ఆచారాలే వారసత్వ సంమన ఆచారాలు, సంప్రదాయాలు పూర్వ కాలం నుంచి వారసత్వంగా వస్తున్నవి. వీటిని మనమూ మన ముందుతరాలకు అందించాల్సిన అవసరం ఉన్నది. నేటికీ అనేక ఆచారాలు పదిలంగా ఉన్నాయంటే ఆ గొప్పతనం వాటిని కాపాడిన పూర్వీకులదే. అలాంటి వాటిలో అంతిమయాత్ర లేదా మహాప్రస్థానం ఒకటి. ప్రపంచ వారసత్వ వారోత్సవాలను పురస్కరించుకొని వేర్వేలు ప్రాంతాల్లో అంతిమయాత్రలు జరిగే తీరులో ఉన్న వ్యత్యాసాలను చరిత్ర పరిశోధకులు రెడ్డి రత్నాకర్ రెడ్డి ఈ వ్యాసంలో సమగ్రంగా వివరించారు.
జనగామ జిల్లా వడ్లకొండలో రాతి శవ పేటిక లేకుండా బృహత్ బూడిద సమాధి వెలుగుచూసింది. ఇందులో శవ దహనానంతరం ఎముకలు సేకరించి కుండలో పెట్టి కాల్చడం విశేషం. కరీంనగర్ జిల్లాలో కొన్ని కుటుంబాలలో నేటికీ రెండవసారి ఎముకలను కాల్చడం కొనసాగుతున్నది. శవాన్ని శ్మశాన వాటిక వరకు ఊరేగింపుగా తీసుకొని వెళ్లటం మనకు తెలిసిందే.ఈ శవయాత్ర సంస్కృతి శిలాయుగం నుంచి కొనసాగుతూ వస్తున్నది. మెగాలిథిక్ కాలం నాటి తెగలలో మరణించిన వ్యక్తిని ఊరేగింపుగా ఎలా తీసుకువెళ్తారో తెలిపే ఒక చిత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా ఇడుపుల పాయ వద్ద ఉన్న ఒక గుట్టకు కనిపించింది. ఆ చిత్రంలో శవ యాత్రలో పాల్గొన్న కొందరు వ్యక్తుల చేతుల్లో కర్రలు ఉన్నాయి. అంటే వారు దారి పొడవునా వారికి కనిపించే కర్రలను పట్టుకొని వెళ్లేవారని తెలుస్తున్నది. వాటిని క్రూర మృగాలను భయపెట్టటానికి, వాటితో గొయ్యి తవ్వడానికి లేదా పెద్ద పెద్ద రాళ్లను దొర్లించడానికి ఉపయోగించి ఉండవచ్చు. దహన సంస్కృతి మొదలయిన తర్వాత వారు తీసుకెళ్లిన కర్రలను పేర్చి శవాన్ని కాల్చి ఉంటారని చెప్పవచ్చు.ఆ ఆచారం నేటికీ కొన్ని ప్రాంతాలలో కనిపిస్తున్నది .
మహబూబాబాద్ (మరిపెడ మండలం) జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఎవరైనా మరణిస్తే ఆ విషయాన్ని ముందుగా డప్పు చాటింపు వేస్తారు. తర్వాత గ్రామంలోఎడ్లబండి లేదా ట్రాక్టర్ బయలుదేరుతుం ది. ఆ సమయంలో గ్రామస్థులు ప్రతి ఇంటి నుంచి ఒక కట్టె తెచ్చి అందులో వేస్తుంటారు. అలా సేకరించిన కట్టెలతోనే శవాన్ని దహనం చేస్తారు. మారుమూల బంజారా సంస్కృతిలో ఎవరైనా మరణిస్తే ఒకరిద్దరు ఇల్లిల్లూ తిరిగి కట్టెలు సేకరించి మోపు గట్టుకొని శవ దహనం చేసే చోటుకు చేర్చడం జరుగుతున్నది. నాగర్ కర్నూలు జిల్లా దట్టమైన నల్లమల అడవుల్లోని ఫరహాబాద్, అప్పాపూర్ మేడిమల్కల, సంగడి గుండాల,ఈర్లపెంట, పందిబొర్రే మొదలైన గిరిజన ప్రాంతాల్లో ఒంటి కట్టె సంస్కృతి అమల్లో ఉన్నది. అంటే ఒకే ఒక పచ్చి కట్టెకు పార్థివ శరీరాన్ని కట్టి మోసుకు వెళుతారు .
నగరాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ముందే బొంద తవ్వితే, దట్టమైన అడవి ప్రాంతాల్లో శవాన్ని బొంద పెట్టే చోట పాడే దింపి, అప్పుడే శవం పొడవును కొలిచి అంతే పొడవు బొంద తవ్వి పూడ్చి పెడుతారు. అక్కడికి వచ్చిన వారంతా సమీపంలో ఉన్న రాళ్లను తెచ్చి పూడ్చి పెట్టిన మట్టి దిబ్బ చుట్టూ పెడుతారు. ఇది బృహత్ శిలాయుగం నాటి రాక్షస గూళ్ల సంస్కృతిని పోలి ఉంటుంది. ములుగు , జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో కాట్నం పేర్చి, సమీపంలోని కర్రలతో మంట వేస్తారు. రక్త సంబంధీకుడు తల కొరివి పెట్టిన తరువాత అంతిమ యాత్రలో పాల్గొన్న వారం తా తలో ఒక మండే కర్రను తీసుకొని చితిపై వేస్తారు. ఇది అంతా ఒకే కుటుంబంగా ఉన్నప్పటి పూర్వ సంస్కృతికి దగ్గరగా ఉన్నది. ఆదిలాబాద్ జిల్లాలో నిప్పు పెట్టే వ్యక్తితో పాటూ పాలోల్లు (ఒకే వంశ కుటుంబానికి చెందినవారు) నిప్పు ఉన్న కర్రను చితిపై వేస్తారు. మిగతా వారు ఎండు కట్టెలు వేస్తారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఒక ఐదుగురు నిప్పు ఉన్న కర్రను చితిపై వేశాక మిగిలిన వారంతా ఎండు కర్రలను వేస్తారు. ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాల్లో బృహత్ శిలా యుగం నాటి సమాధుల వద్ద కనిపించే నిలువు రాళ్ల (menhirs) సంస్కృతి నేటికీ కొనసాగుతున్నది.
గంధపు చెక్కలతో శవాన్ని కాల్చడం అనాదిగా ఉన్నది. అడవులు కనుమరుగయ్యాక ఒక గంధపు చెక్క వేయడం ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో లేదా కొన్ని సంప న్న వర్గాల్లో కనిపిస్తుంది. గంగానదిలో శవాలను వదిలేయడం తెలిసిందే. అయితే ఇప్పుడాచారం కొంతవరకు తగ్గిందనే చెప్పాలి. గతంలో వలే శవాలను వదిలేయడానికి బదులుగా శవాన్ని దహ నం చేసిన అనంతరం ఎముకలను సేకరించి నదుల్లో కలపడం కొనసాగుతున్నది.
పూర్వ కాలంలో మరణించాడనుకున్న వ్యక్తులు చితిపై నుంచి కూడా లేచి వచ్చిన ఉదంతాలు అనేకం విని ఉంటాం.అందుకే దింపుడు కల్లం చేసి చెవిలో పేరు పెట్టి లే.. లే అని పిలుస్తారు. పూర్వం వైద్యం అందుబాటులో లేక పోవడం వల్ల వ్యక్తులు అనారోగ్యంతో చలనం లేకుండా పడిఉండేవారు. వారు మరణించినట్టు బావించి వారిని దహనానికి తీసుకెళ్లేవారు. అలా తీసుకెళ్లడానికి ముందు దింపుడు కల్లం చేసేవారు. అయితే నేడు పోస్ట్ మార్టం చేసిన శవానికి సైతం దింపుడు కల్లం చేస్తుండడం పరిపాటి అయిం ది. దాదాపుగా అన్ని చోట్ల దింపుడు కల్లం సంస్కృతి ఉన్నది. మరణానంతరం ఆత్మలు పక్షుల రూపంలో వస్తాయన్న నమ్మకంతో పక్షికి పెట్టడం చాలా చోట్లా ఉన్నది. వీటిలో శాస్త్రీయ దృక్పథం లేనప్పటికీ వారసత్వ విలువలుగా భావించి కొద్దిపాటి మార్పులతో శిలా యుగం నాటి సంస్కృతినే కొనసాగిస్తున్నారు.
గతంలో ఒక వ్యక్తి మరణిస్తే ఊరంతా కలసి సాగనంపేది. ఇప్పుడు పక్కింట్లో మనిషి మరణించినా చూడటానికి కూడా వెళ్ళని రోజులు దాపురించాయి. సోషల్ మీడియా పుణ్యమా అని మరణించిన వ్యక్తి ఎవరో తెలియకున్నా RIP అని కామెంట్ పెట్టడం సర్వ సాధారణమై పోయింది. ఈ పరి స్థితి మారాలి. మన పూర్వీకుల జ్ఞాన సంపదను, త్యాగాలను పుణికి పుచ్చుకొని, మానవీయ విలువలు కొరవడకుండా జీవించడం మన ప్రాథమ్యం కావాలి. వారసత్వ వారోత్సవాలు అందించే సందేశం ఇదే.
రెడ్డి రత్నాకర్ రెడ్డి
98486 25060