ఉన్నది ఇరవై గుంటల భూమి. ఎవుసం జేస్తే కనీసం తిండికి సరిపడా దిగుబడి రాని పరిస్థితి. మరోవైపు ఏ పనీ చేయలేని దివ్యాంగురాలైన ఇల్లాలు. బిడ్డ పెండ్లి, కొడుకు చదువుకు చేసిన అప్పులు. ఆ అప్పుల బాధ తాళలేక నిద్రపోని రాత్రులెన్నో.. ఇదీ వీణవంక మండలం కనపర్తి గ్రామానికి చెందిన పర్లపెల్లి కనుకయ్య జీవితం.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ప్రవేశపెట్టిన ‘దళితబంధు’ పథకం ఇప్పుడు కనకయ్య ఇంట వెలుగులు నింపింది. ఆయనకు పట్టిన దశాబ్దాల దరిద్రాన్ని దూరం చేసింది. రోజూ కూలీకి వెళ్లే కనుకయ్య ఇప్పుడు డైరీ యూనిట్కు ఓనరైండు. ఈ పథకం కింద వచ్చిన పైసలతో నాలుగు బర్లు తెచ్చుకున్నడు. షెడ్ వేసుకున్నడు. ఇప్పుడు రోజూ 20 లీటర్లకు పైనే అమ్ముతూ నెలకు సుమారు రూ.20 వేలకు పైగా సం పాదిస్తున్నడు. సగర్వంగా జీవితాన్ని గడుపుతూ పేదరికా న్ని అధిగమిస్తున్నడు.
‘దళితబంధు’ పథకం సృష్టిస్తున్న అద్భుతాలకు కనుకయ్య జీవితమే నిదర్శనం. ఇప్పుడు రాష్ట్రంలో ఏ ఊరికి వెళ్లినా.. ఏ వెలివాడ గడప తట్టినా ఇలాంటి విజయగాథలే వినిపిస్తాయి. ‘దళితబంధు’ పథకం తోడుగా సగర్వంగా పైకి ఎదుగుతూ ప్రగతి పథంలో దూసుకుపోతున్న దళితుల జీవితాలు దర్శనమిస్తాయి. దళితుల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా ప్రవేశపెట్టిన ఈ పథకం లక్ష్యం దిశగా పరుగులు తీస్తూ కొత్త పుంతలు తొక్కుతున్నది. గత ప్రభుత్వాలు అమలుచేసిన పథకాలకు పూర్తిభిన్నంగా దళితులు ఆర్థిక ప్రగతి సాధించేందుకు బాటలు వేస్తున్నది. కూలీల రెక్కలకు ఆధునిక యంత్రాలపై హక్కులను కల్పిస్తున్నది. కొడవలి పట్టి కోతలు కోసిన చేతులే ఇప్పుడు సర్కారు ఆర్థికదన్నుతో కోత యంత్రాలను అందిపుచ్చుకుంటున్నాయి.
కోళ్లు, గొర్లు, చేపల పెంపకం, పాడిపరిశ్రమ, కూరగాయల సాగు తదితర వ్యవసాయ అనుబంధ రంగాల్లో అడుగుపెడుతున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూని ట్లు, ఇటుకల తయారీ, పేపర్ ప్లేట్స్ మాన్యుఫాక్చరింగ్, క్యాటరింగ్, ఇంజినీరింగ్ వర్క్స్, ఫర్నీచర్ తయారీ, తదితర చిన్నతరహా పరిశ్రమలను ఏర్పాటు చేసుకుంటూ తాము బతుకుతూ, మరికొంత మందికి ఉపాధి చూపుతున్నారు. పారిశ్రామికవేత్తలుగా మారి మరికొందరికి ఉపాధి కల్పిస్తున్న దృశ్యాలు సాక్షాత్కరిస్తున్నాయి. ఇదంతా సీఎం కేసీఆర్ వినూత్న ఆలోచనల ఫలితం. ‘దళితబంధు’ పథక నూతన ఆవిష్కరణలకు నిదర్శనం.
‘దళితబంధు’.. దళితులను అభివృద్ధిలో భాగస్వామ్యం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూపకల్పన చేసిన పథకం. దశాబ్దాలుగా కాగితాలకే పరిమితమైన ‘సమాన అవకాశాల కల్పన’ అమూర్త భావనను ఆచరణలో పెట్టి చూపుతున్నది. ఎలాంటి షరతులు లేకుండా, బ్యాంకు కిస్తీలు, తాకట్టు లేకుండా ఏకమొత్తంగా రూ.10 లక్షలు అందజేయడం దళితులకు దక్కిన గొప్ప వరం. సీఎం కేసీఆర్ మాటలను క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం పక్కాగా ఆచరణలో పెడుతున్నది. తొందరపడకుండా, ఎక్కడా ఏ చిన్న పొరపాటు జరగకుండా పకడ్బందీ కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతున్నది.
లబ్ధిదారుల ఇంటింటికీ తిరుగుతూ, వారికి ఏ ఉపాధి మార్గం అత్యంత లాభదాయకంగా ఉంటుందో, ఏ రంగాన్ని ఎంచుకుంటే ఎలాంటి ఆదాయం, అవకాశాలు అందుబాటులో ఉన్నా యో తదితర అంశాలపై బోధపరుస్తున్నది. లాభదాయకమైన ఉపాధి మార్గాన్ని ఎన్నుకునే దిశగా అవగాహన కల్పిస్తున్నది. యూనిట్లను ఎంచుకున్న లబ్ధిదారులకు ఆయా రంగాల్లో నైపుణ్యాలను సైతం అధికారులు పరీక్షిస్తున్నా రు. వారు ఎంచుకున్న యూనిట్లపై అవగాహన కల్పిస్తున్నారు. అవసరమైతే ఆయా రంగాల్లో నైపుణ్యాలను మరింతగా పెంపొందించేందుకు లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు స్వయంగా శిక్షణ సైతం ఇప్పిస్తుండటం అభినందనీయం.
పలురంగాల్లో అర్హులైన దళితులకు రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ కల్పిస్తున్నది. ఇలా అన్నిదశల్లో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం ఫలితంగానే ‘దళితబంధు’ పథకం ఆశించిన లక్ష్యాలను నమోదు చేస్తున్నది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 36 వేల మందికిపైగా నగదు అందజేయగా, క్రమంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరింపజేస్తున్నది.
ముఖ్యమంత్రి కేసీఆర్ దళితజన బాంధవుడు. ఎప్పు డూ.. ఎవరూ ఊహించనిరీతిలో, అందించని తోడ్పాటు ను దళిత జనులకు అందిస్తున్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని దళిత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. అందులో దళిత మేధావులు, యువకులు కీలకభూమిక పోషించాలె. పథకంపై దళితవాడల్లో విస్తృతంగా ప్రచారం చేయాలె. దళితబిడ్డలను చైతన్యవంతులను చేయాలె. నూతన ఆవిష్కరణలకు ప్రాణం పోయాలె. ఆర్థికంగా ఎదిగే ఆలోచనలకు శ్రీకారం చుట్టాలె. దళితులకు అవకాశం దక్కితే అద్భుతాలను సృష్టిస్తామనే సత్యాన్ని సమాజానికి ఎలుగెత్తి చాటాలి. ‘దళితబంధు’ విజయవంతమైతే ఒక్క తెలంగాణకే కాదు, యావత్ దేశ దళిత సమాజాభివృద్ధికి పునాదులు పడుతాయనడంలో ఎటువంటి సందే హం లేదు.(వ్యాసకర్త: చైర్మన్, ఎస్సీ కార్పొరేషన్ )
బండ శ్రీనివాస్