గత శుక్రవారం మేడిగడ్డకు వెళ్తుంటే మిత్రుల మధ్య వలపోతలవరదే పారింది. నిన్నటి కన్నీళ్లు, నేటి సాగునీళ్ల నడుమ తెలంగాణ నేలపై పారిన నెత్తురు, పడిన తండ్లాట వొడువని ముచ్చటగా మారింది. ఒకవేళ కేసీఆర్ గులాబీ జెండా ఎత్తకుంటే తెలంగాణలో ఏం జరిగి ఉండేదో ఊహించుకొని చర్చిస్తుంటే అందరికీ ఒళ్లు జలదరించింది. ఆ జెండా నీడన జన విముక్తికి జరిగిన మహా సమరం, నీళ్లనే నిప్పుల జనపాతంగా మలిచి మర్లబడేలా మండించిన కేసీఆర్ సంకల్ప తీరు ప్రజాస్వామ్య రాజకీయ చరిత్రలో మరువలేనిది. నిందల నిప్పుల దారిలో నడిచి సాగడం ఉగ్గునాడే అలవడిన రాజకీయ పార్టీ బీఆర్ఎస్. నేడు కూడా మళ్లీ తెలంగాణకు మండేలా లాగా అండగా నిలబడేందుకు ఎంతదూరమైన వెళ్లి తీరుతుంది. అది తెలిసో, తెలియకో కాంగ్రెస్ సర్కార్ కిరీటం తెచ్చిన పొగరుతో నీటిపై నట విన్యాసానికి నడుం బిగించింది.
గ్రామాల్లో జనం వాడే ‘పటేలొచ్చి మళ్లీ మొదలుపెట్టే’ అనే సామెతలాగా నీటిని గోకి మానిపోయిన గాయాలను రేవంత్ సర్కార్ మళ్లీ రేపింది. రాగానే కృష్ణా ట్రిబ్యునల్-2 ముందు కాలుజారిపడ్డ కాంగ్రెస్ సర్కార్, మేడిగడ్డకు మలినం పూసే కుట్రలు పన్ని, తనే కకావికలమైపోతున్నది. అదిచాలక మేడిగడ్డ నుంచి మళ్లీ పాలమూరుకు, మాన్పుకొన్న మరో రాచపుండును చర్చకు పెట్టి అద్దంలో తన అందవికారాన్ని తానే చూసుకునే పనిని హస్తం పార్టీ చేసింది. మేడిగడ్డపై బీఆర్ఎస్ సత్యాన్వేషణకు పయనమైతే, దాని నుంచి జనం దృష్టిని మళ్లించేందుకు రేవంత్ వందిమాగాధులు పాలమూరుకు రంధ్రాన్వేషణకు వెళ్లడం హాస్యాస్పదమైంది. పీఠమెక్కిన మొదటి నిమిషం నుంచే కేసీఆర్ ప్రభుత్వ చారిత్రక పనులపై విషం కక్కడమే కార్యక్రమంగా పెట్టుకొని హస్తం పార్టీ తికమకపడుతున్నది. ఎదిగినాక వాలినవారికి, ఎద గాయాలు మాన్పడానికి ఎన్ని అవస్థలు పడాల్సి ఉంటుందో అర్థమైతుందని ఆశించలేం కదా! రాష్ట్ర ఏర్పాటు నాటికి రైతుల ఆత్మహత్యలు ఆపడమనే తక్షణ కర్తవ్యం, వలసల బతుకులకు చరమగీతం పాడాలనే మానవీయ తపన, తడి ఎండి తంగేడుపూల చెట్లు కూడా మొలవని ఎడారులుగా మారుతున్న బీళ్లకు మళ్లీ విత్తు పొత్తును కుదుర్చాలనే కసి కలగలిసి గులాబీ ప్రభుత్వాన్ని సాహసోపేత పరుగుకు పురికొల్పితేనే నీటి పారుదల, సాగు రంగంలో సూర్యోదయం సాధ్యమైంది. ఎన్నో చర్యల సమ్మిళిత ఫలితంగానే 2 కోట్ల 18 లక్షల టన్నుల వరి ధాన్యం ఉత్పత్తితో దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణ అవతరించింది. వరి ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్ రాష్ట్రంతో పోటీపడే స్థాయికి రాష్ట్రం ఎదిగింది. రంధ్రాన్వేషకులు రాగలరని బెదిరి కాళేశ్వరం కట్టకున్నా, పాలమూరును పరుగులు పెట్టించకున్నా, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయకున్నా, కొత్త లిఫ్ట్లు నిర్మించకున్నా, నేటికీ తెలంగాణ కన్నీళ్లతోనే కడుపు నింపుకొనే దుస్థితినే ఎదుర్కొనేది.
