తెలంగాణ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన శక్తులన్నీ ఇప్పుడు మరోసారి శాసనసభ ఎన్నికల ద్వారా తెలంగాణపై పెత్తనం చెలాయించడానికి మరోసారి తమ ప్రయత్నాలు సాగిస్తున్నాయి. 2018 ఎన్నికల్లో మహాకూటమి పేరుతో బహిరంగంగానే ప్రయత్నించగా, ఇప్పుడు మారువేషాల్లో ఆ ప్రయత్నాలు చేస్తున్నారు. మహా కూటమిలో కాంగ్రెస్ ప్రధాన పక్షం అయినప్పటికీ మహాకూటమి అనే పేరుతో సహ కూటమి ప్రచారంలో చంద్రబాబుదే పెద్దన్న పాత్ర.
ఉద్యమకాలంలో తెలంగాణ ఏర్పాటును అడ్డుకోవడానికి మీడియా తీవ్రంగా కృషిచేసింది. అదే మీడియా 2018లో మహాకూటమిదే అధికారం అనే అభిప్రాయం కలిగించేవిధంగా ప్రచారం చేసింది. తెలంగాణ ప్రజలు ఉద్యమకాలం నాటి స్ఫూర్తి చూపడంతో మహాకూటమి ప్రయత్నాలు ఫలించలేదు.
తెలంగాణ ఏర్పాటుకు సర్వశక్తులు ఒడ్డిన పక్షాలు తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా తమ ప్రయత్నాలను మానలేదు. ఈసారి బాబుతో పాటు షర్మిల, కర్ణాటక నుంచి డీకే శివకుమార్ తెలంగాణలో పెత్తనం కోసం తెరవెనుక ప్రయత్నాలు సాగిస్తున్నారు. తెలంగాణ, ఏపీ రెండు రాష్ర్టాలు ఏర్పడిన తర్వాత చంద్రబాబు పారిశ్రామికవేత్తలతో ఓ సమావేశం నిర్వహించి ఉమ్మడి ఏపీలో దిల్సుఖ్నగర్ సాయిబాబా గుడి వద్ద తీవ్రవాదుల పేలుళ్ల వీడియో చూపించి ‘తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టవద్దు ఆంధ్రలో పెట్టండ’ని చెప్తూ హైదరాబాద్ ఇమేజ్ దెబ్బ తీసే ప్రయత్నం చేశారు. ‘ఆందోళనలు, ఉద్యమాలుండవు మా వద్ద పెట్టుబడులు పెట్టండ’ని బహిరంగంగా కోరారు. తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టమని కోరడం తప్పు కాదు, అది ముఖ్యమంత్రి బాధ్యత. ఇందుకోసం ఇతర రాష్ర్టాలపై తప్పుడు ప్రచారం చేయడం సరైనది కాదు.
సాధారణ మెజారిటీతో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నించారు. అప్పుడు టీడీపీలో ఉన్న ప్రస్తుత పీసీసీ అధ్యక్షులు రేవంత్రెడ్డి ద్వారా మండలి ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఓటు కొనడానికి డబ్బుతో పంపితే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడంతో తెలంగాణ ప్రభుత్వం బతికిపోయింది. బాబు ఓటుకు నోటు ప్రయత్నం విజయవంతమైతే ప్రభుత్వమే కూలిపోయేది. బాబు తాను తెలంగాణకు చేటు చేయాలనుకున్నా ఓటుకు నోటు కేసు వల్ల తెలంగాణకు మేలే జరిగింది. అప్పటివరకు హైదరాబాద్లోనే మకాం వేసి ఆంధ్రను పాలిస్తున్న బాబు ఆంధ్రకు వెళ్లక తప్పలేదు. తర్వాత ఉద్యోగులు తరలివెళ్లారు. ఓటు కొనేందుకు బాబు చేసిన టెలిఫోన్ సంభాషణ రికార్డ్ కావడంతో తెలంగాణకు, ఆంధ్రకు ఓ రకంగా మంచే జరిగింది. రాజధాని, ఉద్యోగులు, ముఖ్యమంత్రి ఆంధ్రకు తరలివెళ్లారు. ఆంధ్ర రాష్ట్ర పాలన ఆంధ్ర నుంచే మొదలుకావడానికి ఉపయోగపడింది. ఆ తర్వాత కూడా బాబుకు తెలంగాణపై పెత్తనం చేయాలనే ఆశ చావలేదు.
