బీజేపీ అర్థబలం, అంగబలం ఉన్న జాతీయ పార్టీ. ఈశాన్యంలోని చిన్న రాష్ర్టాల్లో గల చిన్న పార్టీలు బీజేపీ ధాటికి తట్టుకోలేవు. అందువల్ల నయానా భయానా అక్కడి పార్టీలను తమవైపు తిప్పుకొంటున్నది. లేదా ప్రజా పునాది లేకున్నా అర్థబలంతో పార్టీ బలాన్ని పెంచుకుంటున్నది. బీజేపీ కుట్రల మూలంగా అరుణాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కలిఖోపుల్ ఆత్మహత్య చేసుకున్నారంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
పొంచి ఉన్న మాయావి మళ్ళీ దొంగ దెబ్బ తీసింది. అబద్ధాలు, అక్రమాలతో దేశాన్నంతా కబళించాలని చూస్తున్న బీజేపీ.. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్ర పన్నింది. వాట్సాప్ అబద్ధాలతో, అంతులేని నిధులతో కేంద్రంలో అధికారం చేజిక్కించుకున్న బీజేపీ, ఒక్కటొక్కటిగా రాష్ర్టాలను కబళిస్తున్నది. తద్వారా బహుళత్వాన్ని గౌరవించే మన దేశంలో ప్రాంతీయ ఆకాంక్షలను, ప్రజాస్వామిక పాలనను చిదిమివేయాలని చూస్తున్నది. వివిధ రాష్ర్టాల్లో ఆ పార్టీ కుట్రలు..
మహారాష్ట్ర: ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూలదోయడానికి బీజేపీ ఇప్పటికే పలుసార్లు ప్రయత్నించింది. మళ్లీ ఇప్పుడు ముప్పై మందికి పైగా ఎమ్మెల్యేలను అస్సాంలో ఏర్పాటు చేసిన శిబిరానికి తరలించింది. బీజేపీకి మద్దతు ఇవ్వాలంటూ వారి చేత శివసేన నాయకత్వాన్ని బ్లాక్మెయిల్ చేయిస్తున్నది. శివసేన-బీజేపీ కూటమిగా ఏర్పడి గెలిచిన తర్వాత కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కదా అనేది ఒక వాదన. కానీ బీహార్లో నితీశ్ గతంలో ఆర్జేడీతో కలిసి పోటీ చేసి గెలిచిన తర్వాత ఆ పార్టీని వదలిపెట్టి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదా? బీజేపీతో కలిస్తే ధర్మం అవుతుంది, విడిపోతే అధర్మమవుతుందా? రాష్ట్రప్రభుత్వాలను కూల్చటానికి సాకులివి.
కర్ణాటక: కాంగ్రెస్, జేడీఎస్ కలిసి బొటాబొటి మెజారిటీ సాధించాయి. ఈ రెండు పార్టీలు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కానీ బీజేపీ కొందరు ఎమ్మెల్యేలకు ఎరవేసి తమవైపు తిప్పుకొని వారిచేత రాజీనామా చేయించింది. దీంతో బీజేపీ అతిపెద్ద పార్టీగా మారింది. జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలదోసి అధికార పీఠాన్ని బీజేపీ చేజిక్కించుకున్నది.
మధ్యప్రదేశ్: అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరాజయం పాలైంది. మొత్తం 230 స్థానాల్లో 116 స్థానాలుంటే మెజారిటీ. కాంగ్రెస్కు 114, బీజేపీకి 109 సీట్లు వచ్చాయి. ఇతరుల మద్దతుతో కాంగ్రెస్ అధికారం చేపట్టింది. బీజేపీ హుందాగా ప్రతిపక్ష స్థానాన్ని అంగీకరించాలి. కానీ అసమ్మతి నాయకుడైన జ్యోతిరాదిత్య సింధియాకు కేంద్రమంత్రి పదవి ఆశ చూపి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసింది. ప్రజలు తిరస్కరించినప్పటికీ దొడ్డిదారిన మళ్లీఅధికారానికి వచ్చింది.
బీహార్: గతంలో ఆర్జేడీ, జేడీయూ కూటమి విజయం సాధించింది. బీజేపీ కూటమికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. కానీ బీజేపీ ప్రజా తీర్పును గౌరవించకుండా తమ వ్యతిరేక కూటమిని విచ్ఛి న్నం చేసి జేడీయూను తమవైపు లాగేసుకొని అధికారం చేపట్టింది. గత ఎన్నికల్లో కూడా మిత్రపక్షమైన జేడీయూ ఓట్లు తగ్గించడానికి ఈ పార్టీకి వ్యతిరేకంగా లోక్ జన్శక్తి పార్టీ అభ్యర్థులను నిలబెట్టించింది. అయినా జేడీయూకు తగినన్ని సీట్లు రావడంతో నితీశ్కుమార్కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వవలసి వచ్చింది. ఇప్పుడు సీఎం నితీశ్ను అడ్డుపెట్టుకొని ఆర్జేడీని అణచివేయాలని పన్నాగం. మరోవైపు నితీశ్ పరిస్థితి కూడా సర్పం పడగనీడలో కప్ప మాదిరిగా ఉన్నది.