మంచి చేయాలని చేపట్టిన మహా నిర్మాణంలో ఏదో మూలన, ఏదో కారణాన లోపం ఏర్పడితే, తక్షణమే సరిదిద్దేపని చేయకుండా, మహా నిర్మాణమే నేల పాలు చేయాలనే కాంగ్రెస్ సర్కార్ కుట్రలు, బుద్ధి జీవులందరిలో ఏహ్యభావం కలిగించాయి. అన్నారం సభలో కేటీఆర్ వివరించినట్టుగా 1.6 కిలోమీటర్ల పొడవైన మేడిగడ్డ బ్యారేజీలో 50 మీటర్ల పరిధిలో మాత్రమే ఏర్పడిన సమస్యను తక్షణమే పునరుద్ధరించి బ్రహ్మాండంగా వినియోగించుకోవచ్చని నిపుణులు చెప్తుంటే రేవంత్ సర్కార్ మాత్రం రగడ కోసం నీళ్లలో విషం కలిపే గుణమే బయటేసుకుంటున్నది. నాతో పాటు మిత్రులందరం సమస్య తలెత్తిన 20వ పిల్లర్ను పరిశీలిస్తుండగానే, జల నిపుణులు వి.ప్రకాష్, రిటైర్డ్ ఇరిగేషన్ ఈఏన్సీ వెంకటేష్తో పాటు అక్కడ పరిశీలనకు వచ్చారు. కేటీఆర్ బృందం మేడిగడ్డ నుంచి వెళ్లిన తర్వాత చాలాసేపు అనేక కోణాల్లో సాంకేతిక అంశాల్లో నిపుణులైన వారితో సమస్యపై లోతైన చర్చ నడిచింది. బహుళార్థక ప్రయోజనాల కోసం నిర్మించిన భారీ సాగునీటి ప్రాజెక్టులో ఏ సమస్య తలెత్తినా పరిష్కరించుకునే సాంకేతికత అందుబాటులో ఉంటే, ప్రభుత్వం ఆ దిశలో దృష్టి నిలపకుండా, నిందలను నిజమని నమ్మించేందుకే సర్వశక్తులు ఒడ్డటం విడ్డూరమనేదే వారి అభిప్రాయం కూడా. కేసీఆర్ను ఏసుక్రీస్తులా శిలువకు వేలాడదీయాలనే వికృత తలంపుతో, రైతన్నల కామధేనువైన కాళేశ్వరాన్నే బలికోరుతున్న కాంగ్రెస్ సర్కార్ పిశాచి ప్రభుత్వంగా మిగిలిపోదా? 15 లక్షలకు పైగా పాత ఆయకట్టు స్థిరీకరణతో పాటు, 3.04 లక్షల కొత్త ఆయకట్టును సాకారం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టును పగకు పణంగా పెడుతున్నారు. తరాలకు ఆదెరువు కోసం నిర్మించిన ప్రాజెక్టును వర్తమాన ప్రయోజనపు లెక్కల్లో మాత్రమే కొలవడం నేరపూరిత వైఖరే కదా? మొక్కజొన్నలు పండించే చోట పామాయిల్ లాంటి వాణిజ్య పంటల సాగు వైపు రైతాంగం అడుగులు పడుతున్నాయి. ఇంకా రాబోయే కాలంలో ఏ రకమైన నూతన లాభదాయక పంటల సాగు సాకారమవుతుందో ఊహించగలమా? రిజర్వాయర్లు, చెరువుల కేంద్రంగా మత్స్య పరిశ్రమే కాదు, పర్యాటకమూ ఉపాధి కేంద్రంగా వర్ధిల్లుతుంది.
తెలంగాణ తరాల తలంపుతో తలపెట్టిన కాళేశ్వరాన్ని, కాంగ్రెస్ కేవలం ఓట్ల కుట్రకు లక్ష్యంగా చేసుకోవడం అందరికీ ఆవేదన కలిగిస్తున్నది. రాష్ట్రం, దేశం, ప్రపంచంలో అనేక సాగునీటి ప్రాజెక్టుల్లో నిర్మాణానంతర సమస్యలు తలెత్తాయి. భవిష్యత్తులోనూ వివిధ కారణాల వల్ల వస్తుంటాయి. వాటిని పాలకులు సానుకూల ధోరణితో సరిదిద్దాలే కానీ, పగ కోసం సాగదీసి, సమాధి కావాలని ఆశించడం పరిపాలనా క్రూరత్వమే అవుతుంది.
