ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన ఈ ఏడున్నరేండ్లలో మన ప్రాంతం మొత్తం ఓ గొప్ప అభివృద్ధి దిశగా ముందుకు నడుస్తున్నది. పారిశ్రామికీకరణ, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వటం ఈ సమీకృత అభివృద్ధికి ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు.
ఎంతో దుష్ప్రచారం కారణంగా, తెలంగాణ ఏర్పడక ముందు రాష్ట్రం మనుగడపై ఎన్నో అపోహలు, అనుమానాలు ఉండేవి. వాటన్నింటి మధ్య ఆవిర్భవించిన తెలంగాణ అన్ని అనుమానాలనూ పటాపంచలు చేసింది. యావత్ తెలంగాణ తలెత్తుకొని నిలబడేలా రికార్డుస్థాయి విజయాలను సాధించింది. రాష్ట్ర ఆవిర్భావానికి ముందున్నటువంటి పారిశ్రామికీకరణతో పోల్చిచూస్తే నేడు ఎంతో అభివృద్ధి సాధించిన విషయం మన కళ్లముందు కనపడుతున్నది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు దార్శనికత.. వారికి అనుగుణంగా అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించే పరిశ్రమలు, వాణిజ్యం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి కేటీ రామారావు పట్టుదల, నిబద్ధత వల్ల మన రాష్ర్టానికి పెట్టుబడుల వెల్లువ కొనసాగింది. రాష్ట్రం ఏర్పాటైన తొలినాళ్లలోనే వివిధ దేశీయ, అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో కేటీఆర్ జరిపిన చర్చలు సత్ఫలితాలను ఇచ్చాయి. మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలు, అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, సరళతరమైన ప్రభుత్వ నిబంధనల గురించి మంత్రి స్వయా నా వివరించడం ఎన్నో అంతర్జాతీయ కంపెనీలకు విశ్వాసాన్ని కలిగించింది. దీంతో ఆయా కంపెనీలు తెలంగాణకు తరలివచ్చాయి.
సమగ్ర పరిశీలన తర్వాతే పెట్టుబడులు: ఒక రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేముందు వ్యాపారసంస్థలు, కంపెనీలు అనేక కోణాల్లో ఆలోచిస్తాయి. ముఖ్యంగా, ఆ రాష్ట్ర రాజకీయ నాయకత్వం వ్యవహరిస్తున్న తీరు, అమలుచేస్తున్న విధానాలు, అందించే ప్రోత్సాహకాలు.. ఆ రాష్ట్రంలో సుస్థిరమైన సామాజిక వాతావరణం, శాంతిభద్రతలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు తదితర పలు అంశాలను చూస్తా యి. దేశీయ కంపెనీలుగానీ, అంతర్జాతీయ కంపెనీలుగానీ ఈ సమగ్ర పరిశీలన తర్వాతనే పెట్టుబడులకు ముందుకు వస్తాయి. ఆ విధంగా గత ఏడున్నరేండ్లలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కంపెనీలు, ముఖ్యంగా టెక్ జెయింట్లుగా పేరొందిన అమెజాన్, ఆపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఊబర్ తమ ద్వితీయ శ్రేణి కార్యాలయాలను అమెరికా తర్వాత మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోనే ఏర్పాటు చేసుకున్నాయి.
