శాస్త్ర సాంకేతిక రంగాలల్లో ప్రపంచ దేశాలతో భారత్ పోటీ పడుతూ, అంతరిక్ష పరిశోధనల్లో సరికొత్త శిఖరాలను అధిరోహిస్తున్నది. మరోవైపు సమాజంలో ఇంకా ‘కులం’ అనే మహమ్మారి వేళ్లూనుకొని ఉండటం అత్యంత దురదృష్టకరం. విద్యావంతులు, చైతన్యవంతులు గల ప్రగతిశీల తెలంగాణ రాష్ట్రంలోనూ నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో చోటుచేసుకున్న ఉదంతం చూస్తుంటే మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరి గుండె తరుక్కుపోతున్నది.
ఈ ఆధునిక యుగంలో కూడా దేవుడి గుడిలోకి వస్తావా.. అంటూ ఒక కుటుంబాన్ని గంటల తరబడి బంధించి, చిత్రహింసలకు గురిచేయడం చూస్తుంటే మనం ఇంకా ఏ కాలంలో బతుకుతున్నామా అనే సందేహం కలుగుతున్నది. ఆ ముక్కుపచ్చలారని పసిపాప చేసిన పాపమేమిటి? కేవలం ఒక వర్గంపై ఉన్న ద్వేషం, తమ ఆధిపత్యం తగ్గిపోతున్నదనే భయం, అగ్రకులమనే భావనతో ఏర్పడిన అహంకారం వెరసి ఒక పసి ప్రాణం గాలిలో కలిసిపోయేలా చేశాయి. కులం పేరుతో దూషిస్తూ, తన్నుతూ, ఆ తల్లిని హింసించిన దుర్మార్గుల చర్యలు పశుప్రవృత్తికి పరాకాష్ఠగా నిలుస్తున్నాయి. ఇలా అనాగరిక చర్యలకు పాల్పడే వారిని నడిరోడ్డుపై బహిరంగంగా శిక్షించినా తప్పులేదు.
కుమ్మెర ఘటన కేవలం ఆ కుటుంబానికి జరిగిన అన్యాయం మాత్రమే కాదు, తెలంగాణ సమాజపు ఆత్మగౌరవంపై జరిగిన దాడి. ప్రజాస్వామ్య విలువల గురించి గొప్పలు చెప్పుకునే మనం, మన కండ్ల ముందే అగ్రకుల అహంకారపు కాళ్ల కింద ఒక చిన్నారి చితికిపోయినా మౌనంగా ఉండటం కూడా నేరమే అవుతుంది. ఈ సమాజంలో చట్టం అందరికీ సమానమని రాజ్యాంగం చెప్తున్నా, ఆచరణలో మాత్రం బలవంతులదే రాజ్యం అన్నట్టుగా సాగుతున్నది. అణగారిన వర్గాల ప్రాణాలకు విలువే లేదన్నట్టుగా ప్రవర్తిస్తున్న కుల శక్తుల తీరును ఎండగట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నది.
సమాజంలో కొందరి మనసుల్లో మనువాద భావజాలం ఎంత విషపూరితంగా ఉన్నదో కుల దురహంకారుల దాడి నిరూపిస్తున్నది. ఆరు గంటల పాటు ఆ కుటుంబాన్ని బంధించి చిత్రహింసలు పెట్టడం అంటే అది ఆషామాషీ కాదు. అక్కడ చట్టం లేదని, అడిగేవాడు లేడని ఆ నిందితుల ధీమా. తల్లి ఒడిలో ఉన్న పసికందును కాలితో తన్ని చంపడం అంటే వారిలో మానవత్వం పూర్తిగా మరణించిందని అర్థం. మానవత్వం మంటగలిసిన చోట కుల అహంకారం ఎంతటి క్రూరత్వానికి ఒడిగడుతుందో ఈ ఘటనే సాక్ష్యం. ఈ దారుణం జరిగినప్పుడు గ్రామంలో ఉన్న ఇతరులు నోరు మెదపకపోవడం వెనుక పెద్ద భయం ఉన్నది. ఆ గ్రామంలో అగ్రకుల పెత్తనం ఏ స్థాయిలో ఉన్నదో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. అన్యాయం జరుగుతున్నప్పుడు ఎవరూ అడ్డుకోలేకపోవడం మన సామాజిక స్పృహ ఎంత బలహీనపడిందో తెలియజేస్తున్నది.
కుమ్మెర ఘటనలో రక్షించాల్సిన పోలీసులే భక్షకులకు వత్తాసు పలుకడం ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఎఫ్ఐఆర్ నమోదు, నిందితుల అరెస్టులో కాలయాపన చేయడం వెనుక ఉన్న రాజకీయ ఒత్తిళ్లు ఏమిటి అనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. చట్టం కొందరికి చుట్టమా అనే సామాన్యుడి అనుమానం ఇక్కడ నిజమవుతున్నది. బాధితుల పక్షాన నిలబడాల్సిన వ్యవస్థలు నేరస్థులకు రక్షణ కవచంలా మారడం హేయం. అగ్రకుల అహంకారాన్ని చట్టరీత్యా అణచివేయకపోతే ఇలాంటి కుమ్మెర ఘటనలు పునరావృతమవుతూనే ఉంటాయి.