గోవా: గత ఎన్నికల్లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించినా, బీజేపీ ఇతర పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేత ఫిరాయింపులు జరిపించింది.
తమిళనాడు: జయలలిత అనారోగ్యానికి గురై మరణించిన తదనంతర పరిస్థితుల్లో ఆ పార్టీని పూర్తిగా గుప్పెట్లోకి తెచ్చుకున్నది బీజేపీ. అన్నా డీఎంకే ప్రభుత్వాన్ని తెరవెనుక ఉండి నడిపించింది. పుదుచ్చేరిలో ప్రాంతీయ పార్టీ ఎన్.ఆర్. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని అక్కడ పాగా వేసింది.
సిక్కిం: ఈ రాష్ట్రంలో ఏనాడూ బీజేపీ ప్రధాన రాజకీయ పక్షం కాదు. ఈ పార్టీ అభ్యర్థులకు కనీసం డిపాజిట్ కూడా దక్కింది లేదు. కానీ 2014లో కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టగానే పావులు కదపడం మొదలుపెట్టింది. 25 ఏండ్లుగా పాలిస్తున్న పవన్ కుమార్ చామ్లింగ్ (సిక్కిం డెమొక్రాటిక్ ఫ్రంట్)కు వ్యతిరేకంగా ‘సిక్కిం క్రాంతికార్ మోర్చా’ ఏర్పాటైంది. పైకి సిక్కిం పార్టీ కానీ, వెనుక ఉండేది బీజేపీ. మొత్తం 32 సీట్లలో ఈ పార్టీకి 17 సీట్లు లభించాయి. గెలిచిన వెంటనే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో భాగస్వామిగా మారిపోయింది. మిగిలిన 15 సీట్లను సిక్కిం డెమొక్రాటిక్ ఫ్రంట్ గెలుచుకుని బలమైన ప్రతిపక్షంగా నిలిచింది. కానీ బీజేపీ ఈ పార్టీ నుంచి 10 మందిని లాగేసుకున్నది. దీంతో ఒక్క సీటు లేని బీజేపీ ‘ప్రతిపక్షం’గా మారిపోయింది. (ఇటీవల బీజేపీ బలం 12కు పెరిగింది) అటు అధికారపక్షమూ ఆ కూటమిదే.
సిక్కిం వంటి తదితర ఈశాన్య రాష్ర్టాల సరిహద్దు ప్రాంతాల్లో అధికారం కోసం బీజేపీ కుయుక్తులకు పాల్పడటం దీర్ఘకాలికంగా ప్రమాదకరం. అక్కడి ప్రజలను తమ సొంత పార్టీల ద్వారా పాలించుకోనిచ్చినప్పుడే వారికి మన రాజ్యాంగం మీద, రాజకీయ వ్యవస్థ మీద నమ్మకం కుదురుతుంది.
రాజస్థాన్లో అసమ్మతి వాదులను ప్రలోభపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేయాలని బీజేపీ చేసి న కుట్రలు ఫలించలేదు. ఇందుకు కారణం- కాం గ్రెస్ భారీ మెజారిటీతో ఉండటమే. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి మొదట టీడీపీ నేత చంద్రబాబు కుట్రలు చేసినప్పుడు కేసీఆర్ దాన్ని చాకచక్యంగా తిప్పికొట్టారు. ఎప్పుడూ భారీ మెజారిటీ ఉండేవిధంగా జాగ్రత్త పడుతున్నారు. దీన్నిబట్టి అర్థమవుతున్నదేమిటంటే- రాష్ర్టాలలో ప్రాంతీయ పార్టీలు మూడింట రెండు వంతుల లేదా నాలిగింట మూడు వంతుల మెజారిటీతో ఉంటే వాటిని ప్రత్యర్థులు కూల్చివేయడం సాధ్యం కాదు. ఢిల్లీలో (తాజాగా పంజాబ్లో) ఆప్, పశ్చిమబెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వాలు స్థిరంగా ఉండటానికి ఈ భారీ మెజారిటీయే కారణం. అందువల్ల ప్రాంతీయ పార్టీలు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు తమ ప్రాంతీయ పార్టీలకు భారీ మెజారిటీ కట్టబెట్టాలి.
– సంతోష్. పి