కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 17న రాష్ట్ర రాజధానిలో హైదరాబాద్ విమోచన ఉత్సవాలు నిర్వహించారు. ఇక్కడి మట్టి మనుషుల ఘన పోరాట చరిత్ర, సంస్కృతిపై బీజేపీ చేసిన దండ యాత్రలాగా ఈ ఉత్సవాలు సాగాయి. తెలంగాణ సాయుధ పోరాట యోధుల్లో ఒక్కరి పేరు కూడా కేంద్ర హోం శాఖ మంత్రి హోదాలో ఆ సభలో ప్రసగించిన అమిత్ షా కుట్ర పూరితంగా స్మరించలేదు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని భారత స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం గతంలోనే గుర్తించిన విషయం బీజేపీ మరచిపోయినట్టుంది.
పాతికేళ్ల క్రితం ప్రధాని, హోం మంత్రులుగా ఉన్న వాజ్పేయి, అద్వానీలు తెలంగాణ చరిత్రలో కమ్యూనిస్టుల ఆనవాళ్లు లేకుండా చేసేందుకు వ్యూహాత్మక చర్యలు తీసుకున్నారు. స్వాతంత్య్ర సమర యోధుల స్క్రీనింగ్ కమిటీ సిఫారసు చేసిన తెలంగాణ స్వాతంత్ర సమరయోధులను గుర్తించేందుకు వాజ్ పేయి ప్రభుత్వం నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ఇదే వారసత్వాన్ని కొనసాగిస్తూ విమోచన పేరుతో కేంద్ర ప్రభుత్వం జరిపిన ఉత్సవాల్లో కమ్యూనిస్టుల పాత్రను పూర్తిగా విస్మరించేలా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రసంగం సాగడం నాలుగున్నర వేల మంది ప్రాణ త్యాగాలను అవమానపరచడమే. అమిత్ షా చరిత్ర విషయంలో వ్యక్తిగత రాగద్వేషాలు అతీతంగా ఉండాలి. కానీ ఆయన చేసిన ప్రసంగం బీజేపీ కుటిల బుద్ధికి, కమ్యూనిస్టులపై ఆ పార్టీకి ఉన్న వ్యతిరేకతకు నిదర్శనం.
అప్పటికే ఆంధ్ర ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ స్థాపించబడి భూస్వాముల అణచివేతలపై ఉద్యమం సాగుతున్న తరుణమది. కామ్రేడ్స్ అసోసియేషన్ పేరుతో హైదరాబాద్లో కమ్యూనిస్టు పార్టీ పూర్వగామిగా ఉండేది. తెలంగాణలో కూడా చండ్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్యల చొరవతో పార్టీ స్థాపితమైంది. తెలంగాణ పల్లెలలో దళిత, గిరిజన, బలహీనవర్గాలు, సన్న/చిన్నకారు రైతులపై భూస్వాములు, పెత్తందారుల బెదిరింపులు, అణచివేతలు అకృత్యాలు పెరిగిపోయిన సందర్భంలో వెట్టిచాకిరి రద్దు, దున్నే వాడికే భూమి, తెలుగులో చదువు లాంటి తీర్మానాలు ప్రజలను ఆకర్షించాయి. తమకు పెద్ద అండ లభించిందనే ఉత్సాహంతో ప్రజలు ఊరూరా సంఘాలు పెట్టుకున్నారు. దొరల గూండాలను ఎదిరించారు.