ఇక కాళేశ్వరంపై సర్కార్ కట్టుకథల లోగుట్టును విప్పి చూపేందుకు బీఆర్ఎస్ నేతలు బయల్దేరిన నాడే కాంగ్రెస్ మరో కపటత్వం ప్రదర్శించింది. దశాబ్దాల పాటు పాపాల భైరవుడిలా, పాలమూరు నెత్తిన శాపంగా మారిన తన చరిత్రను మరిచి, ఇల్లలుకుతూ తన పేరును తనే మరిచిపోయిన ఈగలా పాలమూరు ప్రాజెక్టు సందర్శనకు బైలెల్లింది. ఇది ఇంకా నవ్వులపాలయ్యే పని కదా? నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అంటూ ఛలో పాలమూరు-రంగారెడ్డి పేరిట హస్తాదులు పొలిటికల్ బైలాటకు బయల్దేరిండ్రు. కృష్ణా జలాల వాటా, పోతిరెడ్డిపాడు పాట పాడి కేసీఆర్ ప్రభుత్వం తట్టెడు మట్టి ఎత్తలేదంటూ మాయమాటల మహా ప్రదర్శన చేశారు. మనసే లేని మోసగాళ్లకు మంత్రదండం దొరికినట్టు అధికారం దక్కగానే అబద్ధాలకు జీవం పోసే తపస్సుకు తలపూనారు. పాతగోడలు, పందిరిగుంజలా పాలమూరును మార్చి.. వలసలకు, రుణాలకు కుటుంబాలను గాసం కుదిర్చిందే కాంగ్రెస్ ప్రభుత్వాలు. నీటి దోపిడీకి హారతులు, రైతుల చావులకు పాడెలు పట్టిందే హస్తం పాలకులు. 1977 అక్టోబర్ 28న కుదిరిన ఒప్పందం మేరకు చెన్నై తాగునీటి అవసరాలకు 15 టీఎంసీలు తరలించేందుకు, 1,500 క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న లైనింగ్ కాలువ మాత్రమే నిర్మించాలి. కానీ, 11,150 క్యూసెక్కుల సామర్థ్యంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీని నిర్మించి, దాన్ని 55,150 క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచుకొని జలదోపిడీకి కుట్రలు చేస్తే, తిరగబడి పోరాడింది, కేంద్ర సర్కార్, బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ ముందు సమరం చేసింది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ సర్కార్. ఉమ్మడి రాష్ట్రంలో సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా జరిగిన కృష్ణా నీటి కేటాయింపుల నష్టాన్ని సరిచేసి, పరీవాహకం, ఆయకట్టును లెక్కలోకి తీసుకొని తెలంగాణకు 500 టీఎంసీలు కేటాయించాలని పోరు చేసింది, న్యాయస్థానాల్లో కొట్లాడింది, కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుకు అహోరాత్రులు శ్రమించింది గులాబీ పార్టీ, కేసీఆర్ సర్కారే కదా! ఈ సత్యాలకు మసిపూసి కనుమరుగు చేయగలననుకోవడం కాంగ్రెస్ అవివేకం. ఆర్డీఎస్ నీటి వాటా హక్కుల కోసం కలబడ్డది, 87,500 ఎకరాలకు 15.9 టీఎంసీల నీటి కోసం అలుపెరగని పోరు చేసింది కేసీఆర్ కాక, రాహుల్గాంధీనా? సమైక్యాంధ్రలో సాగునీటి ప్రాజెక్టులను శిలాఫలకాలకు వేలాడదీసి, ఉమ్మడి పాలమూరు జిల్లాను బీదరికానికి బలి పశువుగా వదిలేసిందే కాంగ్రెస్ ప్రభుత్వాలు కదా! వంద ఆవులు తిన్న రాబందు, అరగక ఆరా‘ధనా’లాపన అందుకున్నట్టుగా హస్తం పార్టీ నేతలు పాలమూరు ఎత్తిపోతలపై ప్రేమ జపం చేస్తే నమ్మేస్తారా? వలసకూలీల జిల్లాగా ఘనతికెక్కి, అంబలి కేంద్రాల అడ్డాగా మారిన ఉమ్మడి పాలమూరులో రాష్ట్ర ఏర్పాటు నాటికి 2 లక్షల ఎకరాలకు, ఒక్క పంటకు కూడా నీరందని దుస్థితి. పల్లేర్ల వనంలా, పాలబుగ్గల జీతగాళ్ల నిలయంగా మారిన పాలమూరు వలస పక్షి అయి ఎంత వేదనపడ్డదో అందరికీ తెలుసు.
