‘పార్టీ షోకాజ్ నోటీసు ఇస్తే చెత్తబుట్టలో పడేశా. మునుగోడులో కాంగ్రెస్ గెలువదు, నా సోదరున్ని గెలిపించాలని ముందే చెప్పా. కాంగ్రెస్ పార్టీలో కొనసాగేది, లేనిది ఇప్పుడే చెప్పలేను. టీపీసీసీ అధ్యక్షుడిని తొలగించాలి. అది జరిగే వరకు గాంధీభవన్ మెట్లు ఎక్కనని ముందే చెప్పాను. ఆయన ఉన్నంతకాలం తెలంగాణలో కాంగ్రెస్కు భవిష్యత్ లేదన్నాను. అందులో తప్పేముంది?. తాజాగా వేసిన టీపీసీసీ కమిటీలను కూడా నేను గుర్తించడం లేదు. పొలిటికల్ అఫైర్స్ కమిటీ నుంచి నన్ను తొలగించినా బాధపడను. ఎందుకంటే అందులో ఐదారుసార్లు ఓడిపోయిన వారున్నారు. వారితో కలిసి కూర్చోవడమే ఇష్టం లేనప్పుడు, కలిసి ఎలా పనిచేస్తా? రాహుల్గాంధీ జోడో యాత్రలోనే పాల్గొనలేదు. గాంధీభవన్కు రమ్మని రాష్ట్ర కొత్త ఇంచార్జీ మాణిక్రావు ఠాక్రే పిలిచినా వెళ్లలేదు. బోయిన్పల్లిలో జరిగిన శిక్షణా శిబిరానికి వెళ్లమని ఖర్గే ఫోన్ చేసినా వెళ్లలేదు. ప్రధాని మోదీ, అమిత్ షాను ఎందుకు కలిశావు అని అడగడానికి వాళ్లెవరు? మూసీ నది ప్రక్షాళన అంశంపై చర్చించడానికి అప్పుడప్పుడు ఢిల్లీకి వెళ్లి వస్తుంటా. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎవరినైనా వెళ్లి కలుస్తా. ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు. అంతెందుకు, మా జాతీయ అధ్యక్షుడు ఖర్గే ఎమన్నారో తెలుసా? అవేవీ పట్టించుకోకు మీ పని మీరు చేసుకోమన్నారు’ -(మీడియాతో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి).
చైనా మాంజాతో పతంగులు ఎగురవేయడం వల్ల పక్షుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని అటవీశాఖ నిషేధించింది. ఈ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ‘పతంగులే కాదు, పక్షులు ఎగరవద్దా?’ అన్న నినాదంతో అటవీశాఖ ప్రచారం ప్రారంభించింది. విషయం ఏదైనా ఖండించడమే పనిగా పెట్టుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ‘పతంగులు ఎగరవేయడంపై నిషేధం విధించడం’ అంటూ తీవ్రంగా ఖండించారు. ‘వరుసగా ఉద్యోగ నియామకాల ప్రకటనలు రిలీజు చేయడం ద్వారా బీజేపీకి యువతను దూరం చేస్తున్నారు. రిజర్వేషన్ల శాతం పెంచి గిరిజనులను దూరం చేస్తున్నారు? రైతుబంధు ఇచ్చి రైతులను దూరం చేస్తున్నారు. ఆసరా ఇచ్చి వృద్ధులను దూరం చేస్తున్నారు. అందరినీ దూరం చేస్తే బీజేపీ అధికారంలోకి ఎలా వస్తుంది?’ అని బండి సంజయ్ వేసిన ప్రశ్న.. అచ్చం అటవీశాఖ నినాదాన్ని మార్చి చెప్పినట్లుగా ‘అధికారం మీకేనా? మాకు వద్దా?’ అన్నట్టుగా లేదూ!
వేదిక ఏదైనా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఈ మధ్యకాలంలో పార్టీ సీనియర్ నేత జానారెడ్డిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. పార్టీ కొత్త ఇంచార్జీ మాణిక్రావు ఠాక్రే గతంలో మహారాష్ట్ర హోంమంత్రిగా ఎంత పేరు తెచ్చుకున్నారో, ఇక్కడ వైఎస్ హయాం లో హోంమంత్రిగా జానారెడ్డి కూడా అంతే పేరు తెచ్చుకున్నారని రేవంత్రెడ్డి కొనియాడారు. పెద్దలు జానారెడ్డి సూచనలు, సలహాలతో పార్టీని మరింత బలోపేతం చేయడానికి, తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తానని ప్రతి సమావేశంలో చెప్తున్నారు. ఉన్నపళంగా జానారెడ్డి భజన, జపం చేయడం వెనుక మతలబు ఏమిటని రాజకీయవర్గాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి బ్రదర్స్ వ్యతిరేక వర్గానికి జానారెడ్డి నాయకుడు కావడంతో శత్రువు శత్రువు మిత్రుడైనట్టు జానారెడ్డికి దగ్గర కావడానికి రేవంత్ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.
– వెల్జాల