2018 ఎన్నికల్లో మహాకూటమి ఏర్పాటుచేసి టీడీపీ, కాంగ్రెస్ కలిసి పోటీచేశాయి. కాంగ్రెస్ వ్యతిరేకతే తెలుగుదేశం సిద్ధాంతం అని ఎన్టీఆర్ కాలం నుంచి ఆ పార్టీవాళ్లు గర్వంగా చెప్పుకొనేవారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ నివాసానికి లక్ష్మీపార్వతి కాంగ్రెస్ నేత టి.సుబ్బిరామిరెడ్డికి భోజనానికి పిలిచారని పవిత్ర టీడీపీని అపవిత్రం చేశారని బాబు వర్గం విమర్శలు చేసింది, భోజనానికి పిలిస్తేనే అపవిత్రం చేశారని విమర్శించిన వారు తెలంగాణలో పెత్తనం చేయడానికి కాంగ్రెస్తో కలిసి పోటీచేశారు. 2018 ఎన్నికల్లో మహాకూటమి గెలుపు ఖాయమని ఎవరికి వారు తామే ముఖ్యమంత్రి అన్నారు. మంత్రివర్గాలను ఏర్పాటుచేసుకున్నారు. తీరా ఫలితాలు వచ్చాక టీడీపీ, కాంగ్రెస్ రెండూ చతికిలపడ్డాయి. ఎన్టీఆర్ మనవరాలు సుహాసినిని కూకట్పల్లిలో నిలబెట్టి బాలి చేశారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బాబు, లోకేష్ విస్తృతంగా ప్రచారం చేసినా ఒకే ఒక వార్డుకు పరిమితమయ్యారు. తెలంగాణ ఎన్నికల్లో ప్రజలు తమను నమ్మరని అర్థమైన తర్వాత బాబు ఇప్పుడు బహువేషాల్లో తెలంగాణలో అధికారం చెలాయించడానికి ప్రయత్నిస్తున్నారు.
చంద్రబాబును స్కిల్ స్కామ్ కేసులో అరెస్టు చేసి రాజమండ్రి జైల్లో వేసిన తర్వాత ఆంధ్రలో కన్నా ఆ పార్టీ సానుభూతి పరులు, మద్దతుదారులు హైదరాబాద్లోనే ఎక్కువగా ఆందోళనలు చేశారు. అరెస్టుకు ముందు బాబు ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈసారి తెలంగాణలో అధికారంలోకి వస్తామని ప్రకటించారు. అరెస్టు తర్వాత ఈ సారి తెలంగాణలో ఎగిరేది టీడీపీ జెండానే అని లోకేష్ ట్వీట్ చేశారు.
బాబు అరెస్టును ఖండించలేదని ఈసారి కాంగ్రెస్ను అధికారంలోకి తెస్తామని టీడీపీ అభిమానులు, టీడీపీ తటస్తులు, కుల సంఘం ప్రకటించాయి. మా పార్టీని గెలిపించుకుంటామనడం మామూలే కానీ, వారికి ఓ పార్టీ ఉన్న తర్వాత మరో పార్టీని గెలిపిస్తామనడం విచిత్రం. వీరి ప్రకటనకు తగ్గట్టే తెలంగాణలో ఈసారి పోటీ చేయకూడదని టీడీపీ నిర్ణయాన్ని ప్రకటించింది. తెలంగాణలో పోటీకి దూరమన్నారు కానీ, తెలంగాణపై పెత్తనం చేయాలనే రాజకీయానికి దూరంగా లేరు. కాంగ్రెస్ ద్వారా తెలంగాణలో పెత్తనం చెలాయించడానికి బాబు ప్రయత్నిస్తున్నారు. పవన్కళ్యాణ్, చంద్రబాబు భేటీ అయిన కొద్దిసేపటికే జనసేన బీజేపీ మధ్య తెలంగాణలో పొత్తు ఖరారైంది.
బాబు అటు కాంగ్రెస్ కోసం, ఇటు బీజేపీ కోసం తెరవెనుక ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఆంధ్రలో బీజేపీ పొత్తు కోసం బాబు ప్రయత్నిస్తున్నా బీజేపీ స్పందించడం లేదు. పవన్ ద్వారా బాబు ఆ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఖమ్మం జిల్లా టీడీపీ అధ్యక్షుని ఇంటికి కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు వెళ్లి మద్దతు కోరారు. కాంగ్రెస్, టీడీపీ నాయకుల స్నేహానికి ఖమ్మంలో తుమ్మల శ్రీకారం చుట్టారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకువస్తానని షర్మిల పాదయాత్ర చేశారు. అలసట తప్ప తెలంగాణ ప్రజల నుంచి మద్దతు లభించలేదు. సొంత పార్టీ ద్వారా తెలంగాణపై పెత్తనానికి షర్మిల చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో కాంగ్రెస్ ద్వారా తెలంగాణలో పెత్తనానికి ఆమె ప్రయత్నిస్తున్నారు. ఒక్క సీటు కూడా లేకుండా ఆమె కాంగ్రెస్కు మద్దతు ప్రకటించారు. తాను కూడా పోటీ చేయడం లేదని ప్రకటించారు. తాము పోటీ చేయకపోయినా కాంగ్రెస్ గెలిస్తే పెత్తనం చేయవచ్చనేది బాబు, షర్మిల బృందం ఆశ. వీరికి ఇంతకాలం అండగా నిలిచిన మీడియా సైతం వీరి దారిలోనే కాంగ్రెస్ ద్వారా తెలంగాణపై అధికారం చెలాయించాలనుకుంటున్నది.
ఆంధ్ర నాయకుల పెత్తనాన్ని చైతన్యవంతమైన తెలంగాణ అంగీకరించదు. ఆంధ్రాలోనే బాబుకు రాజకీయ భవిష్యత్తు కనిపించడం లేదు. ఇక తెలంగాణలో ఆదరణ ఉంటుందా? ఏ రూపంలో వచ్చినా గుర్తించేంత చైతన్యం తెలంగాణలో ఉన్నది. ప్రతి ఎన్నికల్లో అది నిరూపిస్తున్నారు. ఈ ఎన్నికల్లోనూ నిరూపిస్తారు.
– బుద్దా మురళి