యువతకు బంగారు భవిష్యత్తు: ప్రపంచ ప్రఖ్యాత ఐటీ, బ్యాంకింగ్ తదితర దిగ్గజ కార్పొరేట్ కంపెనీలను తెలంగాణకు తీసుకురావటంలో పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పాత్ర ఎంతో కీలకమైనది. ఈ విషయాన్ని ఆయా కంపెనీల ప్రతినిధులే బహిరంగ వేదికల మీద ప్రకటించారు. ఈ మధ్యకాలంలో తెలంగాణలో పెట్టుబడులు పెట్ట డానికి ముందుకువచ్చిన మహీంద్ర గ్రూప్ ప్రతినిధులు, కైటెక్స్ గ్రూపు యాజమాన్యం చెప్పిన మాటలు దీనికొక తాజా ఉదాహరణ. కైటెక్స్ గ్రూపు కేరళ రాష్ర్టాన్ని వదిలి వేరే రాష్ట్రంలో తమ పరిశ్రమలను పెట్టదలుచుకున్న సం గతి తెలియగానే మంత్రి కేటీఆర్ వారితో స్వయంగా మాట్లాడి, రాష్ర్టానికి ఆహ్వానించి వారికి విశ్వాసం కల్పించారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో తాము తమ పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని కైటెక్స్ ప్రకటించింది. తొలుత అనుకున్న రూ.1,000 కోట్ల పెట్టుబడిని రూ.2,400 కోట్లకు పెంచింది. కైటెక్స్ గ్రూపు చైర్మన్ జాకబ్.. ‘మీకు పెట్టుబడులు ముఖ్యమా, ఉద్యోగ అవకాశాలు ముఖ్యమా?’ అని మంత్రిని ప్రశ్నించిన సమయంలో పెట్టుబడులను తీసుకురావటంతోపాటు, మా రాష్ట్ర యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలను కల్పించటం మా ప్రాధాన్యం అని మంత్రి చెప్పిన సమాధానాన్ని జాకబ్ స్వయానా వేదిక మీద వెల్లడించారు. రాష్ర్టానికి దేశీయ, అంతర్జాతీయ కంపెనీలను తీసుకురావటమేగాక, వాటి రాక వల్ల మన యువత భవిష్యత్తు మెరుగుపడేలా రాష్ట్ర ప్రభుత్వం ఒక సమగ్రమైన వ్యూహంతో కృషి చేస్తున్నదనటానికి ఇదొక నిదర్శనం.
ప్రైవేటీకరణ యుగం: పరిశ్రమలు రాష్ర్టానికి తరలిరావడం వల్ల తెలంగాణ అభివృద్ధి చెందటంతోపాటు మన యువతకు ఉద్యోగ అవకాశాలు కొత్తగా అందుబాటులోకి వస్తాయి. దీనివల్ల ఆయా కంపెనీలు, పరిశ్రమలు నెలకొన్న ప్రాంతం మొత్తం అభివృద్ధి దిశగా పయనిస్తుంది. ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు ప్రైవేటీకరణకే మొగ్గుచూపుతున్నాయి. ఇది అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామం. ఇటువంటి తరుణంలో ఏ ప్రభుత్వానికైనా యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం అనేది అంత సులభమైన విషయం కాదు. వాస్తవానికి ఏ రాష్ట్రంలోనైనా ఆ రాష్ట్ర జనాభాలో 1.5 నుంచి 2.5 శాతం మంది ప్రజలకే ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు లభిస్తుంటాయి. ఇదొక సాధారణ సూత్రం. ఇటువంటప్పుడు మిగిలిన మెజారిటీ ప్రజలకు ప్రైవేటు రంగంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవటమే ఏకైక ప్రత్యామ్నాయం. ఈ విషయంలో సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గొప్ప ముందుచూపుతో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నది. రాష్ట్రం ఏర్పడిన వెంటనే పారిశ్రామికీకరణకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి, దేశంలోనే కనీవినీ ఎరుగనటువంటి టీఎస్ఐపాస్ వంటి అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని ప్రకటించింది. విద్యుత్తు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసింది. దీని ఫలితంగానే దిగ్గజ కార్పొరేట్ కంపెనీలు తెలంగాణకు తరలివచ్చాయి. ఈ విధంగా తెలంగాణ యువత భవిష్యత్తుకు రాష్ట్ర ప్రభుత్వం బంగారు బాట వేసింది.
రాష్ట్ర ప్రభుత్వ నాయకత్వం, నిబద్ధత, దార్శనికత తెలంగాణకు, మన ప్రజలకు గొప్ప బలం. ఇప్పటికే మెర్సర్ లాంటి అంతర్జాతీయ సంస్థల సర్వేలో హైదరాబాద్ ‘బెస్ట్ లివబుల్ సిటీ’ల్లో ఒకటిగా నిలిచింది. రానున్న రోజుల్లో తెలంగాణ మరింత అభివృద్ధి చెంది మన దేశంలోనే ‘డెస్టినేషన్ స్టేట్’గా, మన రాజధాని హైదరాబాద్ ‘మోస్ట్ హాపెనింగ్ ప్లేస్’గా నిలుస్తాయని ఆశిద్దాం.
(వ్యాసకర్త: థాట్లీడర్, స్ట్రాటెజిస్ట్,ఐఐఎం-కల్కత్తా పూర్వ విద్యార్థి, ఫెల్లో ఇన్ అప్లయిడ్ పాలిటిక్స్)
–డాక్టర్ లగ్గాని శ్రీనివాస్ (యల్.ఎస్.)