తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ చెప్పిన మాటలు ఇప్పుడు పదేపదే గుర్తుకొస్తున్నాయి. కాంగ్రెస్ తత్వమేమిటో కేసీఆర్కు తెలిసినంతగా మరెవరికి తెలుసు! అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రాబోయే అనర్థాలేంటో కండ్లకు కట్టినట్టు చెప్పారాయన. కరెంట్ కష్టాలు, దళారుల రాజ్యం, కబ్జాలు, అల్లర్లు, మోసాలు, జర్నలిస్టులపై దాడులు, నయవంచన తప్పవని కేసీఆర్ ముందే హెచ్చరించారు. ఆయన మాటలకు దృశ్య రూపమే తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న వరుస ఘటనలు.
కాంగ్రెస్ గురించి బాగా తెలిసినవాళ్లు కూడా కేసీఆర్ మాటలు నిజం కావటానికి దాదాపు రెండేండ్లు పట్టొచ్చని భావించారు. కానీ, వాళ్ల అంచనాలను తలకిందులు చేస్తూ వంద రోజుల్లోనే భవిష్యత్తు తెలంగాణ ఎలా ఉండబోతుందో ట్రైలర్ రూపంలో చూపిస్తున్నారు కాంగ్రెస్ పాలకులు. అసలు పిక్చర్ ఇంకా బాకీ ఉంది. కాలం మారింది, కాంగ్రెస్ కూడా మారి ఉంటుందని భావించి ఓటు వేసిన వాళ్లందరికీ చుక్కలు చూపిస్తున్నది కాంగ్రెస్ సర్కార్. ట్రైలరే ఇంత వైలెంట్గా ఉంటే అసలు సినిమా ఎలా ఉంటుందోనని ఊహించుకుంటేనే వెన్నులో వణుకు పుడుతున్నది.
తెలంగాణ ప్రజల అదృష్టం బాగుంది. అందుకే రాష్ట్రం ఏర్పాటు తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు. ఒకవేళ అదే జరిగి ఉంటే అప్పట్లో తెలంగాణ విఫల ప్రయోగమని చెప్పినవాళ్ల మాటలన్నీ నిజం చేసేవారు కాంగ్రెస్ నేతలు. తెలంగాణవాళ్లకు పాలన చేతకాదని చెప్పి.. మళ్లీ మనతోనే ఆంధ్రాలో కలిపేయాలని ఉద్యమం చేయించేవారు. కానీ, కేసీఆర్ వాళ్లకు ఆ అవకాశం ఇవ్వలేదు. దృఢ సంకల్పంతో స్వరాష్ట్రం కోసం జరిగిన ఉద్యమాన్ని మించి.. తెలంగాణను నిలబెట్టేందుకు కష్టపడ్డారు కేసీఆర్. ప్రాంతం మీద ప్రేమ ఉన్నవాడు పాలకుడైతే ఎంతగా అభివృద్ధి చేయవచ్చు అనేది చేసి చూపించారు. శతాబ్ద కాలం పాటు కష్టపడితే జరిగే అభివృద్ధిని దశాబ్దంలోనే సాధించారు.