కమ్యూనిస్ట్ పార్టీ సాయుధ పోరాటానికి పిలుపు ఇచ్చిన వెంటనే హైదరాబాద్ సంస్థానమంతటా తీవ్రమైన నిర్బంధ కాండ కొనసాగింది. ఆ సమయంలో కమ్యూనిస్టు పార్టీ నాయకులు బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణ రెడ్డి, మఖ్దూం మొహియుద్దీన్ నిజాంను గద్దె దించుదామని ప్రజలకు పిలుపునిచ్చారు. దీంతో ఊరూవాడా ఉప్పెనైంది. వెట్టిని నిరాకరించారు. పంట భూముల్లో ఎర్ర జెండాలు పాతి ఆక్రమించారు. దొరలు, నిజాం నిస్సహాయ స్థితికి చేరుకున్నారు. ఇదే సమయంలో అప్పటి స్టేట్ కాంగ్రెస్ నాయకులతో సంప్రదింపులు జరిపిన కేంద్ర ప్రభుత్వం నిజాం యథాతథ ఒప్పందానికి అంగీకరించిన వెంటనే సెప్టెంబర్ 13, 1948లో సైన్యాన్ని రంగంలోకి దింపింది. ఒక్క రక్తం చుక్క చిందకుండా అయిదు రోజుల్లోనే హైదరాబాద్ సంస్థానం భారత్లో విలీనమైందని నిజాం ప్రకటించడం వెనక ఉన్న కారణాలేమిటో తెలియనిది ఎవరికి?
హైదరాబాద్ రాజ్యంలోని ఈ దేశ ప్రజలను కాపాడాల్సిన భారత సైన్యం ఆ ప్రజలపైనే దాడులు చేసింది. దొరలకు అండగా నిలిచివారు తమ భూములు తిరిగి స్వాధీనం చేసుకోవడానికి సహకరించింది. అడ్డు వచ్చిన రైతులు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, కార్యకర్తలను, సాధారణ ప్రజలను ఊచకోత కోసింది. అందుకు నిదర్శనంగా ఆనాడు ఎన్కౌంటర్లు జరిగిన ప్రాంతాల్లో అమర వీరుల స్థూపాలు, చిహ్నాలు ఉన్నాయి. వీటిని చూసి కూడా కండ్లున్న కబోదిలాగా బీజేపీ వ్యవహరించడం అమానుషం. కానీ తెలంగాణ సాయుధ పోరాటంపై బీజేపీ వితండ వాదం చేస్తోంది. ఆనాటి హోం శాఖ మంత్రి వల్లభాయ్ పటేల్ మూలంగానే నిజాం నవాబు గద్దె దిగి పోయారని ప్రస్తుతం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా లాంటివారు ప్రకటిస్తున్నారు.
ఒక వైపు కమ్యూనిస్టుల చరిత్రను మరుగున పరిచే కుట్ర చేస్తున్న బీజేపీ నేతలు మరోవైపు విలీన దినోత్సవాల సందర్భంగా కమ్యూనిస్టు అమరుల స్థూపాలను దర్శించి నివాళులు ఎందుకు అర్పిస్తున్నారు? ఇది తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు ఆడుతున్న నాటకం కాదా?
భాషా ప్రయుక్త రాష్ర్టాలు ఏర్పడిన తర్వాత తెలంగాణలో కలిసి ఉన్న మహారాష్ట్ర 5 జిల్లాలు, కర్నాటకలోని 3 జిల్లాలను ఆయా రాష్ర్టాలలో కలిపేశారు. ఆ రెండు రాష్ర్టాల ప్రభుత్వాలు సెప్టెంబర్ 17ను విలీన దినంగా ప్రభుత్వ లాంఛనాలతో ఆనాటి నుంచి నిర్వహిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ ఉత్సవాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నిర్వహించలేదు? ఇవన్నీ తెలంగాణ పౌరులు ఆలోచించాలి. టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వీర బైరాన్పల్లి, గుండ్రాంపల్లి లాంటి ఎన్కౌంటర్లు జరిగిన ప్రదేశాల్లో సభలు జరిపి వాటిని పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దితే బాగుంటుంది. గతం లేకుండా వర్తమానం ఉండదు. భవిష్యత్తు అసలే ఉండదు. ఇప్పటికైనా బీజేపీ వాస్తవాలను గుర్తించి పెండింగ్లో ఉన్న తెలంగాణ సాయుధ పోరాట యోధుల పింఛన్లను మంజూరు చేయాలి. చరిత్రను వక్రీకరిస్తే పుట్టగతులుండవని తెలుసుకోవాలి.
(వ్యాసకర్త: సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు)