చింత చచ్చినా పులుపు చావదన్నట్టు… అధికారంలో ఉన్నా, లేకపోయినా కాంగ్రెస్లో కుట్రలు, కుతంత్రాలకు మాత్రం తక్కువేం ఉండదు. ప్రత్యర్థుల ఎత్తుగడల పట్ల అప్రమత్తంగా లేకపోతే, మెడలో వేసుకోవాల్సిన కండువా నెత్తిన వేసుకునే పరిస్థితి వస్తుందని భయపడుతుంటారు. అలాంటి అనుభవమే ఒకటి తనకు ఇటీవల ఎదురైనట్టు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన సన్నిహితుల వద్ద బయటపెట్టారు. తన సోదరుడు రాజగోపాల్రెడ్డి బీజేపీలో చేరబోతున్నట్టు తెలియడంతో ఎలాగైనా ఆపాలని కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, భట్టి విక్రమార్కను ఢిల్లీకి పిలిపించి చర్చించింది. ఇది తనకు సున్నితమైన అంశం కావడం వల్ల అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చినా జ్వరం సాకుతో వెంకటరెడ్డి వెళ్లలేదు.
అధిష్ఠానంతో భేటీ అయిన నేతలు రాజగోపాల్రెడ్డిని పార్టీ మారకుండా ఆపే ప్రయత్నంపై కాకుండా ఉపఎన్నికలు వస్తే అతనిపై పోటీకి సోదరుడు వెంకట్రెడ్డిని బరిలోకి దించాలనే విషయంపై చర్చించినట్టు చెవిలో పడింది. తనను బరిలోకి దింపాలనే వ్యూహం వెనుక ఒక దెబ్బకు రెండు పిట్టలను కొట్టే కుట్ర దాగి ఉందని వెంకట్రెడ్డి అనుమానిస్తున్నారు. మనుగోడులో బీజేపీ, కాంగ్రెస్ నుంచి తామిద్దరం పోటిపడితే కాంగ్రెస్ ఓట్లు చీలిపోయి తామిద్దరం ఓడిపోతే ఇక పార్టీలో వారికి తిరుగుండదనే మాస్టర్ ప్లాన్ దాగి ఉన్నదని, ఈ ప్లాన్ రేవంత్దా? భట్టిదా? ఉత్తమ్దా? అని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆరా తీసినట్లు సమాచారం.