కానీ, కేసీఆర్ సర్కార్ అధికారంలోకి రాగానే మానవీయ మిషన్ కాకతీయ పథకం ద్వారా పాడుబడ్డ బావులుగా మారిన పాలమూరు చెరువులను పునర్నిర్మాణం చేసి, వేలాది ఎకరాలకు సాగునీరు సమకూర్చింది. ఒక్క వనపర్తి జిల్లాలోనే 64 వాగులపై రూ.500 కోట్లతో చెక్డ్యాంలు నిర్మించడం వల్ల లక్షా 90 వేల నూతన ఆయకట్టు సాగులోకి వచ్చింది. దీంతో పాటు రాష్ట్ర ఆవిర్భావానికి మునుపటి పాలకుల వివక్షకు ఆనవాళ్లయిన పెండింగ్ ప్రాజెక్టులను కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయడమే కాదు, నీటి నిల్వ సామర్థ్యం పెంచి, రిజర్వాయర్లు నిర్మించి ఆయకట్టు ఎన్నో రెట్లు పెంచింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ మానవీయ చర్యల వల్లనే 2014 నాటికి కేవలం 2 వేల 300 ఎకరాలకు ఒక్క పంటకు నీరందే నెట్టెంపాడు ద్వారా నేడు 2 లక్షల ఎకరాలకు సాగు నీరు పారుతున్నది. 13 వేల ఎకరాలకే సాగునీరు అందిస్తున్న కల్వకుర్తి లిఫ్ట్కు కొత్త రూపం ఇవ్వడం వల్లనే, ఆ ఎత్తిపోతల పథకం కింద నేడు 3.50 లక్షల ఎకరాలకు రెండు పంటలకు సరిపడా సాగునీరు అందుతున్నది. భీమా లిఫ్ట్ పెండింగ్ పనులు పూర్తిచేయడం ద్వారా 2.02 లక్షలు, కోయిల్సాగర్ సరిచేయడం ద్వారా 50 వేల ఎకరాలకు ఖరీఫ్, రబీ సీజన్లకు కావాల్సిన సాగు నీరు సమకూరుతున్నది.
శాశ్వత కరువు విముక్తి వరప్రదాయినిగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రూపొందించి, సముద్రమట్టానికి 500 మీటర్ల ఎత్తున నిర్మించి, ఉమ్మడి జిల్లాలో కొత్తగా దాదాపు 7 లక్షల ఎకరాలకు రెండు పంటలకు సాగునీరు అందించేందుకు కేసీఆర్ సర్కార్ ఎన్ని ఇక్కట్లను ఎదుర్కొన్నదో? భూసేకరణకు ఇబ్బందులు, కోర్టు కేసులు తదితర అనేక అవాంతరాలు కల్పించిన కాంగ్రెస్.. పాలమూరు ఎత్తిపోతల పనులకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించింది. అయినా 80 శాతానికి పైగా పనులు పూర్తిచేసి నార్లాపూర్ పంపునూ దుంకించింది. భౌగోళికంగా సంక్లిష్టమైన, అత్యంత ఎత్తున ఉండే ఉమామహేశ్వరం వద్ద ఎత్తిపోతల నిర్మించి, నల్లమల అంచులకూ సాగు నీరు పారించే లక్ష్యంతో శ్రమించింది కేసీఆర్ ప్రభుత్వం.
దానివల్లనే 2014 నాటికి 2 లక్షల ఎకరాలకూ సాగు నీరందని పాలమూరు జిల్లాలో 2023 నాటికీ 16 లక్షల ఎకరాలకు రెండు పంటలకూ నీరు పారింది. నీరే కాదు, రైతుబంధు, ఉచిత విద్యుత్తు పథకాలూ పాలమూరు రైతాంగానికి కొండంత అండగా మారాయి. సాగు, వ్యవసాయరంగ అభివృద్ధి పనులే కాదు, సంక్షేమ పథకాలూ వలసల జిల్లా వేగంగా కోలుకొని, వెలుగుల జీవితం వైపు నడిచేందుకు దోహదపడ్డాయి. ఈ నిజాలను అధికార కరవాలంతో వధించాలని కాంగ్రెస్ పాలకులు కుయుక్తులు పన్నితే, కాలమే వారికి సమాధానం చెప్తుంది. ఎన్నికల ఆటలో గెలుపునకు ఏ ఒక్క ఊత కర్రో ఉపయోగపడి, కుర్చీలో కూర్చోవచ్చు. కానీ, చరిత్ర నుదిటిన సూర్యబింబంలా చిరస్థాయిగా నిలవాలంటే జనమే జీవితమై కేసీఆర్లా బతుకగలగాలి. కాంగ్రెస్ పాలకులు పగతోనో లేక పెద్దగా కనపడాలనే దుగ్ధతోనో బద్నాం దరువును వేస్తున్నారు. డామిట్ కథ అడ్డం తిరిగినట్టు విష ప్రచారమూ వికటించి, రేవంత్ సర్కార్కు రోదన మిగిల్చే రోజులు రావడం మనందరం చూస్తాం.
(వ్యాసకర్త: తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్)
– డాక్టర్ ఆంజనేయగౌడ్
98853 52242