తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ ప్రదాత, వైతాళికుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ ప్రజా ఆశీర్వాద సభలలో మోసపోతే గోసపడతారని పదేపదే హెచ్చరిస్తున్నారు. ప్రజాస్వామ్యం పరిఢవిల్లి అది మంచి ఫలితాలను ఇవ్వాలంటే ఓటర్ కీలకం. తమ ప్రతినిధుల జాతకాన్ని నిర్ణయించేది ప్రజలేనని, ఆ సత్తా బ్యాలెట్ బాక్స్లో కనపడాలని పదేపదే చెప్తున్నారు. పోటీచేసే వ్యక్తితో పాటు పార్టీ చరిత్రను చూడాలని చెప్తున్నారు.
ఓటు వేసేటప్పుడు పార్టీల చరిత్ర, వాటి వైఖరులు, దృక్పథాలు, ఎన్నుకునే ప్రతినిధి చరిత్ర, తమ అభివృద్ధి పట్ల ఆయన వైఖరులు చూడాలని నొక్కి వక్కాణిస్తున్నారు సీఎం కేసీఆర్. ఇదంతా నిజమేనా అని ఇంటికి పోయిన పిమ్మట ప్రతి ఒక్కరూ చర్చించుకోవాలని, తెలియని వాళ్లకు చెప్పాలని పేర్కొంటున్నారు.
ప్రస్తుత ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. అవి బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు. దేశాన్ని నాలుగు దశాబ్దాలు పాలించిన కాంగ్రెస్పార్టీ, పదేండ్లుగా దేశాన్ని పాలిస్తున్న బీజేపీ పదేపదే అబద్ధ్దాలను వల్లె వేస్తున్నాయి. వివిధ ఎన్నికల సభల్లో ప్రజలను అబద్ధ్దాలతో భావోద్వేగాలను రెచ్చగొట్టి వాటిని ఓటుగా మార్చుకొని అధికారం పొందాలని ఆరాటపడుతున్నాయి.
మరి కాంగ్రెస్ వైఖరులు దృక్పథాలు చూస్తే 1944లో నెహ్రూకు గాంధీ ఉత్తరం రాస్తూ స్వాతంత్య్రానంతరం మన ఆర్థిక విధానాలలో గ్రామాలే అభివృద్ధికి పట్టుకొమ్మలని కాబట్టి, లఘు, కుటీర, చిన్న తరహా పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలని, అప్పుడే నిజమైన అభివృద్ధి అని, మళ్లీ ప్రపంచపటంలో భారత్ కనపడుతుందని వెల్లడించారు. కానీ నెహ్రూ తిరిగి గాంధీకి ఉత్తరం రాస్త్తూ ఈ పల్లె ప్రజలను నమ్మవద్దని, వారు మోసకారులని వారిని అభివృద్ధిలోకి తీసుకురావడం సాధ్యం కాదని జవాబు ఇచ్చారు.
ప్రధాని అయిన తర్వాత నెహ్రూ 1953 జూన్ 23న రష్యాను అధికారికంగా సందర్శించారు. వారి అభివృద్ధి వ్యూహనికి నెహ్రూ ఆకర్షింపబడ్డారు. రష్యా నమూనా మనదేశంలో కూడా ప్రవేశపెట్టాలని 1956లో ఒక పారిశ్రామిక విధానాన్ని రూపొందించారు. అదే భారత ఆర్థిక రాజ్యాం గం. ఇందులో ఏ, బీ, సీ షెడ్యూల్లో ఏ పరిశ్రమ లు ఎవరు స్థాపించాలో నిర్ణయించారు. అయితే సీ షెడ్యూల్లోని వినియోగ వస్తు పరిశ్రమల మొత్తాన్ని ప్రైవేట్ రంగానికి అప్పగించారు. పైగా ఉత్పత్తి పద్ధతులపై గాని, వస్తు ఎంపికపై గాని ఎలాంటి షరతులు విధించలేదు. దీని ఫలితమే ఈ దేశంలో నిరుద్యోగం, గాజు తెర ఆర్థిక వ్యవస్థ. మరొకవైపు బిలాయ్, బొకారో, దుర్గాపూర్, రూర్కెల వంటి భారీ పరిశ్రమలు నిర్మించారు. వీటి నుంచి ట్రాక్టర్ లాంటి తేలిక రకం యంత్రాలను తయారుచేసి వాటిని వినియోగ వస్తువు ఉత్పత్తి చేసే రంగంలో ప్రవేశ పెట్టడం వల్ల ఈ దేశంలో ఉద్యోగాలు లేకుండా పోయాయి. ఇది రష్యా నమూనా. అందుకే ఈ ఖర్మ.