గతంలో అన్యాయం జరిగిందనే కదా తెలంగాణ తెచ్చుకుందని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సమయంలో చిలుకపలుకులు పలికారు. ప్రజలు కూడా వాళ్ల మాటలను నమ్మారు. మరి ఇప్పుడు ఏం జరుగుతున్నది. పాలన ఎలా చేయాలో కేసీఆర్ చక్కగా చేసి చూపించారు. అయినప్పటికీ కాంగ్రెస్ నేతలు ఆ తోవలో నడవటం లేదు. పచ్చని తెలంగాణలో ఆత్మహత్యలు, దాడులు, నీటి కష్టాలు, సాగు కష్టాలు ఎందుకు మొదలయ్యాయి? ప్రశ్నించే జర్నలిస్టులపై భౌతికదాడులు, బూతు కామెంట్లు, చెప్పుతో కొడుతామంటూ బెదిరింపులు దేనికి సంకేతం. పదేండ్లలో లేని బాధలు ఇప్పుడే ఎందుకు కనిపిస్తున్నాయి? ప్రజలంతా రోడ్లమీదికి రావాల్సిన దుస్థితి ఎందుకొచ్చింది? రైతులు మళ్లీ ట్రాన్స్ఫార్మర్లను రిపేర్లు చేయించుకోవాల్సిన దురావస్థ ఎందుకు వచ్చింది? ఇన్నేండ్లు లేని కృష్ణా రివర్ బోర్డు పంచాయితీ ఇప్పుడే ఎందుకు ముందుకొచ్చింది? వందరోజుల్లోనే అందరికీ కేసీఆర్ ఎందుకు గుర్తొస్తున్నారు?
ఫోజులు కొట్టుడు వేరు. పనులు చేసుడు వేరు. ప్రజలకు మంచి చేస్తేనే మరో చాన్స్ ఇస్తారని గ్యారెంటీ లేదు. కానీ, అధిష్ఠానాన్ని మెప్పిస్తే ఏదో ఒక పదవి మాత్రం గ్యారెంటీ. కాంగ్రెస్ నాయకులకు మొదటి నుంచి పదవి కాపాడుకోవడంపైనే ధ్యాస ఉండేది. ప్రజల సమస్యలను పరిష్కరించాలనే సోయి కాంగ్రెస్ నేతలకు ఎందుకుంటది? కాంగ్రెస్ పాలిత మిగతా రాష్ర్టాల్లో ఎట్ల పరిపాలన జరుగుతున్నదో అట్లనే మమ అనిపిస్తే చాలు అన్నట్టు ఉంది వారి వైఖరి.
రాష్ర్టాన్ని పాలించడం.. కేసీఆర్ను తిట్టినంత సులభం కాదని ఇప్పుడు కాంగ్రెస్ నేతలకు తెలిసివస్తున్నది. తిట్లు, బూటకపు హామీలతో ఎక్కువ కాలం వెళ్లదీయలేమని వారికి అర్థమవుతున్నది. ప్రశ్నించిన వారిపై దాడులకు దిగటానికి కూడా కొందరు ఏమాత్రం జంకటం లేదు. కానీ, ప్రశ్నల పేరుతో ఇష్టమొచ్చినట్టుగా మాటలతో దాడులు చేసినా వాటిని ‘డోంట్ కేర్’ అంటూ పాలన సాగించారు కేసీఆర్. కొత్త రాష్ర్టాన్ని గాడిలో పెట్టారు. అందుకే ఇప్పుడు కేసీఆర్ విలువ అందరికన్నా ఎక్కువగా ‘సీఎం రేవంత్రెడ్డి అండ్ కో’కే తెలుస్తున్నది.
తెలంగాణ యువత ఇందిరమ్మ పేరును విన్నారే గానీ, ఆమె పాలనను కండ్లారా చూడలేదు. ఇందిరమ్మ రాజ్యం తెస్తామని కాంగ్రెస్ పదేపదే చెప్తే ఎంత అద్భుతంగా ఉంటుందోనని వారంతా భావించారు. అయితే ఆనాటి పరిస్థితులను కండ్లకు కట్టినట్టు కాంగ్రెస్ నేతలు ఇప్పుడు చూపిస్తున్నారు. వారి పాలనను చూసి తెలంగాణకు కాంగ్రెస్ పట్టింది.. పీడదినాలు మొదలయ్యాయని అందరూ ఆవేదన చెందుతున్నారు. ఈ రెండున్నర నెలల పాలన చూశాక తెలంగాణకు కావాల్సింది ఇందిరమ్మ రాజ్యం కాదు, కేసీఆర్ రాజ్యమని ప్రజలకు స్పష్టంగా అర్థమైంది.
– రచ్చ దినేష్ 89787 40475