాజీ కుదిరినట్టు సమాచారం.
బజరంగ్దళ్ వివాదంతో కర్ణాటక ఎన్నికల సీన్ సితారైపోయింది. కమలనాథులు జై భారత్ను పక్కనబెట్టి… జై బజరంగ్బలి నినాదాన్ని ఎత్తుకున్నారు. ఎన్నికల ప్రచారాన్ని పక్కనబెట్టి హనుమాన్ చాలీసా సామూహిక పారాయణాలు మొదలుపెట్టారు. దీంతో అధికారంలోకి వస్తే బజరంగ్దళ్ను నిషేధిస్తామన్న కాంగ్రెస్ డామిట్ కథ అడ్డం తిరగడంతో అభ్యర్థులు ఆంజనేయుని ఆలయాల చుట్టూ జై బజరంగ్బలి అంటూ ప్రదక్షిణలు మొదలుపెట్టారు. రంగంలోకి దిగిన సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ సీఎం వీరప్ప మొయిలీ, జైరాం రమేశ్ కొత్త లాజిక్కులతో ఎదురుదాడికి దిగారు. స్వాతంత్య్రం సిద్ధించాక బీజేపీ నాయకులు తమ ఆరాధ్య నాయకునిగా భావించే సర్దార్ వల్లబ్బాయి పటేల్ ఆర్ఆర్ఎస్పై నిషేధం విధిస్తే, జవహర్లాల్ నెహ్రూ జోక్యంతో నిషేధం ఎత్తివేసిన విషయాన్ని వీరప్ప మెయిలీ గుర్తుచేశారు. అలాగే గోవాలో శ్రీరామ సేనను బీజేపీకి చెందిన దివంగత సీఎం మనోహర్ పారిక్కర్ నిషేధించిన విషయం మరిచిపోయారా? అని జైరాం రమేష్ నిలదీస్తున్నారు.
– వెల్జాల