అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రభుత్వాలు జనాభాలోని పేద, వెనుకబడిన వర్గాల కోసం పలు ఆర్థిక, సామాజిక సహాయ కార్యక్రమాలను నిర్వహి స్తున్నాయి. ప్రపంచబ్యాంకు నివేదిక ‘ది స్టేట్ ఆఫ్ సోషల్ సేఫ్టీ నెట్స్’లో 171 అభివృద్ధి చెందుతున్న దేశాలు దాదాపు 100 కోట్ల మంది లబ్ధిదారులకు ‘ప్రత్యక్ష నగదు బదిలీ’ పథకాలను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నది.
నోబెల్ విజేతలైన ఆర్థికవేత్తలు అభిజిత్ బెనర్జీ, ఎస్తేర్డుఫ్లో తమ గ్రంథం, ‘పూర్ ఎకనామిక్స్: రాడికల్ రీ థింకింగ్ ఆఫ్ ది వే టు ఫైట్ గ్లోబల్ పావర్టీ’లో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పేదరికాన్ని అధిగమించడానికి, పేద, వెనుకబడిన సమూహాలకు సాధికారత కల్పించడానికి ‘ప్రత్యక్ష నగదు బదిలీ’ వంటి కార్యక్రమాలను సూచించారు. ప్రత్యక్ష నగదు బదిలీ కార్యక్రమాలు మొదట 1980లో బ్రెజిల్లో మొదలైనాయి. 1990ల నుంచి ఇతర లాటిన్ అమెరికన్ దేశాలు, కరేబియన్ దేశాలు, ఆఫ్రికా దేశాలకు వ్యాపించాయి. ఆ తర్వాత ఇండోనేషియా, భారత్ వంటి ఆసియా దేశాలు కూడా వీటిని ప్రవేశపెట్టాయి.
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ‘దళిత బంధు’ను ఈ చారిత్రక నేపథ్యంలో అర్థం చేసుకోవచ్చు. ఇది దేశంలోనే అతిపెద్ద నగదు బదిలీ పథకం. ఇప్పటికే హుజూరాబాద్లో మొదలైన ‘దళితబంధు’ను రాష్ట్రంలోని 70 లక్షల కుటుంబాలకు వర్తింపచేయనున్నారు. పథకం అమలుకు రూ.1.7 లక్షల కోట్ల బడ్జెట్ను కేటాయించనున్న ట్లు ప్రభుత్వం ప్రకటించింది.
‘దళిత బంధు’ దేశంలోనే అత్యంత ముఖ్యమైన నగదు బదిలీ పథకం. ప్రతి లబ్ధిదారు కుటుంబానికి రూ.10 లక్షలు అందించడంతోపాటు ఎన్నో విశిష్టతలను కలిగి ఉంది. మరి, ఇటువంటి పథకం దళితులకు మాత్రమే ఎందుకు? రాష్ట్రంలో, దేశం లో అత్యంత నిరుపేద వర్గాలుగా దళితులు ఉన్న ట్లు పలు సర్వేలు నిరూపించాయి. దళితులనే ప్రత్యేకలక్ష్యంగా పెట్టుకుని చేపట్టిన మూడు ఎకరాల భూమి పంపిణీ పథకం, గ్రామాల్లో భూము లు లభ్యం కాకపోవడం, భూములకు సంబంధిం చిన ఇతర సంక్లిష్ట సమస్యలు కారణంగా విస్తృతంగా అమలు జరగలేదు. మరోవైపు, రాష్ట్రంలో భారీఎత్తున అమలవుతున్న మరో ప్రత్యక్ష నగదు బదిలీ కార్యక్రమం ‘రైతుబంధు‘.. దళితులు చారిత్రకంగా భూమిలేని వ్యవసాయ కూలీలుగా ఉండటం వల్ల వారికి అంతగా లబ్ధిని చేకూర్చలేక పోయింది. అందువల్ల, ప్రస్తుత ‘దళిత బంధు’ పథకం ఆవశ్యకత ఏర్పడిందని భావించవచ్చు. దళిత కుటుంబాలను సాధికారం చేయడం, వారిలో వ్యవస్థాపకత్వాన్ని నెలకొల్పడం అనే లక్ష్యాలను సాధించడంలో ‘దళిత బంధు’ ఏవిధంగా విజయాలను సాధించగలదు? ఎన్నికల దృక్పథాలకు అతీతంగా ఈ పథకాన్ని అమలు చేయడం, అమలు ప్రక్రియలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం, దాని కార్యనిర్వాహక సిబ్బంది, దీర్ఘకాలిక రాజకీయ సంకల్పంపై ఇది ఆధారపడి ఉంటుంది. అటు మార్కెట్ నుంచి, ఇటు సమాజం వైపు నుంచి కూడా సమ్మిళిత తత్వంతో కూడిన సహకారం అవసరం.
