స్వపరిపాలన సుపరిపాలనగా అద్వితీయమైన రీతిలో ఆవిష్కృతమైన తీరు తెన్నులకు దశాబ్ది ఉత్సవాలు నిలువుటద్దాలు పట్టాయి. రాష్ర్టాభివృద్ధికి, సకలజనుల సమృద్ధికి నీరాజనాలెత్తాయి. విజయాలను ముద్దాడిన వీరులతో కాలం చేసే కరచాలనమే ఈ ఉత్సవాలని చెప్పవచ్చు. కాలగమనంలో మైలురాళ్లు దాటుతున్నప్పుడు కాసేపు ఆగిచూ స్తాం. నిన్నను సమీక్షించుకుంటాం. రేపటిని వీక్షించుకుంటాం. కర్తవ్యబద్ధులమవుతాం. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఈ స్ఫూర్తితోనే జరిగాయి. వివిధ ప్రభుత్వ శాఖలవారీగా దినోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. చివరగా అమరులకు మహాజ్యోతి ప్రజ్వలనంతో అపురూప నివా ళి ఘటించారు. ఉత్సవాలకు ఇది సముచితమైన ముంగిపు అని చెప్పాలి. దశాబ్ది కాలంలో తెలంగాణ అభివృద్ధిలో అంగలు వేసింది. సంక్షేమంలో అంచులను తాకింది. పల్లెలు మెరిశాయి. పట్టణాలు మురిశాయి. నీరు పల్లం నుంచి పైపైకి ఎగబాకి తెలంగాణ తల్లి పాదాలు కడిగింది. సాగు బాగుపడింది. పారిశ్రామికం పరుగులు తీసింది. ఆధ్యాత్మిక గోపురం అంబరాన్ని చుంబించింది. దశాబ్దాల్లో సాధ్యం కాని అభివృద్ధి కేవలం పదేండ్ల కాలంలో సాధించిన వైనాన్ని దశాబ్ది ఉత్సవాలు దీటైన రీతిలో ఆవిష్కరించాయి. తెలంగాణ కీర్తికాంతులు దశదిశలా వ్యాపించాయి.
ఉత్సవాల చివరిరోజున అమరుల స్మృతికి సీఎం కేసీఆర్ సముచితమైన రీతిలో నివాళులు అర్పించారు. అమరజ్యోతి సాక్షిగా ఉద్విగ్నతకు లోనయ్యారు. ఉద్యమ ప్రస్థానాన్ని స్మరించుకున్నారు. అదేవిధంగా ఈ ఉత్సవాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ పలుసభల్లో మాట్లాడుతూ చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్, వ్యవసాయాధారిత పరిశ్రమల స్థాపన వంటి కీలక ప్రకటనలతో దిశానిర్దేశం చేశారు. అనతికాలంలోనే తెలంగాణ గొప్ప ఆర్థికశక్తిగా ఎదిగినప్పటికీ మున్ముందు అందుకోవాల్సిన శిఖరాలెన్నో ఉన్నాయని గుర్తుచేశారు. అమరుల ఆశయాలు, ప్రజల ఆకాంక్షల సాధన దిశగా అడుగులు వేద్దామని పిలుపునిచ్చారు. సంపద పెంచుదాం.. ప్రజలకు పంచుదాం అనేదే తమ ప్రభుత్వ నినాదమని నొక్కిచెప్పారు. తెలంగాణ దేశానికి రోల్ మాడల్ అయింది. ఈ మాడల్ను దేశవ్యాప్తం చేయాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు.
ఈ ఉత్సవాల నిర్వహణలో మంత్రులు, అధికారులు నిర్వహించిన గురుతరమైన పాత్ర ప్రశంసనీయం. ముఖ్యంగా ఉన్నతస్థాయి అధికారులు అంతా తామే అయి ఉత్సవాలను నడిపించారు. ఆయా శాఖలు వివిధ రంగాల్లో సాధించిన విజయాలను సగర్వంగా చాటిచెప్పారు. పదేండ్ల పండుగను పదికాలాల పాటు గుర్తుంచుకునేలా నిర్వహించారు. రాజకీయ నాయకత్వం దిశానిర్దేశం చేస్తుంది. కానీ క్షేత్రస్థాయిలో ఆ నిర్ణయాలను అమలు చేసే కీలకబాధ్యత అధికార యంత్రాంగానిదే. అందుకే సచివాలయ ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్ గత తొమ్మిదేండ్ల ప్రగతి ప్రస్థానంలో తనవెంట నడిచిన ప్రతి అధికారికి, ఉద్యోగికి చేతులెత్తి నమస్కరిస్తున్నానని చెప్పడం వారి పట్ల ఆయనకున్న అభిమానానికి నిదర్శనం. అందుకు తగ్గట్టుగానే అధికార యంత్రాంగం కూడా ఉత్సవాలను అహర్నిశలు కృషిచేసి విజయవంతం చేశారు.