సామాజిక న్యాయం కావాలంటే భూసంస్కరణ అవసరమని వీటిని రెండు దశల్లో అమలు జరిపారు. 1969లో పీసీ మహల్ నోబిస్ కమిటీ ఆరు కోట్ల 89 లక్షల ఎకరాల మిగులు భూమి ఉందని అంచనా వేయగా 2013 వరకు ఈ దేశంలో పంచిన భూమి 65.5 లక్షల ఎకరాలు మాత్రమే. 1969 లో బ్యాంకులు జాతీయం చేసింది. వంద రూపాయలు బ్యాంకులు అప్పుగా ఇస్తే అందులో వ్యవసాయరంగానికి ఇచ్చేది 20 రూపాయలు మాత్రమే. 1974లో గరీబీ హఠావో అన్నది. ఐదవ ప్రణాళికలో పేదరిక నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నది. పేదరిక నిర్మూలన జరిగిందా? 1978లో అధికారంలోకి వచ్చిన జనతా ప్రభుత్వం మళ్లీ గ్రామీణ అభివృద్ధికి చిన్న తరహా పరిశ్రమలకు ప్రాధాన్యం ఇస్తే, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 21వ శతాబ్దంలోకి దేశాన్ని తీసుకుపోవాలని ముఖ్యం గా రాజీవ్గాంధీ నాసి రకం యంత్రాలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. వాటితో ఉత్పత్తి చేసిన వస్తువులు ఇతర దేశ వస్తువులతో పోటీ పడలేకపోయాయి.
విదేశీ వ్యాపార చెల్లింపుల శేషంలో విపరీతంగా లోటు పెరిగిపోయింది. రూపాయి విలువ పడిపోయింది. అప్పులు పెరిగిపోయి అప్పులు పుట్టని స్థితి వచ్చింది. దీని ఫలితమే ఎనిమిదో ప్రణాళికను సూచనాత్మక ప్రణాళికగా మార్చుకున్నాము. సంస్థాగత సర్దుబాటు పద్ధతి కింద ఐఎంఎఫ్ నుంచి అప్పు తెచ్చుకున్నాం. ఫలితమే ప్రైవేటీకరణ. కుంభకోణాలకు పునాది వేసిందే కాంగ్రెస్. ఇవి కొన్ని ఆర్థిక సంఘటనలు మాత్రమే. ఇదీ కాంగ్రెస్ చరిత్ర.అందుకే కేసీఆర్ మోసపోతే గోస పడుతారంటున్నారు.
భిన్నత్వంలో ఏకత్వానికి విఘాతం కలిగిస్తున్నది బీజేపీ. మతాన్ని అధికారానికి వాడుకుంటుంది ఆ పార్టీ. లౌకిక, ఇండి యా అనే పదాలను చరిత్ర నుం చి తొలగిస్తున్నది. ప్రజాస్వామ్య నాలుగు స్తంభాలను, వాటి ఉనికిని ప్రశ్నిస్తుంది. సమాఖ్య వ్యవస్థను ప్రశ్నిస్తుంది. ఒకే దేశం, ఒకే మతం ఒకే విధానం- ఒకే పన్ను ఉండాలంటున్నది. వివిధ ప్రపంచ వేదికలలో ప్రపంచమే వసుదైక కుటుంబంలా ఉండాలంటున్నది. ప్రభుత్వ రంగ సంస్థ లు అమ్మడానికి ఏకంగా మంత్రిత్వ శాఖను ఏర్పా టు చేసిన ఘనత బీజేపీది. ధన బలంతో ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొట్టింది. కార్పొరేట్లకు సంబంధించిన రూ.12 లక్షల కోట్ల అప్పు ల్ని రద్దు చేసింది. ఇలా ఎన్నో సంఘటనలు. అందుకే కేసీఆర్ మోసపోతే గోసపడుతారంటున్నారు.
తెలంగాణ భూములంటే తొండలు గుడ్లు పెట్టే భూములనీ, ఈ జనానికి లౌక్యం లేదని, పరిపాలన చేసుకోవడం కూడా చేతకాదని వెక్కిరించారు. మరి టీఆర్ఎస్ ఏం చేసింది? ప్రాణాలను పణంగా పెట్టి ఆరు దశాబ్దాల తెలంగాణ బానిస సంకెళ్లను తెం చింది. పాతాళంలో ఉన్న నీళ్లను తెచ్చి సస్యశ్యామలం చేసింది. తన్నుకు పోతున్న నిధులను ఆపి ధనిక రాష్ట్రంగా మార్చింది. ఎ న్నో మౌలిక వసతుల్ని కల్పించింది. ఒక లక్షా 32 వేల ఉద్యోగాలు ఇచ్చింది. ప్రైవేట్ రంగంలో సుమారు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చి ంది. పెట్టుబడులకు స్వర్గధామంగా మారింది. తలసరి ఆదాయం 150 శాతం పెరిగింది. విద్యుత్తు వినియో గం 100 శాతం పెరిగింది. ఇదీ తెలంగాణ అభివృద్ధి చరిత్ర. సమయం ఆసన్నమైంది. ఓటు ఎంతో అమోఘమైంది. కనుక సరైన వారిని ఎన్నుకోండి. మోసపోతే గోస పడుతారు.
– పొందూరు ప్రభాకర్ రావు 90106 31727