ప్రపంచవ్యాప్తంగా పేదరిక వలయాన్ని విచ్ఛిన్నం చేయడానికి, సామాజిక సమానత్వం, మానవ మూలధన పెంపుదలను ప్రోత్సాహించడానికి ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలు ఉపయోగపడుతున్నాయి. ఇవి సమాజంలో నిర్మాణాత్మక స్థిరత్వాన్ని పెంపొందించే దిశగా ఉద్దేశించబడినవి. ఈ లక్షణాలు దేశంలోని ఇటువంటి పథకాలకు, అదేవిధంగా ‘దళిత బంధు’కు కూడా వర్తిస్తాయి. అయితే, భారతీయ సందర్భాలు సంక్లిష్ట సమస్యలను ప్రదర్శిస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ, ఉప పట్టణ ప్రాంతాల్లో దళిత కుటుంబాల ద్వారా వ్యవస్థాపక పరమైన, వాణిజ్య పరమైన పనులు చేపట్టడం, వాటిలో సఫలత పొందటం అంత సులభం కావడం లేదు. కులవివక్ష ఒక అవరోధంగా నిలుస్తున్నది. అయితే, దీనిని అధిగమించి విజయాలను సాధించడం కూడా మనం చూస్తున్నాం. ఇటువంటి సందర్భాలు దళితులలో కొంతమేరకు జరుగుతున్న ఆర్థిక, వ్యవస్థాపక అభివృద్ధులు ప్రజల్లో ఎప్పటినుంచో ఉంటున్న వివక్షాపూరిత వైఖరుల్లో మార్పులకు దారులు వేస్తున్నాయి. ఇంతవరకు వెనకకు నెట్టివేయబడిన వర్గాలు సమాజంలో తమకంటూ సమ్మిళిత చోటులను రూపొందించుకోవడం కూడా జరుగుతున్నది.
‘దళిత బంధు’ లబ్ధిదారులు ఎంచుకొనే రంగాలలో ఇప్పటికే ఉన్న పోటీ వారికి గట్టి సవాల్గా మారవచ్చు. ఇన్పుట్ అంటే డబ్బు బదిలీ, సరఫరా వైపు నుంచి కాకుండా డిమాండ్ వైపు నుంచి అడ్డంకులు ఎదురుకావచ్చు. కాబట్టి, మూలధనం సమర్థంగా వినియోగమయ్యేలా, అవుట్పుట్ (ఫలితాలను) చూపించడం అవసరం.
ప్రభుత్వం భవిష్యత్తులో షెడ్యులు కులాలతో సమానంగా పేదరికాన్ని అనుభవిస్తున్న రాష్ట్రంలోని సంచార, అర్ధ సంచార, డీనోటిఫైడ్ తెగలు, మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలను (ఎంబీసీ) కూడా పరిగణలోనికి తీసుకొని ఇదే తరహ పథకాలను విస్తరిస్తే బాగుంటుంది.
ఇట్లాంటి పథకాలన్నీ పరిణామశీల లక్షణాలు కలిగినవి. కాబట్టి వీటి అమలు, అభివృద్ధి ప్రక్రియలను, ఎదురయ్యే సమస్యలను అనునిత్యం నిశితంగా పరిశీలించడం అవసరం. ఇతర పథకాలు, ప్రాజెక్టుల్లో ఉన్నట్లుగానే ‘దళిత బంధు’ వంటి ప్రత్యక్ష నగదు బదిలీ పథకంలో కూడా అవకాశాలుంటాయి, అవరోధాలూ ఎదురవుతాయి. కాబట్టి ‘దళిత బంధు’ను సమర్థవంతంగా అమలు చేయడానికి ఒక క్రమబద్ధమైన, నియమానుసారమైన నిర్మాణాత్మక అంచనాలు, అంటే ఖర్చులు, లాభాలు, అమలు ప్రక్రియలో ఉత్పన్నమయ్యే సమస్యలు, వాటిని పరిష్కరించడానికి ఉపయోగించే యంత్రాంగాలు మొదలైనవి.. రూపొందించి పకడ్బందీగా ముందుకు సాగడం అవసరం.
-చెన్న బసవయ్య మడపతి
(వ్యాసకర్త: విశ్రాంత రాజనీతి శాస్త్ర ఆచార్యులు, ఉస్మానియా విశ్వవిద్యాలయం)